20, జనవరి 2026, మంగళవారం

సమూయేలు చరిత్ర

 

సమూయేలు చరిత్ర 

సమూవేలు  పవిత్ర గ్రంధంలో ఉన్న న్యాయాధిపతులలో చివరి  న్యాయాధిపతి మరియు న్యాయాధిపతులో ఎక్కువ కాలం జీవించినవాడు. యిస్రాయేలు చరిత్రలో సమూవేలు  అనేక ముఖ్యమైన  విధులను  పోషించాడు. సమూవేలు ఒక యాజకునిగా, న్యాయాధిపతిగా, జీవితపు చివరి అంకంలో ఓక జాతికి గొప్ప నాయకునిగా జీవించాడు. ఒక ప్రవక్తగా  యిస్రాయేలు మొదటి ఇద్దరు రాజులను అభిషేకించాడు.  సమూవేలు యిస్రాయేలు ప్రజలకు మరియు  దేవునికి మధ్యవర్తిగా మరియు వారి కోసం దేవుని అనుగ్రహం కోరేవానిగా పవిత్ర గ్రంథం తెలియజేస్తుంది.  సమూవేలు జీవిత కాల సమయంలో ముఖ్యమైన విషయం ఏమిటంటే యిస్రాయేలు ప్రజలు దేవునితో వారి సంబంధమును పునరుద్ధరించుకోవడంజరిగింది. ఈ కాలంలో దేవుని పట్ల వారు చూపిన విశ్వాసంతో ఎంతగా  వారు లాభపడినది, తరువాత    అవిశ్వాసంతో ఏమి   కోల్పయింది సుష్పష్టంగా కనపడుతుంది.  

సమూవేలు అంటే దేవుడు విన్నాడు అని అర్ధం. సమూవేలు తన జీవితాంతం దేవునికి విశ్వాస పాత్రునిగా, విధేయునిగా జీవించాడు. సమూవేలు చిన్నప్పటి నుండి ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి.  ఇతని జీవితం మొత్తం. దేవుని మాటను వినడం, ఆయనకు విధేయించడం గురించి తెలియజేస్తుంది. సమూవేలు పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు దేవునికి విధేయునిగా జీవించాడు. దేవుడు సమువేలును తన అనుచరులలో గొప్పవానిగా చూసాడు. కీర్తన 99:6-7 "మోషే అహరోను ఆయన  యాజకులు , సమువేలు ఆయనకు ప్రార్ధన చేసినవాడు. వారు ఆయనకు మనవి చేయగా ఆయన వారి వేడికోలును ఆలించెను. మేఘ స్థంభం నుండి ఆయన వారితో మాట్లాడెను ఆయన దయచేసిన శాససనములను, కట్టడలను వారు పాటించిరి."  చిన్నప్పటి నుండి దేవుని వాక్కును వినుటను అలవాటు చేసుకున్నవాడు. సమువేలు జీవితం మొత్తం దేవునికే మహిమ ఆరాధన అని తెలియజేస్తుంది. 

హన్నా ప్రార్ధన సమువేలు జననం 

హన్నా సమూవేలు తల్లి. ఆమెకు  పెళ్ళైన   అనేక సంవత్సరాల వరకు పిల్లలు పుట్టలేదు. ఆమె భర్త ఎల్కానా.  ఎల్కానాకు ఇద్దరు భార్యలు ఉన్నారు వారిపేర్లు హన్నా, పెనిన్నా అను వారు. పెనిన్నాకు పిల్లలుపుట్టారు  కాని  హన్నాకు మాత్రము లేరు. ఎల్కానా షిలోలోఉన్న మందసము వద్ద  బలి అర్పించి, వచ్చిన నైవేధ్య  భాగాన్ని  పెనిన్నాకు ఆమె  సంతానానికి ఇచ్చేవాడు.  హన్నాకు మాత్రము ఒక భాగమే ఇచ్చేవాడు.  భర్త హన్నాను ప్రేమించినప్పటికీ  ఆమె గొడ్రాలు అవుటవలన ఇలా చేసేవాడు.పెనిన్నా కూడా ఆమెను ఎగతాళి చేసేది. యావే మందిరమునకు వెళ్ళినప్పుడల్లా   పెనిన్నా ఆమెను దెప్పిపొడిచేది. హన్నా మాత్రము ఎప్పుడు వాటిని ఇతరులకు చెప్పడంకాని, వారికి వ్యతిరేకంగా మాట్లాడటం కాని చేసేదికాదు.  తన బాధలను దేవునితో మాత్రమే చెప్పుకునేది. ఒక సారి బలి అర్పించుటకు షిలో వెళ్లారు. అక్కడ దేవుని ఎదుట తన బాధను   నిట్టూర్పుతో, ఏడుపుతో దేవునితో  మాటలాడుతుంది. వారు షిలోవద్ద బలి అర్పించిన తరువాత హన్నా ఆలయంలో ఏడ్చుచు ప్రార్థిస్తుంది. యాజకుడైన ఏలి ఆమెకు త్రాగుట వలన   కైపెక్కినది అనుకోని ఎంతసేపు ఆ మత్తుతో ఉంటావు.  ద్రాక్షసారాయమును వదిలించుకోమని చెప్పాడు. అందుకు  ఆమె ,  అయ్యా నేను డ్రా  త్రాగలేదు, తీరని వేతతో బాధపడుతున్నాను, ,మిక్కిలి  కోపతాపములతో మనసు, హృదయము బ్రద్దలవుతుంటే  ప్రభువుతో మాటలాడుచున్నాను అని చెప్పింది. అందుకు  ఏలి ఆమెతో  దేవుడు నీ మోర ఆలకిస్తాడు,   ప్రశాంతంగా వెళ్ళమని చెప్పాడు. దాని తరువాత వారు రామాకు తిరిగి వెళ్లారు. 

షిలో నుండి ఇంటికి వచ్చిన తరువాత  ఎల్కానా తన భార్య హన్నాను  కలువగా  ఆమె గర్భము ధరించి   కుమారున్ని కన్నది. ఆ  బిడ్డకు సమూవేలు అని పేరు పెట్టారు. సమూవేలు అనగా దేవుని అడిగితిని అని అర్ధం. తరువాత ఆ కుటుంబం మరియొకసారి   షిలోకు వెళ్లారు కాని హన్నా వారితో వెళ్ళలేదు. ఆమె ఎల్కానా మరియు కుటుంబంతో వెళ్లకుండ, సమూవేలు పాలు మానిన సమూవేలును  యావేకు సమర్పిస్తాను అని ఇంటివద్దనే ఉంది. అందుకు ఏల్కానా ఒప్పుకున్నాడు. సమూవేలు పాలు మానిన తరువాత హాన్నా సమూవేలును   తీసుకొని షిలో వెళ్లి అక్కడ బలిని అర్పించి, బాలుని ఎలి వద్దకు తీసుకువెళ్లి, తనకు జరిగిన అన్ని విషములు చెప్పి, బాలున్ని దేవునికి అర్పించి, ఈ బాలుడు జీవించినంత కాలము ప్రభువుకె ఊడిగము చేయును అని చెప్పింది. అప్పటి నుండి సమూవేలు ప్రభువు మందిరమునే ఉన్నాడు.  హన్నా గొప్ప ప్రార్థన చేసి రామాకు వచ్చింది సమూవేలు మారాము ఎలి పర్యవేక్షణలో యావేకు సేవ చేస్తూ, జీవించాడు.  

ఏలి కుమారులు - యావే సమూవేలును ఏర్పరుచుకొనుట 

ఏలి కుమారులు ప్రభువును  లెక్క చేయక పరమ దుర్మార్గాలు చేశారు. బలి మాంసము వండు సమయములోనే యాజకునికి మాంసము కావాలని తీసుకువెళ్ళేవారు, బలిపశువు క్రొవ్వును పీఠము మీద దహించకముందే యాజకునికి వడ్డించుటకు మాంసం కావాలి, ఉడికినది కాదు అని ముందే  తీసుకెళ్లేవారు. వారివల్ల  యావేకు సమర్పిచు బలికి అగౌరవం కలిగేది. హన్నా ప్రతి సంవత్సరం బలి అర్పించుటకు వచ్చినప్పుడు చిన్న ఏఫోదును తీసుకు వచ్చేది. సమూవేలు దానిని ధరించి యావేకు పరిచర్య చేసేవాడు తరువాత ఆమెకు ముగ్గురు మగ బిడ్డలు ఇద్దరు ఆడ బిడ్డలు పుట్టారు.  

ఏలి ముసలివాడవ్వగా  తన కుమారులు    ప్రభువు గుడారము దగ్గర పనిచేసే  వారితో శయనించారని  తెలిసి, దేవుని పట్ల వారు చేసిన పాపము చెప్పి వారిని మందలించాడు.  కాని వారు ఏలి మాటను పట్టించుకోలేదు. సమూవేలు మాత్రము దేవుని దయకు , ప్రజల మన్ననలకు  పాత్రుడయ్యాడు. దేవుని భక్తుడు ఒకరు ఏలి వద్దకు వచ్చి ఏలి కుమారులు ఇద్దరు ఒక్కరోజే చనిపోతారని చెప్పి, యావే విశ్వసనీయుడైన యాజకునిని ఏర్పరుచు కున్న విషయం చెప్పాడు, ఆ యాజకుడు యావే చిత్తప్రకారం జీవించునని,  అతని సంతతి తరతరములు యావే అభిషిక్తుని ఎదుట మన్నన పొందుతారు అని చెప్పాడు. ఏలి తన కుమారులను మార్చుటకు ఏమి చేయలేదు, కాని హన్నా తన కుమారుని దేవుని సన్నిదిలో అప్పగించింది. ఏలి కుమారులు కూడా దైవ సన్నిధిలోనే ఉన్న వారు మారలేదు. ఏలి కూడా తన కుమారులు ఆడువారిని చెడుచుతున్నారు అని తెలిసిన ఏమి చేయలేదు. ఏలి కుటుంబం  దేవుని సన్నిధిలో ఉండి ఆయన పేరుకు అవమానం కలిగేలా ప్రవర్తించారు. కానీ అక్కడనే ఉన్న సమూవేలు దేవునికి గౌరవం కలిగేలా జీవించాడు. ఎటువంటి వారితో కలిసిఉన్న కాని పాపము చేయకుండా  జీవించడం సమూవేలు ద్వారా తెలుసుకోవచ్చు. 

సమూవేలును  దేవుడు పిలుచుట 

సమూవేలు మందసము దగ్గర నిద్రించుండగా దేవుడు సమూవేలును సమూవేలు, సమూవేలు అని పిలిచాడు. దేవుని వాక్కు వినపడటం ఆ రోజులలో చాల అరుదు. సమూవేలును హన్నా  దేవుని సేవకు సమర్పించినప్పటికీ ఆయనను తన సేవకు  పిలువలసినది దేవుడు. దేవుడు సమూవేలును పిలిచినప్పుడు తన గురువు ఏలి పిలిచినట్లుగా అనుకున్నాడు. ఏలి సమూవేలుకు దేవుని పిలుపును అర్ధం చేసుకొనుటకు సహాయం చేసాడు. ఏలి సమువేలుకు దేవుని పిలుపుకు ఎలా సమాధానము ఇవ్వాలో తెలియజేసాడు. ఏలి సమూవేలుతో మాట్లాడు ప్రభు నీ సేవకుడు వినుచున్నాడు అని సమాధానం ఇవ్వమని చెప్పాడు.   ఏలి కుమారులు  ఘోరమైన పాపములు చేశారు. సమూవేలు ద్వారా  దేవుడు ఏలికి ఒక హెచ్చరిక పంపించాడు.  

దేవుడు  సమూవేలుకు దేవుడు ఇచ్చిన సందేశం అందరికి హెచ్చరిక అయ్యింది. అది ఏమిటంటే  "యిస్రాయేలు జనుల ఎదుట నేనొక  కార్యము చేసెదను దానిని గురించి వినిన వారి రెండు చెవులు గింగురుమనును , ఏలి కుటుంబమునునకు నేను చేసెదననిన కార్యము పూర్తి చేస్తాను ఏలి కుటుంబమును చాల కాలమువరకు శపించితినని తెలియజేయమని, ఎలి కుమారులిద్దరు దేవుణ్ణి నిందించున్నారని ఎరిగియు  మందలింపలేదు, బలులు ,కానుకలు ఏలి కుమారుల పాపలకు ప్రాయశ్చిత్తం చేయలేవు"  అని ప్రభువు సమూవేలుకు చెప్పాడు. ఎలి సమూవేలుతో ఏమి దాచవద్దు దేవుడు నీకు చెప్పినదంత చెప్పమని చెప్పాడు.  సమూవేలు దేవుడు చెప్పిన మాటలు ఏలికి చెప్పిన  తరువాత ఆయన చేయదలుచుకున్న కార్యము చేయునుగాక అని ఏలి  బదులు పలికాడు.

 సమువేలు పెరిగి పెద్దవాడయ్యాడు.  అయన చెప్పిన ప్రతి మాట జరిగింది. ఏలి  అతని కుమారులు చనిపోయారు. దివ్య మందసంపు పెట్టెను ఫిలిస్తీయులు  యుద్ధంలో తీసుకెళ్లారు అని తెలిసి కూర్చున్న చోటనే వెనక్కు వాలి,  మెడ విరిగి చనిపోయాడు. మామ, భర్త చనిపోయారు  అని తెలిసి బిడ్డను ప్రసవించి  ఏలి కోడలు చనిపోయింది. 

మందసమును పిలిస్తియులు ఎబెసెనేరు నుండి అష్డోదునకు తెచ్చారు. అక్కడ దాగోను దేవాలయములో ఉంచారు. ఉదయముకాగానే  దాగోను యావే మందసము ఎదుట నేలపై బోరగిలపడి ఉంది. వారు దాగోనును లేవనెత్తి మరల అక్కడ నిలబెట్టారు.   కాని  తరువాత రోజు మరల దాగోను  యావే మందసము ఎదుట  బోరగిలపడి తల, చేతులు నరకబడి గడప దగ్గర ఉన్నవి. యావే అష్డోదును పరిసరప్రాంత ప్రజలను బొబ్బలతో బాధ పెట్టగ,  అందుకు వారు తట్టుకోలేక మందసమును గాతునకు చేర్చారు. గాతు ప్రజలు కూడా ప్రభువు పెట్టు బాధలు తట్టుకోలేక ఎక్రోనునకు పంపారు. అక్కడ అనేక మంది చనిపోయారు .  మందసము ఏడు మాసములు పిలిస్తుయులతో ఉండగా వారు తట్టుకోలేకపోయారు. ప్రభువు మందసమును వారు అక్కడ నుండి పంపించి వేయుటకు ఎంతో గౌరవంగా బెత్ షెమెషు పొలిమేరల వద్దకు తీసుకు  వచ్చి అక్కడనుండి వెళ్లిపోయారు. బేత్ షేమేషు పౌరులు మందసము వారి కంటపడగానే ఆనందంతో ప్రభువుకు బలి  అర్పించారు.  తరువాత ఆ ప్రజలు పరమ పవిత్రమైన ఆ ప్రభువు ముందట నిలువలేమని కిర్యత్యారీము పంపారు.  అక్కడ  ప్రజలు ప్రభుమందసమును అబీనాదాబు ఇంట చేర్చారు.  అబీనాదాబు కుమారుడు ఎలీయెజెరును ఆ మందసమును శుద్ధి చేసి, కాపాడుటకు నియమించారు. 

అక్కడ మందసము 20 సంవత్సరాలు ఉన్నది.  ప్రజలకు యావేపై  భక్తి కుదిరింది. అప్పుడు సమూవేలు ప్రజలతో  మీరు ప్రభువు వద్దకు రాగోరెదరేని, మీరు కొలుచు అన్యదైవములను వదలివేయండి,  అష్టోరోతును కూడా మీ చెంతనుండి పంపివేయండి,  అపుడు పిలిస్తియుల నుండి యావే మిమ్ము కాపాడుతాడు అని చెప్పాడు. వారు అప్పుడు బాలుదేవతను, అష్టోరోతును వదలి వేశారు. ప్రభువును మాత్రమే  సేవించారు. సమూవేలు ప్రజలను మిస్పా వద్ద  సమావేశ పరచి అక్కడ ప్రజల కొరకు విన్నపం చేస్తాను అని చెప్పడం జరిగింది.  ప్రజలు మిస్పా వద్ద  సమావేశమై నీళ్లు త్రోడి యావే ముందు కుమ్మరించి, ఆరోజు ఉపవాసం ఉండి యావే  ఆజ్ఞ మీరి పాపము చేసాము అని ఒప్పుకున్నారు. అక్కడ వారి కొరకు సమూవేలు దేవుని ప్రార్ధించాడు.

 యిస్రాయేలు మిస్పా వద్ద  సమావేశం అయ్యారు  అని ఫిలిస్తీ యులు  విని వారి మీదకు దండెత్తి వచ్చారు. అప్పుడు  ప్రజలు సమూవేలుకు వారికోసం దేవుణ్ణి వెడమని అడుగగా సమూవేలు ఒక  పాలు తాగు గొర్రె పిల్లను అర్పించాడు. సమూవేలు బలి అర్పించుచుండగానే వారు వచ్చారు యిస్రాయేలు ప్రజలు యుద్దానికి సిద్ధంగా లేరు కనుక దేవుడు  ఉరుము మెరుపుతో వారిలో ఒక గందరగోళం సృష్టించారు, ఆ దెబ్బతో పిలిస్తియులు చెదరిపోయారు. యిస్రాయేలీయులు వారి వెనుకపడి బెత్ కారు వరకు తరిమివేసారు. సమూవేలు మిస్పా మరియు షెను మధ్య ఒక రాతిని యావే వారికి చేసిన మేలుకు గుర్తుగా  నాటారు దానికి ఎబెనెసెరు  అని పేరు పెట్టారు.   యావే ఇంత వరకు మనకు సహాయం చేసెను అని దాని  అర్ధం. సమూవేలు జీవించినంత వరకు ప్రభువు పిలిస్తియులను అణచివేశారు.  సమూవేలు ఉన్నంత వరకు వారికి తీర్పు తీర్చుచూనే ఉన్నాడు. ఆయన్న బేతేలు, గిల్గాలు ,  మిస్ఫా చుట్టి వచ్చి వారికి తీర్పు తీర్చేవాడు. సమూవేలు ప్రాయము దాటిన తరువాత ఆయన కుమారులు యావేలు  మరియు అబీయాలు న్యాయాధిపతులు అయ్యారు కాని వారు లంచగొండులయ్యారు కనుక ప్రజలు రామాకు వచ్చి సమూవేలును  కలుసుకొని అయ్యా నీవు ముసలి ప్రాయంలో ఉన్నావు నీ కుమారులు నీలాంటి వారు కారు కనుక మాకు అన్య జాతుల  వలె ఓక రాజును నియమించండి అని  చెప్పారు.   పెద్దల వేడుకోలు సమువేలుకు నచ్చలేదు. 

అపుడు సమూవేలు ప్రభువుతో మాట్లాడగా, ప్రభువు ఈ ప్రజలను  వినుము, వీరు నిన్ను  కాదు నన్ను నిరాకరించారు, వీరిని  ఐగుప్తునుండి  తీసుకొనివచ్చినప్పటి నుండి నాకు చేసినట్లే నీకును అపచారము చేశారు. వీరు వేరే దేవరలను కొలిచారు, నీవు వారి మాట వినుము కానీ గట్టిగా హెచ్చరించమని చెప్పగా  సమూవేలు ప్రభువు చెప్పిన మాటలను ప్రజలకు చెబుతూ మీరు కోరుకునే  రాజు మీ కుమారులను రథములను తోలుటకు, గుఱ్ఱములను కాపాడుటకు, రథముల ముందు పరుగెత్తుటకు, సైన్యములో కొంతమందికి అధిపతులుగా నియమిస్తాడు,  వారితో పొలము దున్నించి కొత కోయుటకు, యుద్ధ సామాగ్రిని తయారు చేసుకొనుటకు వాడుకుంటాడు. మీ   కుమార్తెలను అత్తరు పూయుటకు, వంటలు వండుటకు, రొట్టెలు  కాల్చుటకు వాడుకుంటారు. మీ పొలములలో సారముగల వాటిని తీసుకుంటారు. మీపొలములను తీసుకొని వారి ఉద్యోగులకు ఇస్తారు, మీ పంటలలో పదియవ వంతు తీసుకొని తమ నౌకరులకు ఇచ్చుకుంటారు. మీ పశువులలో ఇష్టమైన వాటిని తీసుకొని తన పనులు చేయించుకుంటాడు. మీరు అతని బానిసలు అవుతారు, మీరు ఎన్నుకొనిన రాజును తలంచుకొని మీరు పెద్ద ఎత్తున ఏడ్చుదురు అని  చెప్పాడు. ఇన్ని విషయాలు చెప్పినప్పటికీ వారు అతని మాట వినక మాకు రాజును  నియమించాలని పట్టుపట్టారు.  అప్పుడు సమూవేలుతో  ప్రభువు వారికి ఇష్టము వచ్చినట్లు చేయుమని చెప్పాడు. అప్పుడు సమూవేలు ప్రజలకు మీమీ పట్టణములను వెళ్ళమని చెప్పాడు. ఒకరోజు   ప్రభువు సమూవేలుతో రేపు నిర్ణిత సమయమున బెన్యామీను తెగకు చెందిన ఒకనిని నీ వద్దకు పంపెదను అతనిని యిస్రాయేలుకు నాయకునిగా అభిషేకింపమని చెప్పాడు. 

ఈ సమయంలోనే  సౌలు తన  తండ్రి గాడిదలు తప్పి పోగా, తండ్రి వాటిని వెదకిరమ్మని సౌలును పంపాడు. వారు ఎంతగా వెదకినప్పటికీ  అవి కనపడలేదు.  అప్పుడు సౌలు తండ్రి గాడిదలను గురించి కాక కుమారుని కొరకు   బాధపడునేమో అని తన వెంట వచ్చిన సేవకునికి వెనక్కిపోవుదుము అని చెప్పగా ఆతడు ఇక్కడ ఒక   దైవభక్తుడు ఒకడు ఉన్నాడు. ఆయన చెప్పినదంతా జరుగును. అతనిని చూచిన మనకు మార్గము చెప్పవచ్చును అని చెప్పగా  సౌలు అతనికి ఇవ్వుటకు మనవద్ద ఏమిలేదు కదా అని చెప్పాడు.  అప్పుడు ఆ సేవకుడు తన వద్ద పావుతులము వెండి ఉన్నది దానిని అతనికి ఇచ్చెదము అని చెప్పాడు. వారు కొండమీదఉన్న  పట్టణమునకెక్కి నీళ్లు తోడుకొనుటకు దిగివచ్చు బాలికలను దీర్ఘదర్శి ఉన్నడా  అని అడిగారు.  అందుకు వారు ఉన్నాడు, ఈ దినము ఉన్నత స్థలమున బలి అర్పించబోవుతున్నారు అని చెప్పారు. మీరు ఉన్నత స్థలమునకు వెళ్లకమునుపే దర్శించవచ్చును త్వరగా వెళ్ళమని  అని చెప్పారు. సౌలు సేవకునితో కలసి పట్టణములో ప్రవేశింపగానే సమూవేలు అతనికి ఎదురుపడ్డాడు. ఆ ముందు రోజునే ప్రభువు సమూవేలుతో రేపు నిర్ణిత సమయమున బెన్యామీను తెగకు చెందిన ఒకనిని నీ వద్దకు పంపెదను అతనిని యిస్రాయేలుకు నాయకునిగా అభిషేకింపమని చెప్పాడు. సౌలు ఎదురుపడగానే ప్రభువు సమూవేలుతో నా ప్రజలను పాలించునని నేను ముందుగా చెప్పినది ఇతని గురించే అని చెప్పాడు. సౌలు సమువేలుతో అయ్యా! దీర్ఘదర్శి ఇల్లు ఎక్కడ?  అని అడుగగా సౌలు దీర్ఘదర్శిని నేనే, నా కంటే ముందుగా వెళ్లి ఉన్నత స్థలమును చేరుకొనుము, నేను ఈరోజు నీతో భుజింపవలెను, రేపు నిన్ను పంపెదను  నీవు వెళ్లునప్పుడు నీలోని సంధియును తీర్చెదను, తప్పిపోయిన మీ గాడిదలు దొరికినవి కనుక వాటి గురించి చింతించకు  అని చెప్పాడు. యిస్రాయేలు కోరునది నిన్నును నీ కుటుంబమునుకదా అని చెప్పాడు అప్పుడు సౌలు నేను యిస్రాయేలు తెగలలో అల్పమైన బెన్యామీను తెగవాడను, ఆ తెగనందలి అల్పమైనది అటువంటి నా మీద ఇట్టి పలుకులు పలకనేలా అని అన్నాడు. 

సమూవేలు సౌలును అతని దాసుని భోజనశాలకు తీసుకొనివెళ్ళి అతిధుల ముందుటి భాగమున వారిని కూర్చుండబెట్టి వేరుగా వండి ఉంచిన వేట తొడను తీసుకొని వచ్చి  సౌలు ముందుట పెట్టి భుజింపమని చెప్పాడు. అక్కడ నుండి   నగరమునకు వచ్చి, సౌలుకు పడక సిద్దము చేయగా అక్కడ ఆతడు నిద్రించాడు. వేకువనే సమూవేలు సౌలును నిద్రలేపి నగర చివరకు వచ్చిన తరువాత సౌలు సేవకుని  సౌలుతో సాగిపొమ్మని చెప్పించి సౌలును అక్కడే ఆపి , యావే ఆజ్ఞను అతనికి తెలియజేస్తాను అని చెప్పాడు. సమూవేలు తైలపుబుడ్డిని తీసుకొని సౌలు తలపై చమురు కుమ్మరించి అతనిని ముద్దు పట్టుకున్నాడు. యావే నిన్ను తన ప్రజలకు నాయకునిగా చేసాడు నీవు ప్రజలను పాలించి శత్రువుల నుండి వారిని కాపాడవలెను .  నిన్ను నాయకునిగా ప్రభువు చేసాడు అనుటకు గుర్తులు ఏమిటంటే నన్ను నీవు విడిపోగానే బెన్యామీను పొలిమేరలలో సెల్సా వద్దగల రాహేలు సమాధివద్ద ఇద్దరు నిన్ను కలుసుకొని మీ గాడిదలు దొరికినవి అని చెప్పెదరు. మీ తండ్రి నీ గురించి చింతించుచున్నాడు అని  చెప్పుతురు అని తరువాత తాబోరు సింధూరము చేరగానే  బేతేలు పోవు ముగ్గురు నీకు దండము పెట్టి రెండు రొట్టెలు కానుకగా  ఇత్తురు వానిని తీసుకొనుము. తరువాత   గిబియా, తేలోహిము వెళ్లి అక్కడ ఫిలిస్తీయుల శిబిరం ఉంది అక్కడకు చేరగానే ప్రవక్తల సమాజము   ఉన్నత స్థలము దిగి వచ్చుచుండును, వారు ప్రవచనములు పలుకుతారు, వారితోపాటు నీవుకూడా ప్రవచించెదవు , దానితో నీవు పూర్తిగా మారిపోయెదవు, ఇవన్నీ జరిగిన తరువాత తగినవిధంగా పనులు చేయుము అని చెప్పాడు. ఇక నీవు ముందుగా వెళ్లి గిల్గాలు చేరుము నేను అక్కడకు వచ్చెదను. నీవు నాకోసం ఏడురోజులు వేచియుండుము నేను వచ్చి నీవు ఏమి చేయాలో చెప్పదను అని చెప్పాడు.

 సౌలు సమూవేలును వీడివెళ్ళగానే ఆయన చెప్పినవన్నీ జరిగాయి. దేవుడు అతని  హృదయమును పూర్తిగా మార్చివేసాడు. అతడు గిబియా చేరగానే ప్రవక్తల సమూహం ఎదురవగానే దేవుని ఆత్మ అతని మీదికి రాగా, సౌలు ప్రవచనములను పలికాడు.  అది చూచిన ప్రజలు కీషు కుమారునికి ఏ గతి పట్టెనని  పలికారు. తరువాత సౌలు ఇంటికి వెళ్ళాడు. సమూవేలు మిస్పా వద్ద  యావే ఎదుటికి  ప్రజలను రప్పించి వారితో యిస్రాయేలు దేవుడు మిమ్ములను ఐగుప్తు నుండి మరియ శత్రువుల బారి నుండి కాపాడుకుంటూ వచ్చాడు.  మీరు మాకు రాజును నియమించాలని, దేవుణ్ణి పట్టుపట్టారు., మీ తెగల వారిగా యావే ముందు నిలవండి అని చెప్పాడు, సమూవేలు చీట్లు వేయగా బెన్యామీను తెగలోని  మంత్రీ కుటుంబంలోని కీషు కుటుంబంలోని సౌలు వంతు వచ్చినప్పుడు అతను కనపడలేదు. అతడు సామానులు మధ్య దాగుకొని ఉన్నాడు అని  ప్రభువు తెలియచేయగా అతనిని తీసుకొని వచ్చారు. అప్పుడు సమూవేలు ప్రజలతో దేవుడు ఎవరిని ఎన్నుకొన్నారో చూసారో కదా, ఇటువంటి వారు యిస్రాయేలులో ఎవరు లేరు అనెను అపుడు జనులు మా రాజు కలకాలము జీవించు గాక అని కేకలు వేశారు. అపుడు సమూవేలు రాజు ఎలా పాలించునో చెప్పారు, అలానే ఒక గ్రంథమును రాసి యావే ముందుట ఉంచాడు. తరువాత ప్రజలను వారివారి ఇళ్లకు పంపించాడు.  

కొంతమంది యితడు మనలను ఎట్లు రక్షింపగలడు అని సౌలును తక్కువ చేసి మాట్లాడారు. సౌలు అమ్మోనీయులను  ఓడించిన తరువాత ప్రజలు సమూవేలుతో సౌలును తక్కువ చేసి మాట్లాడిన వారిని తీసుకోని రమ్ము మేము వారిని వధిస్తాము అని చెప్పారు. సమూవేలు ప్రజలతో మనము గిల్గాలుకు పోవుదము, అక్కడ రాజనియామమునకు ఒప్పుకుందుము అని మాటయిత్తుము అని చెప్పి గిల్గాలు వెళ్లి అక్కడక సౌలును రాజుగా ప్రకటించాడు. సమూవేలు ప్రజలతో మీ మనవుల ప్రకారం మీకు రాజును నియమించాను, రాజే మిమ్ము ఇకనుండి నడిపిస్తాడు. నేను ముసలివాడిని అయ్యాను, చిన్ననాటి నుండి మీకు నాయకుడిగా నిడిపించాను. నాలో ఏమైనా దోషం ఉన్న యెడల యావే ఎదుట, రాజు ఎదుట నిరూపించమని అడిగాడు. నేను ఎవరిది  ఏదైనా తీసుకున్నానా? లంచము తీసుకొని న్యాయము చెప్పానా? మోసం చేసానా? నేను ఏమైనా చేసినచో రుజువు చేయండి నేను వారికీ అది ఇస్తాను అని చెప్పాడు. దానికి ప్రజలు అటువంటిది ఏమి లేదు అని సమాధానం ఇచ్చారు. 

నాలో ఏ అపరాధము లేదనుటకు యావే సాక్షి, ప్రభువుచే అభిషిక్తుడగు రాజు సాక్షి అని సమూవేలు చెప్పగానే  ప్రజలు అవును ప్రభువే సాక్షి అని బదులిచ్చారు.  తరువాత దేవుడు ఎలా వారిని ఐగుప్తు నుండి తీసుకొని వచ్చినది, ఎలా వారికి భూమి ఇచ్చినది, వారు ఆయన మాట వినక ఇతర దేవతలను కొలిచినందుకు శిక్షించినది  సమూవేలుతో ప్రజలు చెప్పారు. దేవుణ్ణి వారు ఎలా మొరపెట్టుకొన్నది శత్రువుల నుండి విడిపించమని చెప్పినది చెప్పి, దేవుడు న్యాయాధిపతులను పంపి వారి బానిసత్వము నుండి విడిపించగా వారు చీకు చింతలు లేక బ్రతికిన విషయం వెల్లడి చేసాడు. యావే మీ రాజు , అయినను మీరు మాకు యావే కాక మరియొక రాజు కావాలి అని అడిగారు. ఇతడే మీరు ఎన్నుకొనిన రాజు, మీరును మీ రాజును ప్రభువు పట్ల భయ భక్తులు చూపించి , ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించిన మీకు మేలు జరుగును లేదేని మీరు ముప్పు తిప్పలు పడునట్లు చేయును.   ప్రజలను అక్కడే ఉంచి వారి ముందు ఒక గొప్ప కార్యము చేసాడు గోధుమ కాల సమయంలో యావెను ప్రార్ధించగా , సమూవేలు చెప్పినట్లుగా ఉరుములతో వాన కురిసింది. దీని ద్వారా ప్రభువును వారు రాజు కావలెనని అడిగి చేసిన తప్పును తెలుసుకోవాలని వారికి చెప్పాడు. వారు సమూ వేలుతో   మా తరుపున యావేకు విన్నపము చేయుము , రాజును కోరుకొనుట కూడా మేము చేసిన తప్పిదమే అని  పలికారు. అందుకు సమూ వేలు భయపడకుడు మీరు తప్పు చేసిన మాట వాస్తవమే కానీ  ప్రభువును అనుసరించుట మాత్రం మానకుడు, ఆయనను పూర్ణ హృదయముతో సేవింపుడు, విగ్రహములు మాయే, అవి కాపాడలేవు, వాని వలన ప్రయోజనము లేదు. యావే తన ఘనమైన నామమును నిలబెట్టుకొనువాడు  కనుక మిమ్ము పరిత్యజించడు. నేను మీకొరకు మనవి చేసెదను. మీకు ధర్మ మార్గమును చూపెదను  అని వారికి బోధించాడు. 

సాలు ఒక ఏడాది పాలన చేసిన తరువాత   పిలిస్తియుల దండును హతము చేసినందుకు వారు ఇస్రాయేలీయుల   మీద కోపముగా ఉన్నారు. యిస్రాయేలీయులు భయంతో ఉన్నారు. శత్రువులు వారి చుట్టూ చేరారని వారు పారిపోయారు. సౌలు గిల్గాలు వద్ద ఉన్నాడు. సౌలు సమూవేలు చెప్పిన గడువు ప్రకారము ఏడూ రోజులు  ఆగి సామూవేలు రాలేదని, ప్రజలు వీడిపోతున్నారని దహన బలిని, సమాధాన బలిని సిద్ధం చేయించి తానె దహన బలిని అర్పించాడు. అపుడు సమూవేలు వచ్చి ఎంతపని చేసితివి అని అన్నాడు.   నీవు ప్రభువు ఆజ్ఞ పాటించి ఉండినట్లైయితే ఎప్పటికి నీ కుటుంబము వారే రాజుగా ఉండేవారు అని చెప్పాడు. ప్రభువు ఇంకొకరిని నాయకునిగా  ఎన్నుకొనును అని చెప్పి సమూవేలు గిల్గాలు నుండి వెళ్ళిపోయాడు. 

సౌలు తన పాలనను సుస్థిరం చేసుకొని పాలించసాగాడు. కొన్నాళ్లకు సమూవేలు సౌలు వద్దకు వచ్చి నేను యావే పంపగా వచ్చి, నిన్ను యిస్రాయేలీయులకు రాజుగా అభిషేకించాను, ఇప్పుడు ప్రభువు మాటలు వినుము. యిస్రాయేలీయులు ఐగుప్తు నుండి వచ్చునప్పుడు అమాలేకీయులు త్రోవలో వారినెదిరించి బాధించారు, వారిని నేను శిక్షించాలని ప్రభువు అంటున్నాడు. కనుక నీవు వెంటనే పోయి వారిని  వధింపుము, వారిలో ఒక్కరిని కూడా బ్రతుకనీయవద్దు. ఎడ్లను, గొర్రెలను , ఒంటెలను, గాడిదలను, అన్నింటిని మట్టుపెట్టుము ఇది యావే ఆజ్ఞ అనిచెప్పాడు. సౌలు అమాలేకీయులను సంహారించాడు. ఆగాగును చంపలేదు.. క్రొవ్విన ఎడ్లను దూడలను  గొర్రెలను గొర్రె పిల్లలను చంపలేదు. మంచి వాటిని మిగుల్చుకొని పనికిరాని వాటిని శాపము పాలుచేసి వదించారు. సమూవేలుకు ప్రభువు దివ్యవాణి సౌలును రాజును చేసినందుకు నేను విచారించుచున్నాను.  అతను నా ఆజ్ఞలను పాటించక , దిక్కరించాడు అని సమూవేలుతో చెప్పాడు. 

మరునాడు సమూవేలు సౌలును చూడబోయాడు. అప్పటికే సౌలు గిల్గాలుకు వెళ్ళాడు అని  తెలియగ అక్కడకు వెళ్ళాడు. సమూవేలు సౌలును కలవగానే సౌలు సమూవేలుతో ప్రభువు నిన్ను దీవించునుగాక నేను యావే  ఆజ్ఞను పాటించితిని అని చెప్పాడు. అందుకు సమూవేలు అది నిజమైతే గొర్రెల అరుపులు ఎద్దుల రంకెలు నా చెవులలో ఇంకా రింగున  మారుమ్రోగుచున్నవి ఎందుకు అని  అడిగాడు. అపుడు సౌలు వాటిని అమాలేకీయుల నుండి కొన్నాము అని చెప్పాడు.    ప్రజలు శ్రేష్టమైన ఎడ్లను, గొర్రెలను యావేకు బలి ఇచ్చుటకు అంటిపెట్టుకొని మిగిలిన వాటిని శాపము పాలు చేసి సంహరించాము అని చెప్పాడు. అపుడు సౌలుతో సమూవేలు  నీ మాటలు ఆపు, ప్రభువు నాతో చెప్పిన మాటలు వినుము, నీవు అల్పుడవైనను  యావే నిన్ను  యిస్రాయేలుకు నాయకునిగా చేయలేదా ? నిన్ను  రాజుగా చేయలేదా? నీకు యావే ఒక పని అప్పగించి ఉన్నాడు. అది నీవు ఎలా దిక్కరించావు? దోపిడిసొమ్ము దక్కించుకోవడం కోసం యావే ముందు పాపం చేసావు అని అడిగాడు. 

అందుకు సౌలు నేను యావే మాట ఆలకించాను, ఆగాగును తీసుకొచ్చాను, గిల్గాలు వద్ద యావేకు బలి అర్పించుటకు ప్రజలే వాటిని అట్టిపెట్టుకొన్నారని చెప్పాడు. అందుకు సమూవేలు యావే బలుల వలన సంతృప్తి చెందునా? విధేయత వలనగాదా? బలి కంటే విధేయత మేలు నీవు యావే మాట త్రోసివేసావు కనుక యావే నీ రాజరికమును త్రోసివేసెను. అని చెప్పాడు. అందుకు సౌలు ప్రజలకు భయపడి నేను అటుల చేసి పాపము కట్టుకున్నాను. నా తప్పు క్షమించి, యావెను మ్రొక్కుటకు నాతో రమ్మని అడిగాడు. దానికి సమూవేలు నేను నీ వెంట రాను, నీవు యావే పలుకులు  తిరస్కరించితివి కనుక నీ రాజపదవిని యావే తిరస్కరించాడు అని చెప్పి,  మారాలి వెళ్లపోతుండగా సౌలు అతని అంగీ చెంగు పట్టుకోగానే అది చినిగింది. సమూవేలు అతనితో  ఈరోజు ప్రభువు యిస్రాయేలు రాజ్యమును నీ చేతినుండి లాగివేసి నీకంటే యోగ్యుడైన వానికి ఇచ్చివేసెను అని చెప్పాడు. మరల సౌలు సమూవేలుతో యావెను మొక్కుటకు నాతో రమ్ము అని    అడుగగా సమూవేలు సౌలు వెంట వెళ్ళాడు. అతడు యావేకు మ్రొక్కాడు. సమూవేలు  ఆగాగును తీసుకొని రమ్మని చెప్పగా వారు అటులె చేసెను. అప్పుడు సమూవేలు అతనితో నీకత్తి వలన తల్లులు బిడ్డలను కోల్పోయినట్లే నేడు నీ తల్లి తన బిడ్డను కోల్పోవును అని  యావే ఎదుట అతనిని నరికివేసెను. తరువాత సమూవేలు రామాకు వెళ్ళిపోయాడు. సౌలు చనిపోవువరకు సమూవేలు అతనిని  కలుసుకొనలేదు. 

సౌలు గురించి సమూవేలు పరితపించాడు. యావే సమూవేలుతో నేను సౌలును తిరస్కరించినందుకు ఎంతకాలము దుఃఖించెదవు.  కొమ్మును తైలమును నింపుకొని వేళ్ళు, బేత్లెహేము వాసియైన యిషాయి వద్దకు పంపుతున్నాను. అతని కుమారులలో ఒకరిని  నేను రాజుగా   ఎన్నుకొంటిని అని చెప్పాడు. అందుకు సమూవేలు  నేను పోలేను, ఈ మాట వింటే సౌలు నన్ను చంపివేస్తాడు అని అన్నాడు. అందుకు నీవొక  ఆవు పెయ్యను తీసుకెళ్ళుము, ఆ ఊరివారితో యావేకు బలి అర్పించడానికి వచ్చాను అని చెప్పుము. యిషాయిని కూడా బలి అర్పణమునకు పిలువుము. అక్కడ నీవేమి చెయ్యాలో  అక్కడ చెప్పెదను నీవు మాత్రము నేను నిర్ణయించిన వానిని అభిషేకించాలి అని చెప్పాడు. 

సమూవేలు యావే చెప్పినట్లు బేత్లెహేము  వెళ్ళాడు. ఆ ఊరి పెద్దలు అతనిని చూచి భయపడ్డారు.  వారు మీరు మా మేలు ఎంచి వచ్చారా  లేక కీడు ఎంచి వచ్చారా  అని అడుగగా మీ మేలు కోరే  వచ్చాను, ఇక్కడ బలి అర్పించడానికి  వచ్చాను, మీరు శుద్ధి చేసుకొని రావాలి అని చెప్పాడు. యిషాయిని అతని కుమారులను సమూవేలు  శుద్ధి చేసి బలికి ఆహ్వానించాడు. వారు అప్పుడు బలికి వచ్చారు. అపుడు సమూవేలు యిషాయి పెద్ద కుమారుని చూసి ప్రభువు అతనిని ఎన్నుకొనబోతున్నాడు అని అనుకున్నాడు. యావే సమూవేలుతో రూపమును,  ఎత్తును చూసి భ్రమపడకుము, దేవుడు నరుడు చూచిన చూపుతో చూడడు, హ్రదయమును అవలోకించును  అని చెప్పాడు.  అదే విధంగా యిషాయి కుమారులు ఏడుగురు సమూవేలు ఎదుట నిలిచారు కానీ యావే వారిని ఎన్నుకొనలేదు. అప్పుడు సమూవేలు నీ కుమారులు వీరేనా ? అని అడిగారు. అపుడు అతను చిన్నవాడు పొలమున   గొర్రెలు కాయుచున్నాడు అని చెప్పాడు. ఎవరిని అయినా పంపి అతనిని పిలిపింపుము,  అతను వచ్చినంత వరకు నేను భోజనమునకు కూర్చొను అని చెప్పాడు. దావీదు  రాగానే యావే  నేను కోరుకొనినవాడు ఇతనే అని  చెప్పాడు. సమూవేలు తైలపు కొమ్ము  తీసుకొని అన్నలేదుట అతనికి అభిషేకము చేసాడు. అప్పటి నుండి యావే ఆత్మ దావీదును ఆవహించి   అతనిలో ఉండిపోయింది. దాని తరువాత సమూవేలు రామాకు  వెళ్ళిపోయాడు. 

దావీదును చంపుటకు సౌలు ప్రయత్నిస్తుండగా దావీదు రామా  వద్ద ఉన్న సమూవేలు వద్దకు వచ్చి జరిగిన విషయాలు మొత్తము చెప్పాడు. అపుడు  దావీదు, సమూవేలు నావోతు చేరి అక్కడ ఉన్నారు. సౌలు అది తెలుసుకొని సేవకులను దావీదును పట్టుకొనుటకు పంపాడు. వారు వచ్చి సమూవేలు ప్రవక్తల సమూహమునకు నాయకునిగా నిలుచుట చూడగా దేవుని ఆత్మ సౌలు సేవకుల మీదకు రాగ వారుకూడా ప్రవచనములు పలికారు. ఇది విని సౌలు మరల కొంతమంది సేవకులను పంపారు. వారును అలానే చేశారు. అపుడు మూడవసారి కూడా వారు అంతే చేశారు. అపుడు సౌలు  స్వయంగా రామాకు వచ్చి  అక్కడివారిని సమూవేలును దావీదును చూసారా అని అడుగగా వారు నావోతు వద్ద   ఉన్నారు అని చెప్పగా  సౌలు అక్కడకు పోవుటకు బయలుదేరగా దేవుని ఆత్మ అతన్ని ఆవేశించినది.  అపుడు  అతడు ఆవేశముతో బట్టలను తొలగించుకొని సమూవేలు  ఎదుటనే ప్రవచనలు చెప్పాడు. కాని  దావీదు అపుడు యోనాతాను వద్దకు వెళ్ళిపోయాడు. తరువాత కొన్నాళ్ళకు  సమూవేలుమరణించాడు. యిస్రాయేలీయులందరు సమావేశమై అతని కొరకు శోకించారు. రామాలో అతని ఇంటిలో అతనిని పాతిపెట్టారు. 

 సమూవేలు చనిపోయిన తరువాత సౌలు పిలిస్తియుల మీద యుద్ధమునకు పోవుటకు యిస్రాయేలును సిద్ధముచేసాడు కానీ వారిని చూసి భయపడ్డాడు. అతడు యావెను సంప్రదించిన కాని  యావే స్వప్నంలోకాని ఊరీము వలన కానీ ప్రవక్తల ద్వారా కానీ ఏమి సెలవియ్యలేదు. అపుడు చనిపోయిన వారిని ఆవాహకము చేసుకొనే ఒక మాంత్రికురాలను సమీపించి   మృతలోకం నుండి నేను సమూవేలుని రప్పింపుము అని అడిగాడు. ఆమె సమువేలు లేచి వచ్చుట చూసి భయపడి కేకవేసింది. ఆమెతో సౌలు అతడు నీకు ఎవరు కనపడిరి అని అడుగగా భూమిలో నుండి దైవములలో ఒకడు లేచి వచ్చుచున్నాడు అని చెప్పింది. సౌలు అతని ఆకారము గురించి అడుగగా దుప్పటి కప్పుకొనిన ముసలివడెవడో లేచి వస్తున్నాడు అని చెప్పాడు. అపుడు వెంటనే సమూవేలు అని గ్రహించి సౌలు లేచి నేలపై సాగిలపడి దండము పెట్టాడు.   సమూవేలు సౌలుతో నీవు నన్ను కుదురుగా ఉండనియక ఎందుకు రప్పించితివి అని అడిగాడు.  అపుడు సౌలు ఫిలిస్తీయులు నాపై యుద్ధమునకు వచ్చారు, నేనేమి చెయ్యాలో తెలియడం లేదు. ప్రభువు నాతో మాట్లాడలేదు.  దిక్కుతోచక నిన్ను రప్పించితిని అని చెప్పాడు. అపుడు సమూవేలు యావే నిన్ను విడనాడి, నీకు శత్రువు కాగ, నన్ను సంప్రదించి ప్రయోజనమేమి? యావే చెప్పినట్లే చేసాడు. ప్రభువు రాజ్యమును నీ నుండి తొలగించి నీ పొరుగువాడైన దావీదునకు ఇచ్చివేసెను. నీవు ప్రభువు మాట పాటింపవైతివి. కనుకనే యావే నిన్ను వీడెను,   ప్రభువు నిన్నును,  నీ  తనయులును  ఫిలిస్తీయుల చేతికి అప్పగించును రేపు నీవు నీ కుమారులు  నాతో   ఉందురు అని చెప్పాడు. 

పునీత ఆవిలాపురి తెరెసమ్మ

 

పునీత ఆవిలాపురి   తెరెసమ్మ 

తెరెసా ఔన్నత్యం -పుట్టుక మరియు బాల్యం 

తెరెసా 1515వ సంవత్సరం ఆవిలాలో మార్చి 28న తేదీన     జన్మించారు. 1582 లో చనిపోయారు. 1622 సంవత్సరంలో  లో ఆమె చనిపోయిన 40 సంవత్సరాలకు ఆమె పునీతురాలుగా ప్రకటించబడింది. 1970 సెప్టెంబర్ 27 న ఆమె తిరుసభ పండితురాలుగా ప్రకటించబడింది. ఈమె ఒక సాధారణ స్త్రీ వలె కనపడిన అసాధారణమైన పట్టుదల, సాంఘిక అసమానతలను ఎదుర్కొని విజయాలను సాధించుటలో గొప్ప వ్యక్తిత్వాన్ని కనపరిచిన అరుదైన వ్యక్తి. ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆమె జీవితంలో అనేక ఆటంకాలలో కూడా తాను అనుకున్న దానికి సాధించిన ఒక స్త్రీ మూర్తి. మనం ప్రేమించే వారి కోసం మనం ఎంత చేయవచ్చో చూపించిన ఒక గొప్ప స్త్రీ. తిరుసభలో వరకట్నం  లేకుండా సన్యాసినులను మఠంలోనికి తీసుకున్న మొదటి వ్యక్తి. అనేక నూతన సంప్రదాయాలకు అంకురార్పణ చేసిన వ్యక్తి. తీరుసభ మొదటి స్త్రీ పండితురాలు. ఒక వ్యక్తి తనలో ఉన్న లోపాలను ఎలా జయించగలమో నేర్పి, మానవుడు తనను తాను ఎలా జయించవచ్చో నేర్పించిన విజయాశీలి.  మానవునిలో ఉన్న దైవాన్ని ఎలా చేరుకోవాలో అంతరంగిక ప్రయాణం ఎలా చేయాలో నేర్పిన గొప్ప గురువు మరియు గొప్ప పండితురాలు.

ఆమె తండ్రిగారి పేరు అలెన్సో సంచేస్  ఆమె తల్లి పేరు  బియాట్రీస్ ఆహుమాద చిన్నప్పుడు తెరెసా పునీతుల జీవితాలు చదివి ఆ పునీతుల చరిత్రల వలన చాలా ప్రోత్సాహం పొందేది. తెరెసా మరియు ఆమె సోదరుడు రోడ్రిగో బాల్యంలోనే  ఇద్దరు కలిసి మూర్సు అనే ప్రాంతం లో వేద సాక్షిగా మరణించాలి అని ప్రయాణం అయి వెళ్లారుఆవిలా పూరీ గోడల బయటకు వెళ్ళి నాలుగు స్తంభాలు అనే ప్రాంతంలో వారి బాబాయి వారిని చూసి ఇంటికి తీసుకొనివచ్చాడు. తరువాత రోడ్రిగో ఇది మొత్తం చేసినది తెరెసా అని ఆమె మీద నెపం మోపాడు. తరువాత తన సోదరుడితో ఎడారిలోని క్రైస్తవ సన్యాసుల జీవిత విధానాలు ఆటల రూపంలో ఆడుకునేవారు.  


యవ్వన వయసు- జీవితపు మొదటి మలుపు

తెరెసా 14 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు ఆమె తల్లి చనిపోయారుఆ సమయములో ఆమె మరియమాతకు చాలా దగ్గర అయ్యారు. మరియమాతను తన తల్లిగా ఉండమని కోరారు. ఈ ప్రాయములో ఆమె కొన్ని వీర గాధలు చదవడం మొదలు పెట్టారు. అంతేకాకుండా తన అందానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడము ఆరంభించారు. తన కుమార్తెలో వస్తున్న ఈ మార్పును గుర్తించిన ఆమె తండ్రి ఆవిలాలో ఉన్న పునిత  అగుస్టిన్ మఠ కన్యల బోర్డింగ్ స్కూల్ లో చేర్పించారు. ఇక్కడ ఉన్న  కన్య స్త్రీల వలన మరలా తన పాత నిర్మల మనస్సును పొందగలిగింది.   ప్రార్ధన గురించి  తెలుసుకున్నారుకానీ తన అనారోగ్య కారణాలతో అక్కడనుండి 1532 లో ఇంటికి రావడం జరిగినది. 1533 లో తాను కార్మెల్ సభలో సన్యాసిగా అవ్వాలని  తన తండ్రిని  అనుమతి అడగగా అందుకు ఆయన  నిరాకరించారు. తరువాత 1535 ,నవంబర్  2 న  ఆవిలాలో ఉన్న కార్మెల్ మఠంలో ప్రవేశించారు.

సన్యాస జీవిత ప్రారంభం - అనారోగ్యం 

1536 లో సభ వస్త్రాన్ని తీసుకుంది.  1537 లో తన  మాట పట్టు తీసుకుంది దాని తరువాత ఆమె ఘోరమైన అనారోగ్యం పాలయ్యింది.  కనుక 1538 లో ఆమెను తన ఆరోగ్య కుదుటపడటానికి  మఠం నుండి బయటకు తీసుకురావడం జరిగినది.  ఈ సమయములోనే ఆమెకు తన బాబాయి  ప్రార్ధన చేయడము గురించి ఒక పుస్తకం ఇవ్వడము జరిగినది.  ఆ పుస్తకము తనకు చాలా  ఉపయోగపడింది,  ఆమె ఆరోగ్యం కుదుటపడకపోగా తాను మరణపుటంచుల వరకు వెళ్ళింది. 1539 లో ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. అందరూ ఆమె చనిపోయింది అనుకున్నారుకానీ మూడు రోజులకి కొద్దిగా చలనం కలిగినది. తరువాత ఆమెను మఠానికి తీసుకొచ్చారు పక్షవాతం తో దాదాపు మూడు సంవత్సరాలు బాధపడ్డారు. పునీత యోసేపు గారి ప్రార్ధన సహాయముతో పూర్తిగా కొలుకున్నది . కానీ  ఆరోగ్య పరంగా ఆమెకు  తన మరణం వరకు కొన్ని సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. తన అనారోగ్య కారణాలతో మరియు ఇతర కారణాలతో  ప్రార్ధన జీవితాన్ని అంతగా పట్టించుకోలేదు.

ముఖ్యమైన మలుపు- శ్రమల క్రీస్తు స్వరూప దర్శనం 

 1557 లో ఒకసారి మఠానికి పండుగ సందర్భంగా యేసు ప్రభువు స్వరూపాన్ని తీసుకురావటము జరిగినది అది యేసు ప్రభువు  శ్రమలు పొందుతున్న స్వరూపము  అది చూసిన తరువాత తెరెసా  యేసు ప్రభువు శ్రమలకు తాను కారణం అని తాను మరల  యేసుప్రభువుకు  ఎటువంటి శ్రమలు ఇవ్వకూడదు అని ఆయన శ్రమలలో ఆయనకు ఓదార్పు  ఇవ్వాలని నిర్ణయించుకుంది. అందుకే ఆమె యేసు ప్రభువుకు చాల మంది స్నేహితులు అవసరము ఉంది మనం ఆయన స్నేహితులము కావాలని తన తోటి సన్యాసినులతో చెప్పేది. ఈ మఠం లో ఆమె చాలా శ్రమలు అనుభవించిందిఆమె తన అనారోగ్యం వలన అనేక బాదలు అనుభవించినది.  ఈ సమయములోనే  తన మొదటి ప్రార్ధన అనుభూతిని పొందింది. తన స్నేహితులు,  ప్రార్ధనలో ఆమె పొందే అనుభవాలు మొత్తం కూడా సాతాను నుండి పొందుతుంది అని చెప్పారు.  1556 సంవత్సరంలో   ఆమె ఆధ్యాత్మిక గురువు ఫ్రాన్సిస్ అనే  యేసు సభ గురువు ఆమె అనుభవాలు  దేవుని నుండి వచ్చే అనుభవాలు అని చెప్పారు. ఆమె అనేక దర్శనాలు పొందేది. కొన్ని సార్లు ప్రార్దనలో ఉన్నప్పుడు వచ్చే అనుభవాలు చాలా గొప్పగా ఉండేవి. ఒక్కోసారి ఆమె ప్రార్ధన చేసే సమయములో గాలిలోకి ఎత్త బడేది. అది చూసిన మిగిలిన వారు  ఆమెను క్రిందకు తీసుకురావడానికి ఆమెను పట్టుకొని లాగేవారు. 1559 లో ఆమెకు ఒక దర్శనము యేసు ప్రభువు ఆమెకి కనపడటము జరిగినది. ఆమె అప్పటినుండి నిజంగా నాకు యేసు ప్రభువు కనపడ్డారు  అలాగున  ఈ దర్శనాలురెండు సంవత్సరాలు పాటు ఆమెకు కలిగాయి.

తెరెసా హృదయాన్ని దేవదూత బాణంతో పొడిచిన అనుభూతి 

ఒక దర్శనములో దేవదూత  ఒక  అగ్నిజ్వాలతో  కూడిన ఒక  బంగారు బాణం తో ఆమె హృదయమును గుచ్చినట్లుగా అనిపించినది. తరువాత శారీరకముగా మరియు ఆధ్యాత్మికముగా కూడా ఆమెకు అది  బాధతో కూడిన తీయటి అనుభూతిని మిగిల్చింది. ఆమె చనిపోయిన తరువాత ఆమె సమాధిలో ఆమె హృదయం పాడు కాకుండా ఉన్నది అంతే కాదు ఆమె హృదయం మీద రెండు గీతలు ఉండటం గమనించడం జరిగింది. ఇప్పటికీ ఆ హృదయం అల్భ దె  థోర్మెస్ అనే ఊరిలో దేవాలయంలో మనం చూడవచ్చు.  

ఆమె ఉన్న ఇన్కర్ణేషన్ మఠంలో  150 మంది మఠవాసులు ఉండటము వలన అది ప్రార్ధనకు అనువుగా లేదు.  మఠానికి వచ్చేపోయె  వారితో మఠం ఒక సంత వలె ఉంది అని ఆ జీవిత విధానాన్ని తన ఆధ్యాత్మిక గురువుల సహాయంతో సంస్కరించాలని అనుకున్నది.  పేదరికంలో మఠాన్ని స్థాపించటానికి అందరూ అడ్డుపడిన కాని  ఆమె ఆగస్ట్ 24న 1562వ సంవత్సరంలో నూతన మఠాన్ని స్థాపించారు. 1563 మార్చిలో తెరెసా నూతన మఠానికి వెళ్ళింది.  కఠినమైన నియమాలతో పాత కార్మెల్ జీవితాన్ని పునరుద్ధరించాలని ఆశతో మొదలు పెట్టిన పని మొదలైనది. కొద్ది మంది సన్యాసినులతో ఎప్పుడు ప్రార్ధన ధ్యానం చేస్తూ వారు అందరికీ ఆదర్శముగా జీవించడం మొదలు పెట్టారు. మొదటి ఐదు సంవత్సరాలు ఆమె ఆ మఠంలోనే  గడిపింది.

మఠాలను స్థాపించుటకు గల ఉన్నతమైన ఉద్దేశం 

ఆమె ఎందుకు ఈ మఠాన్ని స్థాపించారు అని ఒక ప్రశ్న అడిగినప్పడు మనకు ఆమె ఉన్న పాత మఠంలో ప్రార్దనకు అనుకూల వాతవరణం లేదు అందుకే ఆమె నూతన విధానాన్ని స్థాపించారు అని మనం చెప్పవచ్చు. దీనికి ఆమె తన తోటి సహోదరీలతో చెప్పిన సమాధానం మరియొకటి ఉన్నది. అది ఏమిటి అంటే ప్రొటెస్టంట్లు కతొలికులకు వ్యతిరేకంగా ఉద్యమిచ్చిన కాలంలో అనేక దేవాలయాలలో దివ్య సత్ప్రసాదనికి అవమానం కలిగించారు. ఏ విధంగా అంటే అనేక దేవాలయాలలో దివ్య మందసంలో ఉన్న యేసు దివ్య సత్ప్రసాదంను బయటకు తీసి క్రింద పడవేసి అవమానం చేశారు. ఆ అవమాననికి తాను అంటే ఆవిలాపురి తెరేసమ్మ పరిహారం చేయాలని అనుకున్నారు. అది ఏవిధంగా అంటే ఈ నూతన కార్మెల్ మఠంలో ప్రతి నిత్యం దివ్య సత్ప్రసాదంలో ఉన్న యేసు ప్రభువు ఆరాధించబడుతాడు అక్కడి సన్యాసినులతోటి ఆవిధంగా అప్పుడు జరిగిన అవమాననికి తాను పరిహారం చేయాలి అని ఈ నూతన మఠం స్థాపించాలి అనుకున్నది.  

దివ్య పూజబలిలో పాల్గొని దివ్య సత్ప్రసాదం స్వీకరించిన తరువాత ఆమె అనేక ప్రార్ధన అనుభవాలు పొందేది. ఆమె పొందిన ప్రార్దన అనుభవాలలో కొన్నింటిలో ఆమె ప్రార్దన చేస్తూ ఉండగా అవకాశంలోనికి ఎత్త బడేది. ఆ సమయాలలో తన తోటి సన్యాసినులు ఆమెను పట్టుకొని క్రిందకు లాగేవారు. 

 తెరెసా జీవితంలో యేసు ప్రభువు 

పునీత ఆవిలాపురి తెరేసమ్మ కార్మెల్ మఠంలో తీసుకున్న పేరు యేసుని తెరెసా. ఈమె జీవితం మొత్తం యేసు ప్రభువును ఏ విధంగా తాను కలవాలి, లేక ఆయనను తాను ఎలా పొందాలి అనే కోణంలో మాత్రమే ఆలోచించింది అన్నట్లుగా తాను జీవించిది. ఎందుకంటె తాను ఎలా యేసు ప్రభువును చేరుకోవాలి, ఆయన కోసం తాను ఏమి చేయగలదు మరియు ఏమి చేసింది మాత్రమే ఆమె జీవితం మొత్తం కూడ. అంతకు మించి మనం ఆమె జీవితంలో ఏమి చూడం. ఆమె పేరు యేసుని తెరెసా అని ఎలా మార్చుకున్నదో అలానే తాను యేసు ప్రభువును తన అనువణువున నింపుకున్నది. 

యేసు ప్రభువును ఆమె ఎలా చూసింది అని ఒక ప్రశ్న అడిగితే నాకు కొన్ని విషయాలు ఆమె గురించి గుర్తుకు వస్తాయి అవి ఏమిటంటే? ఆమెకు  యేసు ప్రభువే  సర్వస్వం. ఆయన మానవ గుణాలను ఎంతో అభిమానంచేది, సమరియా స్త్రీ తో మాటలాడిన విధానం, వ్యభిచారం లో పట్టుబడిన స్త్రీ ని కాపాడిన విధానం ఆమెకు దైవ కరుణ తెలియజేస్తుంది. మరియ మర్తల వలె ఆయన వద్దనే ఉండాలని, తన మాటలు వినాలని ,  తనకు సేవ చేయాలని కోరుకున్నది. యేసు ప్రభువుని ప్రతి గుణాన్ని ఆమె ప్రేమించింది. ఆయనను తన గురువుగా భావించింది. యేసు ప్రభువు తన మార్గంగా, గమ్యంగా  భావించింది. యేసు ప్రభువుకు ఎలా తను సేవ చేయగలను అనే ఆలోచించింది. యేసు ప్రభువును ఆమె ఎంతలా ప్రేమించింది అంటే ఆమె చేసేది ఏది  అయిన అది క్రీస్తును పొందటం కోసమే అనే విధంగా ప్రేమించింది.  ఆయనను పొందటమే తన జీవిత ధ్యేయం అయ్యింది. తనకు  ప్రార్ధన యేసు ప్రభువును కలుసుకునే ద్వారం అయ్యింది. తనలో యేసు ప్రభువు తనలో ఉన్నారని గ్రహించింది. తనలో ఉన్న యేసు ప్రభువును కలుసుకోవడానికి తనలోనికి తాను ఎలా వెళ్ళాలి అని నేర్చుకున్నది. ఒక వ్యక్తి ఆత్మలోనికి ప్రవేశించడం చాలా క్లిష్టమైన ప్రయాణం అని తెలుసుకుంది. అయిన ఈ తనలో ఉన్న యేసు ప్రభువును కలుసుకోవడానికి ప్రార్దన సహయం ద్వార  అంతరంగిక ప్రయాణం మొదలుపెట్టింది. తనలో ఉన్న యేసు ప్రభువును కలుసుకుంది. ఈవిధంగా ఆమెకు ప్రార్దన తనలో ఉన్న యేసు ప్రభువును కనుగోని ఆయనతో ఉండటం, ఆయన అనుభూతిని పొందటం అయ్యింది. 

కార్మెల్ సభ పురుషుల విభాగాన్ని పునరుద్ధరణకు అంకురార్పణ 

 1567 లో కార్మెల్ సభ అధిపతి జాన్ బాప్టిస్ట్ రోస్సీ ఆవిల వచ్చారు. ఆయన తెరేసా ను మెచ్చుకొని ఇంకా కొన్ని సన్యాసినుల మఠాలను స్థాపించాలని ప్రోత్సహించారు. అదే విధముగా రెండు పురుష మఠాలను స్థాపించటానికి అనుమతి ఇచ్చారు.   అప్పుడు  మెదిన దేల్ కంపో మళగొన్ వయ్యాడోలిద్ ,తోలేదోపస్ట్రాన సాలమాంక మరియు అల్బ దె  తొర్మెస్  లలో మఠాలు స్థాపించారు.

తెరెసాకు  పురుషుల విభాగానికి సంబంధించి సంస్కరించబడిన  రెండు మఠాలను ఏర్పాటు చేయడానికి అనుమతి లభించినది. పునీత సిలువ యోహను మరియు ఆంథోనీ హెరోడియా ల సహకారంతో  1568నవంబర్లో దురుఏలో వద్ద  మొదటి మఠాన్ని స్థాపించారు. తరువాత 1571 లో సెగోవియ వద్ద ,1574 లో బేయస్ సేగుర వద్ద ,1575 లో సేవియ్యే వద్ద 1576 లో కరవక శిలువ వద్ద స్థాపించారు.


నిష్పాదుక కార్మెల్ సభ 

1576 లో  సంస్కరణ ఇష్టపడని కార్మెలియులుసంస్కరించబడిన కార్మెలియులను  హింసించటము మొదలు పెట్టారు. పియసెంజ లో జరిగిన జెనెరల్ చాప్టర్లో ఎటువంటి నూతన మఠాలను ఏర్పాటు చేయవద్దని చట్టం చేశారు. తెరెసాను ఆమె ఏర్పాటు చేసిన ఏదో ఒక మఠానికి మాత్రమే పరిమితం కావాలని ఆదేశించారు. అన్నింటికీ అంగీకరిస్తూ ఆమె తోలేదోలో ఉన్న మఠానికి పరిమితం అయ్యారు.  మిగిలిన వారిని అనేక కష్టాలకు గురిచేశారు. పునీత తెరేసమ్మను అనేక మంది తీరుసభ అధికారులు తప్పుగా అర్ధం చేసుకున్నారు. ఈమె మఠ వాసి అని చెబుతూ మఠంలో ఉండకుండా దేశ దిమ్మరి వలె తిరుగుతుంది అని అన్నారు. కాని ఆమె తన సంతోషం కోసం ఎప్పుడు బయటకు వెళ్లలేదు. కేవలం ఏదో ఒక నూతన మఠం స్థాపించడానికి అక్కడ యేసు ప్రభువును సేవించేలా చేయడానికి మాత్రమే వెళ్ళింది. ఆమె ప్రయాణాలు అన్ని కూడా చాలా కష్టంతో కూడినవి ఎందుకంటే ఆనాటి రోజులలో రాహదారులు ఏమి లేవు, మరియు ప్రయాణాలు గుర్రపు లేదా గాడిద బండ్ల మీదనే జరిగేది. అనేక సార్లు క్రింద పడటం కూడా జరిగేది. కాని యేసు ప్రభువు సేవించ బడాలి అనే కోరికతో ఆమె నూతన మఠలకు స్థలం చూడటానికి లేదా స్థాపించడానికి వెళ్ళేది. 

తెరెసా చివరి రోజులు 

ఆమెజీవితపు చివరి మూడు సంవత్సరాలు అందలుసియా పాలెన్సియ ,సొరియా బుర్గోస్ మరియు గ్రనాద లో మఠాలను స్థాపించారు.  1577 ఆవిలా కు వెళ్ళింది. ఆమెను అనేక విధాలుగా విమర్శించిన కార్డినల్ కూడా ఆమెకు అనుకూలముగా  మాటలాడారు . 1580 లో నూతన మఠాన్ని  స్థాపించారు. 1580  జూన్ 22 న గ్రెగోరి 13 వ పోఫు గారు  నిష్పాదుక కార్మెల్ ప్రొవిన్సు ను ఏర్పాటు చేశారు. 1582సెప్టెంబర్ 19 న మెదిన  దేల్ కాంపొను వదలి  20 న ఆల్బ దె తోర్మేస్ వచ్చారు. అప్పటికే రక్తస్రావంతో  బాధ పడుతున్నారు.   అక్టోబర్ 4 న ఆల్బ దె తోర్మేస్ వద్ద  మరణించారు. మరుసటి రోజు  గ్రెగోరియన్ కాలెండరు మార్పుతోటి  అది అక్టోబర్ 15 అయ్యింది.  ఆమె తన మఠ వాసులకు ప్రార్థన ,  మన ఆత్మలో ఉన్న దేవుని కనుగొనట ఎలా ?, ఆధ్యాత్మిక సంపూర్ణత ఏ విధముగా సాధించాలి అనే అంశాలమీద రాసిన గ్రంధాలు అనేక మందికి దేవుని తెలుసుకొనిచేరుకోవటానికి ఉపయోగపడుతున్నాయి. 

Fr. Amruth OCD

జీవవాక్కు

 

జీవవాక్కు  

యోహాను 6: 60-69 

ఆయన శిష్యులలో అనేకులు ఇవివినినప్పుడు "ఈ మాటలు కఠినమైనవి, ఎవడు వినగలడు?" అని చెప్పుకొనిరి. తన శిష్యులు దీనిని గురించి గొణుగుచున్నారు అని గ్రహించి యేసు "ఇది మీకు ఏవగింపుగా ఉన్నదా? అట్లయిన మనుష్యకుమారుడు తాను పూర్వము ఉన్న స్థలమునకు ఎక్కిపోవుటను మీరు చూచినచో ఇక ఏమందురు? జీవమును ఇచ్చునది ఆత్మయే. శరీరము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. కాని, మీలో విశ్వసింపని వారు కొందరు ఉన్నారు" అని పలికెను. ఆ  విశ్వసింపనివారు ఎవరో, తన్ను అప్పగింపబోవువాడు ఎవడో మొదటినుండియు యేసుకు తెలియును. కనుకనే "తండ్రి అనుగ్రహించిననే తప్ప ఎవడును నాయొద్దకు రానేరడు అని మీతో చెప్పితిని" అని ఆయన పలికెను. ఇందువలన ఆయన శిష్యులలో అనేకులు ఆయనను విడిచి వెళ్లి మరెన్నడును ఆయనను వెంబడింపరైరి. అపుడు యేసు తన పన్నిద్దరు శిష్యులతో "మీరును వెళ్ళిపోయెదరా?" అని అడుగగా, సీమోను పేతురు, "ప్రభూ! మేము ఎవరియొద్దకు పోయెదము? నీవు నిత్యజీవపు మాటలు కలవాడవు. మేము విశ్వసించితిమి. నీవు దేవుని నుండి వచ్చిన పవిత్రుడవు అని గ్రహించితిమి" అనెను. 

యోహాను సువిశేషంలో ఈభాగం యేసు ప్రభువు జీవ వాక్కు అని వెల్లడిచేస్తుంది. ఆయన మాటలు కొందరికి కఠినముగా ఉన్న విషయాన్ని తెలియజేస్తున్నది. ప్రభువును కఠినమైన మాటలు మనకు జీవము ఇచ్చేవి అని తెలుస్తుంది. యేసు ప్రభువు మాటలు నిత్య జీవము ఇచ్చేవి అని, ఆయన దేవుని నుండి వచ్చిన పవిత్రుడు అని తెలియపరుస్తుంది. 

యేసు ప్రభువును శరీరమును భుజించుట ఆయన రక్తమును పానము చేయుట 

యేసు ప్రభువు తన శరీరమును భుజించాలి, తన రక్తమును పానము చేయాలి అని చెప్పినప్పుడు అనేక మంది శిష్యులు ఆ మాటలు కఠినముగా ఉన్నవి అని, ఆయనను అనుసరించడం సాధ్యం కాదు అని వదలిపెట్టి వెళ్లిపోతున్నారు. ఈ మాటలను  అర్ధం చేసుకునుటకు వారికి ప్రత్యేక దైవ జ్ఞానము కావలి. యేసు ప్రభువుతో సాన్నిహిత్యము కలిగినవారు ఆ మాటలు అర్ధం చేసుకోగలుగుతారు. తన శరీరమును భుజించటం అంటే ప్రభువు జీవంలో పాలు పంచుకోవడం. రక్తంలో ప్రాణం ఉంటుంది అని యూదులు నమ్మేవారు. యేసు ప్రభువు మీరు నా రక్తమును పానము చేయాలన్నప్పుడు దాని అర్ధం ప్రభువు జీవము మనలో ఉంటుంది అని అంటున్నారు. అందుకే ప్రభువు నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేసిన వారు నాయందును నేను వాని యందును ఉంటాము అని ప్రభువు చెప్పారు. ప్రభువు శరీరము మరియు రక్తము మనలను తనతో ఉండేలా చేస్తాయి. మనము  ఎల్లప్పుడూ జీవించేలా చేస్తాయి. 

ఎందుకు కొంతమంది ఈ మాటలు కఠినముగా ఉన్నవి అని ప్రభువును విడిచి పెడుతున్నారు? యేసు ప్రభువు మాటలను వారు సరిగా అర్ధం చేసుకోలేకపోయారు. యిస్రాయేలు ప్రజలు రక్తమును భోజన పదార్ధముగాలేక పానీయముగా  తీసుకోరు. లేవియఖాండం 17వ అధ్యాయంలో రక్తములో ప్రాణము ఉంటుంది కనుక అది నిషేధించబడింది. ఇక్కడ ప్రభువు నా రక్తమును పానము చేయాలి అని అంటున్నప్పుడు వారు అర్ధం చేసుకోలేకపోయారు. యేసు ప్రభువు చెప్పేది ఆధ్యాత్మికమైన విషయం. దివ్యసత్ప్రసాదము గురించి ప్రభువు చెబుతున్నారు. వారు పొందే శ్రమలు గురించి ప్రభువు చెబుతున్నారు. 

తండ్రి ఆకర్షించిననే తప్ప ఎవడును  నా యొద్దకు రానేరడు అని మీతో చెప్పితిని అని అంటున్నాడు. ప్రభువు దగ్గరకు రావాలంటే ఆ వ్యక్తికి పశ్చాత్తాపం ఉండాలి, మనస్సు మార్చుకోవాలనే కోరిక ఉండాలి. దానికి ప్రేరణ దేవుడే మనలో పుట్టిస్తాడు. అందుకే తండ్రి అనుగ్రహించిననే తప్ప ఎవరు నావద్దకు రాలేరు అని చెబుతున్నారు. మీలో విశ్వసింపని వారు కొందరు ఉన్నారు అని ప్రభువు చెబుతున్నారు. అనేక గొప్ప కార్యములను ప్రజలు చూసారు, ఆయనతో పాటు వారు తిరిగారు. ఆయన   ఇచ్చిన ఆహారం వారు తిన్నారు. అయినప్పటికీ కొంతమంది యేసు ప్రభువు  మాటలను విశ్వసించుటలేదు. విశ్వాసం చాల ముఖ్యం. విశ్వాసం వలన మాత్రమే  మనం ప్రభువుతో ఉండగలం, ప్రభువు వద్ద ఉండగలం మరియు ఆయన చెప్పే నిత్యజీవమునకు అర్హులం కాగలం. 

 యేసు ప్రభువు మీరును వెళ్లిపోయెదరా? అని శిష్యులను అడుగుతున్నారు. అందుకు పేతురు మేము ఎవరి యొద్దకు వెళ్ళెదము? నీవు నిత్యజీవపు మాటలు కలవాడవు అని చెబుతున్నాడు. పేతురు తన జీవితంలో యేసు ప్రభువులాంటి వ్యక్తిని చూడలేదు. ఒక యూదయ వ్యక్తిగా తన మత గురువులు, పెద్దలు అతనికి తెలిసిఉండవచ్చు. కాని వారు ఎవరు నిత్య జీవం ఇచ్చేవారు కారు. అందుకే ప్రభువుతో పేతురు మేము ఎవరి వద్దకు వెళ్ళెదము, అని అంటున్నాడు. ఎవరి వద్దకు వెళ్లిన యేసు ప్రభువు ఇచ్చే వాగ్దనం వారు ఇవ్వలేరు. ఇస్తాము అని కూడా చెప్పలేరు. ఎందుకంటే ప్రభువు మాత్రమే జీవం. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు జీవమై ఉండెను అని  పవిత్ర గ్రంధం చెబుతుంది. ఆ జీవము, ఆ వాక్కు యేసు ప్రభువే అని తెలుసుకున్న పేతురు ఎక్కడకి వెళ్లక ప్రభువుతో మేము విశ్వసించాము అని చెబుతున్నాడు.  

ప్రార్ధన: ప్రభువా! మీరు జీవవాక్కు. మీ మాటలు మాకు నిత్యజీవమును ఇస్తాయి. మీ మాటలు మా జీవితమునకు మార్గముగా ఉన్నాయి. మీ మాటలు మాకు కఠినముగా ఉన్నప్పటికీ  అవి జీవమును ఇచ్చేవి అని తెలుసుకునేలా దీవించండి. ప్రభువా! మీరే మాకు ఆధారం, మీరే మాకు మార్గం. మేము ఎక్కడికి వెళ్ళగలం. మీ వలే ఎవరు మా భౌతిక ఆధ్యాత్మిక అవసరాలను తీర్చుతూనే ఉన్నారు. అంతేకాకుండా మాకు నిత్యజీవము ఇస్తాను అని వాగ్దానము చేస్తున్నారు. అటువంటి మిమ్ములను కాదని మేము ఎక్కడకు వెళ్ళగలం. మీమీద పూర్తి విశ్వాసం ఉంచి , మారు మనసు పొంది మీమీద ఆధారపడి జీవించే అనుగ్రహం దయచేయండి. ఆమెన్ 

Fr. Amruth 


పాస్కా కాలపు నాలుగవ ఆదివారము

  పాస్కా కాలపు నాలుగవ  ఆదివారము

అపొస్తుల కార్యములు 13:14,43-52
దర్శన 7:9,14-17

యోహాను 10:27-31

      ప్రియ దేవుని బిడ్డలరా ఈ రోజు మనమందరము కూడా పాస్కాకాలపు నాలుగవ ఆదివారంలోనికి ప్రవేశిస్తున్నాము.  ఈ నాటి మొదటి పఠనములో మనము  దేవుని పనిలో నిరుత్సాహం లేకుండా ముందుకు సాగాలని, ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని ఆయన ప్రేమను పంచుకోవాలని ప్రోత్సహిస్తాయి. తిరస్కారం వచ్చినా, దేవుడు మనతో ఉన్నాడనే నమ్మకంతో ముందుకు సాగాలి.
 రెండవ పఠనము యేసులో విశ్వాసం ఉంచి, ఆయన స్వరాన్ని వినిపించి, ఆయనను వెంబడించాలి. ఆయన మనకు శాశ్వత రక్షణను, ఆనందాన్ని, భద్రతను అందిస్తాడు. ప్రతికూలతలు వచ్చినా, దేవుని ప్రేమలో నిలబడాలి అని చూసిస్తుంది.  
చివరిగా సువిశేష పఠనములో యేసు తనను నమ్మే వారికి శాశ్వత రక్షణ, భద్రత, దైవిక సంబంధాన్ని హామీ ఇస్తూ, తాను దేవునితో ఏకమని బోధించారు.

 నేటి మొదటి పఠనము దేవుని వాక్యాన్ని అందరికీ ప్రకటించాల్సిన బాధ్యత ఉంది అని తెలియజేస్తుంది:పౌలు,  మొదట యూదుల సమాజంలో దేవుని వాక్యాన్ని ప్రకటించారు. వారు తిరస్కరించడంతో, అన్యజనులకు సువార్తను తీసుకెళ్లారు. ఇది దేవుని ప్రేమ, రక్షణ అందరికీ సమానమని తెలియజేస్తుంది.

తిరస్కారం ఎదురైనప్పుడు ధైర్యంగా ఉండాలి:
యూదులు అపొస్తులను తిరస్కరించినా, వారు నిరుత్సాహపడలేదు. బదులుగా మరింత ధైర్యంగా దేవుని కార్యాన్ని కొనసాగించారు. మన జీవితాల్లోనూ ప్రతికూలతలు ఎదురైనప్పుడు విశ్వాసంలో నిలదొక్కుకోవాలి.

ఆనందం, పవిత్రాత్మతో నిండిన జీవితం:

అపొస్తులు, శిష్యులు తిరస్కారాన్ని ఎదుర్కొన్నప్పటికీ, వారు పవిత్రాత్మతో నిండిపోయి ఆనందంగా ఉన్నారు. ఇది దేవుని సేవలో ఉన్న వారికి వచ్చే అంతర్గత ఆనందాన్ని సూచిస్తుంది.

          రెండవ పఠనమైన దర్శన గ్రంధములో యోహాను ఒక గొప్ప దర్శనాన్ని పొందాడు. ఇందులో ప్రతి జాతి, తెగ, ప్రజ, భాషల నుండి వచ్చిన అనేక మంది తెల్ల వస్త్రాలు ధరించి, ఖర్జూరపు కొమ్మలు పట్టుకొని దేవుని సింహాసనము ఎదుట నిలబడిన దృశ్యం ఉంది. వీరు "బాధల కాలం" నుండి వచ్చి, తమ వస్త్రాలను గొఱ్ఱెపిల్ల రక్తంలో తెలుపు చేసుకున్నవారు. దేవుడు వారిని పరిరక్షించి, ఇకపై వారికి ఆకలి, దాహం ఉండదు; ఆయన వారి కన్నీళ్లను తుడిచివేస్తాడు.
        
యోహాను 10:27-31 వచనంలో యేసు చెప్పిన ముఖ్యమైన సందేశం మూడు ముఖ్యాంశాలలో ఉంది:
* యేసు తనను నమ్మే ప్రజలను గొఱ్ఱెలుగా పోల్చి, వారు ఆయన స్వరాన్ని వినిపించి, ఆయనను అనుసరిస్తారని చెప్పారు. అంటే, నిజమైన విశ్వాసులు యేసు మాటలను గుర్తించి, ఆయనను అనుసరిస్తారు.

* యేసు తన గొఱ్ఱెలకు నిత్యజీవాన్ని ఇస్తానని, ఎవరూ వారిని ఆయన చేతిలోనుండి అపహరించలేరని స్పష్టం చేశారు. ఇది విశ్వాసులకు శాశ్వత రక్షణ, భద్రత దేవునిలోనే ఉందని తెలియజేస్తుంది.
* నేనును తండ్రియును ఏకమై ఉన్నాము అని యేసు ప్రకటించారు. దీని ద్వారా ఆయన తన దైవత్వాన్ని, తండ్రి దేవునితో తన ఐక్యతను స్పష్టంగా తెలియజేశారు.

           ఈ వచనాల్లో యేసు తనను నమ్మే వారికి శాశ్వత రక్షణ, భద్రత, దైవిక సంబంధాన్ని హామీ ఇస్తూ, తాను దేవునితో ఏకమని బోధించారు.  

        చివరిగా మూడు పఠనలు కూడా మనకు మన జీవితాలకు బోధ ఏమిటంటే యేసులో విశ్వాసం ఉంచి, ఆయన స్వరాన్ని వినిపించి, ఆయనను వెంబడించాలి. ఆయన మనకు శాశ్వత రక్షణను, ఆనందాన్ని, భద్రతను అందిస్తాడు.

Fr. Johannes OCD

రక్షకుడైన యేసు ప్రభువు- మంచి కాపరి

 రక్షకుడైన యేసు ప్రభువు-  మంచి  కాపరి 

యోహాను 10: 27-30

నా గొఱ్ఱెలు నా స్వరమును వినును. నేను వానిని ఎరుగుదును. అవి నన్ను వెంబడించును. నేను వానికి నిత్యజీవము ప్రసాదింతును. కనుక, అవి ఎప్పటికిని నాశనము చెందవు. వానిని ఎవడును నా చేతినుండి అపహరింపలేడు. వానిని నా కిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు. కనుక, వానిని నా తండ్రి చేతి నుండి ఎవడును అపహరింపలేడు. నేనును, నా తండ్రియు ఏకమైయున్నాము" అని చెప్పెను.

నా గొర్రెలు నా స్వరము వినును: 

యేసు ప్రభువు  శిష్యులు తన స్వరం  వినును అంటున్నారు. వినటం అంటే ఆయన ఆజ్ఞలను పాటించడం, ఆయన చెప్పినట్లు చేయడం. వినటం వలన విశ్వాసం వస్తుంది. అబ్రాహాము దేవుని మాటలను విన్నాడు. దేవుడు చెప్పినట్లు చేసాడు. విశ్వాసులకు తండ్రి అయ్యాడు. సమూవేలు ప్రభువును మాటలను విన్నాడు వాటిని పాటించాడు గొప్ప యాజకునిగా, న్యాయాధిపతిగా ఎదిగాడు. మోషే దేవుని మాటను విన్నాడు గొప్ప నాయకునిగా ఎదిగాడు. యేసు ప్రభువు శిష్యులు తమ గురువు స్వరమును వినిన ఆయన మాటలను పాటించిన వారు కూడా గొప్ప వారు అవ్వుతారు. 

నేను వానిని ఎరుగుదును. 

నా గొర్రెలను నేను ఎరుగుదును: ఈ మాటలు ప్రభువుకు ప్రతి శిష్యుడు, అనుచరుడు వ్యక్తిగతంగా తెలుసు అనే విషయాన్ని తెలియజేస్తున్నాయి. ప్రభువుకు తన అనుచరుల సంతోషాలు, కష్టాలు నష్టాలు, బాధలు  అన్ని తెలుసు. వారు ఎంతటి  బలవంతులు, బలహీనులు అనే విషయంకూడా ప్రభువుకు తెలుసు. గొఱ్ఱెలు తమ కాపరిని అనుసరిస్తాయి. తమ కాపరి స్వరము వాటికి తెలుస్తుంది. తమ కాపరి ఎటువంటి అపాయకారి పరిస్థితులలో కూడా తమను విడువడు అని వాటికి అనుభవపూర్వకంగా తెలుసు. వాటిని ఆయన పేరు పెట్టి పిలుస్తాడు. కాపరికి గొర్రెలకు ఉన్న సంబంధములో గొర్రెలను కాపాడుటకు, వన్య మృగములనుండి రక్షించుటకు కాపరి తన ప్రాణమును కూడా పణంగా పెడుతాడు. ఇది ప్రభువుకు తన అనుచరులకు మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధం. ప్రభువు తన అనుచరులను ఎప్పుడు వదలి పెట్టలేదు. ఎప్పుడు వారితోనే ఉన్నాడు. అందుకే ప్రభువు నన్ను ప్రేమించువాడు నామాట పాటించును వాని వద్దకు నేను తండ్రి వచ్చి వానితో నివసింతుము అని చెప్పాడు. 

నా గొఱ్ఱెలు  నన్ను వెంబడించును

యేసు ప్రభువు తన గొర్రెలు తనను వెంబడించును అని ప్రకటిస్తున్నారు. ఇక్కడ ఈ గొఱ్ఱెలు సాధారణమైనటువంటివి కావు. ఎందుకంటే వాటికి తమ కాపరి ఎవరో తెలుసు. ఎవరిని వెంబడించాలో తెలుసు. ప్రక్కతోవను పట్టని గొర్రెలు ఇవి. ఎందుకు ఈ గొఱ్ఱెలు ప్రత్యేకంగా ఉంటాయి అంటే అవి తమ కాపరిని ఎప్పుడు అనుసరిస్తూనే ఉన్నాయి. తనకు దగ్గరగా ఉన్నాయి. తమ కాపరితో ఉన్న ఆ సాన్నిహిత్యం వారిని ఎప్పుడు ఆ కాపరిని కోరుకునే విధంగా చేస్తాయి. ఇది యేసు ప్రభువుకు తన శిష్యులకు ఉన్న సాన్నిహిత్యం గురించి తెలియజేస్తున్నది. ఒకసారి ప్రభువుని స్వరమును విని, ఆయనను వెంబడించిన వారి జీవితం సాధారణ వ్యక్తుల జీవితం వలే ఉండదు. వారు ప్రభువుని నిజమైన అనుచరులు కనుక ఆయన అనుచరులుగా, ఆయన జీవితం తెలిసిన వారిగా, ఈ అనుచరుల జీవితం కూడా ప్రభువుని జీవితం వలే ఉంటుంది. పరిపూర్ణంగా ప్రభువును వెంబడించేవారి జీవితం ద్వారా ప్రభువు ఇతరులకు సాక్షాత్కరము అవుతారు. 

నేను వాటికి నిత్యజీవము ప్రసాదింతును

ఎప్పుడైతే యేసుప్రభువు అనుచరులు ఆయన వలె జీవిస్తారో , ఆయనను తెలుసుకొని, ఆయన స్వరమును విని, ఆ మాటలకు కట్టుబడి జీవిస్తారో వారు ప్రభువు వలె మారిపోతుంటారు. అపుడు వారు ఎల్లప్పుడు ప్రభుతోనే ఉండుటకు అర్హతను సాధిస్తారు. ప్రభువు జీవము. ప్రభువుతో కలిసి ఎల్లప్పుడు ఉండటం అంటే మరణము లేకుండా ఉండటం. అటువంటి వారికి నిత్యజీవం ప్రభువు ఇస్తారు. ప్రభువు మాత్రమే అది ఇవ్వగలరు. ప్రభువు తన అనుచరులకు, శిష్యులకు ఆ అనుగ్రహమును ప్రసాదిస్తారు. 

వారిని ఎవడును ఎప్పుడును అపహరింపడు

ప్రభువు అనుచరులను ఎవరు అపహరించలేరు. ఎందుకంటే తండ్రి ప్రభువునకు తన అనుచరులను ఇచ్చాడు. తండ్రి అందరికంటే గొప్పవాడు. ఎవరు తండ్రి నుండి వారిని అపహరింపలేరు.  ప్రభువుతో వున్న వారిని సాతాను ఎంత ప్రయత్నించిన ఏమి చేయలేదు. వారు ప్రభువు మాటలను, ఆజ్ఞలను ఎప్పుడు అనుసరిస్తారు. ఎప్పుడు కూడా వారు ప్రభువు మాటను జవదాటరు కనుక వారికి అటువంటి అపాయము రాదు. ప్రభువు వారిని  ఎప్పుడు పచ్చికబయళ్లలో మేపుతారు.  నేను తండ్రి ఒకటై ఉన్నాము అని ప్రభువు చెబుతున్నాడు. ప్రభువు శిష్యులతో తన తండ్రితో తనకు ఉన్న సంబంధం గురించి చెబుతున్నారు. అటులనే తన శిష్యులు కూడా ఐక్యంగా ఉండాలని ప్రభువుకోరుతున్నారు.   

ప్రార్ధన: ప్రభువా! మీరు ఈలోకంలో ఉండగా అనేక విధాలుగా మీ శిష్యులను కాపాడుతూ, మీ మాటలను ఆలకించి జీవించుట వలన వారికి వచ్చే అనుగ్రహాల గురించి చెబుతూనే ఉన్నారు. ప్రభువా! ఎల్లప్పుడు మీ స్వరమును ఆలకించి,  మీరు నడిచినట్లు మీ మార్గమును అనుసరించి మా జీవితాన్ని మీ వలె మార్చుకునేల చేయండి. ప్రభువా! మీతో ఎల్లప్పుడు  సాన్నిహిత్యంగా  ఉండి,  మీరు ఇచ్చే నిత్య జీవం పొందేలా చేయండి. ఆమెన్. 

Fr. Amruth 

క్రీస్తు -నిత్యజీవ ప్రధాత మన కాపరి

 క్రీస్తు -నిత్యజీవ ప్రధాత మన కాపరి

యోహాను 10:22-30 

యెరూషలేములో దేవాలయ ప్రతిష్టోత్సవము జరుగుచుండెను. అది శీతకాలము. యేసు దేవాలయమున సోలోమోను మంటపమున నడుచుచుండెను. యూదులు ఆయన చుట్టు  గుమికూడి, "నీవు ఎంత కాలము మమ్ము సందిగ్ధావస్థలో ఉంచేదవు? నీవు క్రీస్తువా? మాకు స్పష్టముగ చెప్పుము" అని అడిగిరి. అందుకు యేసు వారితో, "నేను మీకు చెప్పితిని. కాని, మీరు నమ్ముట లేదు. నా తండ్రి పేరిట నేను చేయు  క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. మీరు నా గొర్రెలలో చేరినవారు కారు. కనుక, మీరు నమ్ముట లేదు. నా గొర్రెలు నా స్వరమును  వినును. నేను వానిని ఎరుగుదును. అవి నన్ను వెంబడించును. నేను వానికి నిత్యజీవము  ప్రసాదింతును. కనుక, అవి ఎప్పటికీ నాశము చెందవు. వానిని ఎవడును నా చేతి నుండి అపహరింపలేడు. వానిని నాకిచ్చిన నా తండ్రి అందరి కంటే గొప్పవాడు. కనుక, వానిని  నా తండ్రి చేతి నుండి ఎవడును అపహరింపలేడు. నేను, నా తండ్రి ఏకమైయున్నాము" అని చెప్పెను. 

ఎందుకు యిస్రాయేలు కాపరులు విఫలం అయ్యారు? 

"యెరూషలేములో దేవాలయయెరూషలేములో దేవాలయ ప్రతిష్టోత్సవము జరుగుచుండెను. అది శీతకాలము. యేసు దేవాలయమున సోలోమోను మంటపమున నడుచుచుండెను." దేవాలయ  ప్రతిష్టోత్సవము యిస్రాయేలు పండుగలలో చాలా ముఖ్యమైన పండుగ. అది వారు యేరుషలేము దేవాలయాన్ని మక్కబియుల కాలంలో  పునః ప్రతిష్ట చేసిన సమయాన్ని గుర్తు చేస్తూ పండుగ జరుపుకునే సమయం. ఈ సమయాలలో వారు యెహెజ్కేలు గ్రంధంలో యిస్రాయేలు ప్రజలకు దేవుడు తానే కాపరిగా ఉంటాను అనే మాటలను ధ్యానించేవారు, వారి కాపరులు ఎలా కాపరులగా విఫలం చెందారో ధ్యానించేవారు. ఈ సంధర్భంలో జరుగుతున్న సువిశేషం భాగం ఇది. ఎవరు నిజమైన కాపరి. ఎలా కాపరులు విఫలం చెందారు? అంటే  యిస్రాయేలు కాపరులు స్వార్ధంతోటి జీవించి వారి బాధ్యతను విస్మరించారు. 

 సంపూర్ణమైన విశ్వాసం 

"యూదులు ఆయన చుట్టు  గుమికూడి, "నీవు ఎంత కాలము మమ్ము సందిగ్ధావస్థలో ఉంచేదవు? నీవు క్రీస్తువా? మాకు స్పష్టముగ చెప్పుము" అని అడిగిరి." ఇక్కడ కొంతమంది యేసు ప్రభువు దగ్గరకు వచ్చి నీవు క్రీస్తువా? అని అడుగుతున్నారు. ఎందుకు వారు ఆయనను అడుగుతున్నారు అంటే ఆయన వారికి అప్పటికె  కాపరి గురించి,  యిస్రాయేలు కాపరి గురించి చెప్పాడు. యేసు ప్రభువే  వారికి కాపరిగా కావాలని వుంది. ఆయన చేసిన పనులను బట్టి ఆయన వారి కాపరి అయితే వారికి దేవుని నుండి వచ్చే మేలుల గురించి వారికి ఒక అవగాహన ఉంది, కనుక వారు యేసు ప్రభువును నీవు క్రీస్తువా? అని అడుగుతున్నారు. కాని యేసు ప్రభువు అనేక సార్లు తన పనులు తాను క్రీస్తు అని చెబుతున్నాయి అని వ్యక్తం చేశారు. అయినప్పటికీ వారు మరల ఆయనను ఇదే ప్రశ్న అడుగుతున్నారు. యేసు ప్రభువు వారిని సంధిగ్ధావస్థలో ఉంచలేదు. పూర్తిగా యేసు ప్రభువుకు చెందిన వారిగా ఉండుటకు వారు నిశ్చయించుకోలేదు అందుకే వారు అలా మాటలాడుతున్నారు.  ప్రభువును విశ్వసించిన వారికి ఆయన మీద ఎటువంటి అపనమ్మకం లేదు. ఆయన పనులను మొత్తాన్ని వారు నమ్ముతారు. 

ప్రభువు అతీతమైన శక్తి గలవాడు 

"అందుకు యేసు వారితో, "నేను మీకు చెప్పితిని. కాని, మీరు నమ్ముట లేదు. నా తండ్రి పేరిట నేను చేయు  క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. " యేసు ప్రభువు మరల వారికి ఆయన ఎవరు అనే విషయం తేటతెల్లం చేస్తున్నారు. నేను మీకు ముందే చెప్పితిని అని అంటున్నారు. కాని వారు ఆయన మాటలను నమ్మని విషయాన్ని ఆయన వారికి చెబుతున్నారు. యేసు ప్రభువు ఇక్కడ తాను చేసే పనులు తన గురించి  సాక్ష్యం ఇస్తున్నవి అని చెబుతున్నారు. ఇది ఇక్కడ మాత్రమే కాదు యేసు ప్రభువు చేసిన ప్రతి పని కూడా ఆయన ఎవరు ? అని ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. ఎందుకంటే ఆయన చేసిన ప్రతి పని కూడా మానవ మాత్రుడు ఎవరు చేయలేనటువంటి పని. ఆయన ప్రతి కార్యం కూడా రక్షణ ఇచ్చే కార్యం. దాని ద్వారం ఆయన దేవుడు అని తెలుస్తుంది. ఇవి అన్ని చూసి కూడా ఆయనను మరలా అదే ప్రశ్న వారు అడుగుతున్నారు. వారు ఆయనను నమ్ముటకు సిద్ధంగా లేరు. వారు ఆయనను ఎందుకు నమ్ముట లేదు అంటే వారు ఆయనకు చెందిన వారు కాదు. 

"మీరు నా గొర్రెలలో చేరినవారు కారు. కనుక, మీరు నమ్ముట లేదు. నా గొర్రెలు నా స్వరమును  వినును. నేను వానిని ఎరుగుదును. అవి నన్ను వెంబడించును." ఆయనకు చెందిన వారు అయితే ఆయన మాటలను విశ్వసించేవారు. ఆయనను వెంబడించేవారు. కాని ఆయనకు చెందిన వారిగా ఉండుటకు వారికి ఇష్టం లేదు. ఆయన అనుచరులుగా ఉండేవారికి, ఆయనను అనుసరించే వారికి ఆయన ఎవరు అని తెలుసు, ఆయన చేసే పనులన్నీ కూడా దేవునికి మాత్రమే సాధ్యం, మానవ మాత్రుడు ఎవరు కూడా ఆయన చేసే పనులని చేయలేరు. ఎందుకు కొంతమంది ఆయనను నమ్ముట లేదు? దీనికి కారణం ఏమిటి అంటే ఆయనను నమ్మని వారు వారి జీవితాలను మార్చుకోవడానికి సిద్ధంగా లేరు, ఆయనకు పూర్తిగా చెందిన వారిగా ఉండుటకు ఇష్ట పడలేదు. ఎందుకంటే ఆయనకు చెందిన వారిగా ఉండాలి అంటే ఆయన మాటలకు అనుకులమూగ జీవించాలి. ఆయన చెప్పినట్లుగా జీవించుటకు వీరు సిద్ధముగా లేరు కనుక ఆయనను వారు నమ్మక మరలా ఆయనను ప్రశ్నిస్తున్నారు. కాని యేసు ప్రభువుకు చెందిన వారు ఆయనను ఎప్పుడు వెంబడిస్తూనే వుంటారు. 

నిత్యజీవ ప్రదాత ప్రభువు 

"నేను వానికి నిత్యజీవము  ప్రసాదింతును. కనుక, అవి ఎప్పటికీ నాశము చెందవు."  యేసు ప్రభువు తనను అనుసరించే వారికి నిత్యజీవము ఇస్తాను అని వాగ్ధానం చేస్తున్నాడు. కనుక వారు ఎల్లకాలము జీవిస్తారు. వారు నాశము చెందక జీవిస్తారు. ఎందుకు వారు నాశము చెందరు, అంటే ఆయనే జీవం, ఈ జీవంతో ఉన్న వారు ఎవరు కూడా నాశము చెందరు. ఈ జీవం మనలను ఎల్లపుడూ జీవించాడానికి మనతో పాటు ఉంటుంది. ఇది అందరికీ కాక ఆయనకు చెందిన వారికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇది యేసు ప్రభువు మనకు చాలా సందర్భాలలో చెప్పడం జరిగింది. మనం కూడా ఈ జీవం కలిగి ఉండటానికి సిద్దపడుతున్నామా! లేక ఈ లోక విషయాలలోనే సంతృప్తి పడుటకు ఇష్టపడుతున్నామా? ఈ ప్రశ్నలను ప్రతి నిత్యం మనం అడగవవలసిన అవసరము ఉన్నది. 

"వానిని ఎవడును నా చేతి నుండి అపహరింపలేడు. వానిని నాకిచ్చిన నా తండ్రి అందరి కంటే గొప్పవాడు. కనుక, వానిని  నా తండ్రి చేతి నుండి ఎవడును అపహరింపలేడు. నేను, నా తండ్రి ఏకమైయున్నాము" అని చెప్పెను. ఇక్కడ మనం యేసు ప్రభువుని శిష్యులు లేక ఆయన అనుచరులను, ఆయనకు చెందిన వారిని ఎవరు ఆయన నుండి అపహరించలేరు అని అంటున్నారు దానికి కారణం ఏమిటి అంటే ఆయనను వారు అంతగా అనుభవించారు, ఆయనను వారు అంతగా అనుభవ పూర్వకముగా తెలుసుకున్నారు కనుక ఆయన నుండి ఎవరు వారిని వేరు చేయడానికి ప్రయత్నించిన అది కుదరదు, దైవ అనుభవం అంత గొప్పది. పునీత పౌలు మరియు అనేక మంది పునీతులు ఇలా జీవించిన వారే. వారికి క్రీస్తు తప్ప మిగిలినది మొత్తం వ్యర్ధమే.  అంతేకాదు యేసు ప్రభువు నుండి తీసుకొనుట అంటే తండ్రి నుండి తీసుకొనుట రెండు కూడా సాధ్యం కాదు. ఇక్కడ యేసు ప్రభువు తండ్రితో తనకు ఉన్న ఐక్యతను, వారు ఇద్దరు ఏకమై ఉన్న విషయాన్ని తెలియజేస్తున్నాడు.

ప్రార్ధన : ప్రభువా మీరు మా నిజమైన కాపరి అని మేము తెలుసుకుంటున్నాము. కొన్ని సార్లు మా స్వార్ధ బుద్ధితో ఎక్కడ మా జీవితములో మిమ్ములను అనుసరించినట్లయితే మమ్ములను మేము మార్చుకోవాలి ఏమో, అనే ఆలోచనలతో మీ కాపుదలలో ఉండకుండా మీరు ఎవరో తెలియదు అనే విధంగా మేము జీవిస్తున్నాము అటువంటి సమయాలలో మమ్ములను క్షమించండి. మేము మిమ్ములను మా కాపరిగా అంగీకరించి జీవించే విధంగా మమ్ములను దీవించండి. మేము మీ పనుల, ద్వారా, మీ మాటల ద్వారా మీరే రక్షకుడు అని తెలుసుకుంటున్నాము. మమ్ములను మీ అనుచరులుగా, మీ మందలోనివారినిగా చేయండి. మేము మీ నుండి ఎవరిచేత అపహరింపకుండా ఉండేలా కాపాడండి. దాని ద్వారా మేము ఎప్పటికీ నాశము చెందక మీరు చెప్పిన నిత్యం జీవం పొందేలా మరియు  మేము ఎప్పుడు మీ స్వరమును విని పాటించే విధంగా మమ్ము దీవించండి. ఆమెన్. 

Fr. Amruth 

యేసులా జీవించుట -దేవుని స్నేహితుడవుట

 

యేసులా జీవించుట  -దేవుని స్నేహితుడవుట

యోహాను 15: 9-17 

నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించితిని. మీరు నా ప్రేమయందు నెలకొనియుండుడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని యుండునట్లు మీరును నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొనియుందురు. "నా ఆనందము మీయందు ఉండవలయుననియు, మీ ఆనందము పరిపూర్ణము కావలయుననియు నేను మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. నేను మిమ్ము ప్రేమించినటులనే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ఇదియే నా ఆజ్ఞ. తన స్నేహితులకొరకు తన ప్రాణమును ధారపోయువానికంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడును లేడు. నేను ఆజ్ఞాపించినవానిని పాటించినచో మీరు నా స్నేహితులైయుందురు. తన యజమానుడు ఏమి చేయునో దాసుడు ఎరుగడు. కనుక ఇకమీదట నేను మిమ్ములను దాసులని పిలువక, స్నేహితులని పిలిచెదను. ఏలయన, నేను నా తండ్రివలన వినినదంతయు మీకు విశదపరచితిని.మీరు నన్ను ఎన్నుకొనలేదు. కాని, నేను మిమ్ము ఎన్నుకొంటిని. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించుటకును, మీరు వెళ్లి ఫలించుటకును, మీఫలము నిలిచియుండుటకును, మిమ్ము నియమించితిని. మీరు పరస్పరము ప్రేమకలిగి ఉండవలయునని ఈ విషయములను మీకు ఆజ్ఞాపించుచున్నాను. 

యోహాను సువిశేషంలోని ఈ భాగం యేసు ప్రభువు మరియు తండ్రి మధ్య  ప్రేమ, అయన మనలను ఎలా ప్రేమించారో అటువంటి ప్రేమ ఒకరిమీద ఒకరు కలిగి ఉండటం గురించి బోధిస్తుంది. ఆయన వలె ఎలా మనము కూడా ప్రేమించగలం అంటే కేవలం ఆయన ఆజ్ఞలను పాటించడం ద్వారానే, అపుడే   ఆయన ప్రేమలో నెలకొని ఉండటం  జరుగుతుంది అనే విషయాన్ని తెలియజేస్తుంది. 

యేసు ప్రభువు మరియు  తండ్రి మధ్య ప్రేమ  

నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించితిని. మీరు నా ప్రేమయందు నెలకొనియుండుడు. యేసు ప్రభువు నిత్యము తండ్రి ప్రేమను అనుభవిస్తూనేఉన్నాడు. అది ఎలా అంటే వారి ఇద్దరి యేసు ప్రభువు ఈలోకంలో జన్మించినప్పుడు దేవుని దూతలు తమ ఆనందమును వ్యక్తం చేశారు. యేసు ప్రభువు బాప్తిస్మము తీసుకునేటప్పుడు ఇతను నా ప్రియమైన కుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని దేవుని స్వరము వినిపించింది. యేసు ప్రభువు అలవాటు చొప్పున ఉదయమునే దేవాలయమునకు వెళ్లడం లేదా ఒంటరిగా ప్రార్ధనకు వెళ్లడం మనకు ఆయన తండ్రితో ఎంత సాన్నిహిత్యాన్ని కోరుకున్నాడు,  అనేది మనకు తెలుస్తుంది. యేసు ప్రభువు అద్భుతం చేసిన తరువాత తండ్రికు కృతజ్ఞత తెలియజేస్తుంటాడు. తండ్రి చిత్తమును తన ఆహారముగా మార్చుకొని, తండ్రి చిత్తమును నెరవేర్చడమే తన ధ్యేయం చేసుకున్నాడు. యేసు ప్రభువు శ్రమలు అనుభవించాలని తెలిసికూడా, వాటి ద్వారా తన తండ్రి కోరుకున్న మానవ రక్షణ జరుగుతుంది అని  వాటిని అనుభవించడానికి నిశ్చయించుకున్నాడు. ఇక్కడ యేసు ప్రభువు తాను తండ్రి ఎప్పుడు ఏకమై ఉన్నాము అని చెప్పుచున్నాడు.

దేవుని ఆజ్ఞలు పాటించుట- నిత్యానందకారకం 

మీరు నా ప్రేమయందు నెలకొనియుండుడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని యుండునట్లు మీరును నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొనియుందురు. యేసు ప్రభువు ఎలా తన తండ్రి ప్రేమలో ఉన్నాడో మనకు వివరంగా చెబుతున్నారు. ఇది కేవలం తండ్రి ఆజ్ఞలను పాటించడం వలన యేసు ప్రభువు తండ్రి ప్రేమలోనే నెలకొనియున్నాడు. యేసు ప్రభువు, నేను ఎందుకు తండ్రి సంకల్పం నెరవేర్చడానికి పూనుకోవాలి అని అనుకోలేదు. తండ్రి చిత్తమును నెరవేర్చడమే తన కర్తవ్యం అని దానిని నెరవేర్చడానికి ఏమి చేయడానికైన సిద్ధపడ్డాడు. మరణించడానికి సిద్ధపడ్డాడు. దానిద్వారా ఆయన తండ్రికి ఎప్పుడు దూరంగా లేడు. ఎల్లప్పుడు తండ్రితో కలిసియున్నాడు. తద్వారా నిత్యానందము పొందుతున్నాడు.  యేసు ప్రభువుని మాటలను మాటలను విని, ఆయన వలె, పాటించినట్లయితే  మనము కూడా నిత్యము ఆనందంగా ఉండవచ్చు. నేను నా ప్రభువుని చిత్తమును నెరవేర్చాను అనే ఆనందం ఎల్లపుడు మనతో ఉంటుంది. 

 యేసు ఆజ్ఞల అనుసరణ - ఆయన స్నేహితునిగా మార్పు

 యేసు ప్రభువు ఇచ్చిన ప్రేమ ఆజ్ఞ చాల ఉన్నతమైనది. నేను మిమ్ములను ప్రేమించినట్లు మీరును ఒకరిని ఒకరు ప్రేమించుకొనుడు అని చెబుతున్నారు. అంతేకాదు తన స్నేహితుని కొరకు తన ప్రాణమును ధారపోయువానికంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడు లేడు అని చెబుతున్నాడు. మనలను తన స్నేహితులను చేస్తున్నాడు. యేసు ప్రభువు మన కోసం తన ప్రాణమును అర్పించాడు. మనము ప్రభువునకు ప్రియమైన వారమని తెలియజేస్తున్నాడు.  మనము కూడా ప్రభువు చెప్పినట్లు ఆయన ఆజ్ఞలనుపాటిస్తే మనము ఆయన స్నేహితులము అవుతాము అని చెబుతున్నాడు. పాత నిబంధనలో అబ్రాహామును కూడా దేవుని స్నేహితుడు అని ఆంటారు.  దేవుని ఆజ్ఞలు పాటించుట వలన ఆయన స్నేహితులం  అవుతాము.యేసు ప్రభువు మనం ఆయన స్నేహితులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. 

ప్రార్ధన: ప్రభువా! మీరు తండ్రితో ఎప్పుడు సాన్నిహిత్యం కలిగివున్నారు. తండ్రి కూడా మిమ్ముల్ని ఎంతగానో ప్రేమించాడు. మీరు చేసిన అన్ని పనులు తండ్రి అనుమతి ఉంది. మీరు తండ్రి ప్రేమయందు ఉన్నట్లు, మేము మీ ఆజ్ఞలను అనుసరిస్తూ మీ ప్రేమను ఇతరులకు చూపిస్తూ మీ స్నేహితులుగా జీవించేలా చేయండి. ఆమెన్. 

Fr. Amruth 

యేసు ప్రభువుని వ్యక్త పరచుట- శిష్యుల కర్తవ్యం

 యేసు ప్రభువుని వ్యక్త పరచుట- శిష్యుల కర్తవ్యం

యోహాను 13: 16-20

దాసుడు తన యజమానునికంటే గొప్పవాడు కాడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సంగతులను మీరు ఎరుగుదురు. వీని ప్రకారము నడుచుకొనినచో మీరు ధన్యులు. నేను మీ అందరి విషయమై మాటాడుట లేదు. కాని 'నాతో భుజించువారు నాకు విరుద్ధముగా లేచును. అను లేఖనము నెరవేరుటకై ఇట్లు జరుగుచున్నది. అటుల జరిగినపుడు నేనే ఆయనను అని మీరు విశ్వసించుటకై ఇది జరుగుటకు పూర్వమే  మీతో చెప్పుచున్నాను. నేను పంపిన వానిని స్వీకరించువాడు నన్నును స్వీకరించుచున్నాడు. నన్ను స్వీకరించువాడు నన్ను పంపినవానిని  స్వీకరించుచున్నాడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను."

సువిశేషంలోని ఈ భాగము యేసు ప్రభువునకు మరియు శిష్యులకు ఉన్న బంధమును , తన శిష్యులను స్వీకరించువానికి సంబంధించి బోధిస్తున్నాయి. యేసు ప్రభువుతో ఉండి ఆయనకు వ్యతిరేకంగా యూదా చేయు పనిని తెలియజేస్తూ , తరువాత శిష్యులు దైర్యంగా ఉండుటకు , స్వార్ధం లేకుండ ఉండుటకు ముందుగానే వారిని హెచ్చరిస్తున్నారు. ఎవరు అయితే యేసు ప్రభువును స్వీకరించారో వారు తండ్రిని స్వీకరించారని, యేసు ప్రభువు శిష్యులను స్వీకరించువారు యేసు ప్రభువును స్వీకరిస్తున్నారని ప్రకటిస్తున్నారు. ఇది యేసు ప్రభువు మరియు శిష్యుల అన్యోన్యతను మరియు ప్రభువు తన శిష్యుల ద్వారా ఇతరులకు తెలియపరచబడాలని కోరుకుంటున్నాడు అని తెలియజేస్తుంది. 

శిష్యుల ప్రవర్తన ఎలా ఉండాలి  

యేసు ప్రభువు తన శిష్యులను ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు ఇవి. శిష్యుడు గురువు కంటే గొప్పవాడు కాదు. యేసు ప్రభువును లోకం ఎలా చూసినదో, శిష్యులను కూడా అలానే చూస్తుంది. అప్పుడు ఈ శిష్యులు రాబోయే కష్టాలు, నష్టాలు బాధలు చూసి చెదిరిపోకుండా ఉండాలి. ప్రభువు శ్రమలకు గురైనట్లే వీరుకూడా శ్రమలకు గురవుతారు. యేసు ప్రభువు ఎలా సేవ చేశారో, వీరు కూడా అలానే చేయాలి, ఆయన గురువు, బోధకుడు అయ్యివుండి కూడా వారి కాళ్ళు కడిగారు, వారి మీద పెత్తనం చేయలేదు. వారి అవసరంలో ఆదుకున్నాడు. క్రీస్తు విశ్వాసికి, శిష్యునకు గర్వం లేక అహంకారం ఉండకూడదు. ప్రభువు పట్ల  వినయం, ప్రజల పట్ల సేవభావం మాత్రమే వారికి ఉండాలి. 

ప్రభువు మాటను ఆచరించుట గొప్ప ధన్యత 

యేసు ప్రభువు తన శిష్యులను అన్నివిధాలుగా సిద్దపరిచాడు. ఏవిధంగా వారు ధన్యులు అవుతారో వారికి తెలియజేస్తున్నారు. కేవలం యేసు ప్రభువు వద్ద నుండి వారు చూచిన ఈ ప్రేమ గురించి, ఈ వినయం గురించి తెలుసుకోవడం వలన వారు గొప్ప వారు కారు, ఎప్పుడైతే ఆయన శిష్యులు యేసు ప్రభువు వలే ప్రేమ జీవితం జీవిస్తూ, ఇతరులకు సేవ చేస్తూ, అహం లేకుండ ఉంటారో అప్పుడు వారు గొప్పవారు అవుతారు. కేవలము యేసు ప్రభువు చేసిన లేక చెప్పిన మాటలను తెలుసుకోవడం వలన కాక  వాటిని పాటించడం ద్వారా మనం ధన్యులం అవుతాం. కనుక ఆయన వలె జీవించుట, మనం అలవాటు చేసుకోవాలి. అందుకే పవిత్ర గ్రంధంలో మంచి చెడులు తెలిసినవారు కాదు జ్ఞానులు, మంచి చెడులు తెలిసి మంచి మాత్రమే అనుసరించు వారిని జ్ఞానులు అంటారు. 

ఎప్పుడు శిష్యులు ప్రభువుకు వ్యతిరేకంగా జీవిస్తారు 

 "నాతో భుజించువారు నాకు విరుద్ధముగా లేచును" యేసు ప్రభువు ఈమాటలను తనను అప్పగించబోతున్న యూదా గురించి చెబుతున్నారు. తనను ఎవరు అప్పగించబోవుతున్నారో ప్రభువుకు ముందుగానే తెలుసు. యేసు ప్రభువు ఈ విషయమును ముందుగానే తన శిష్యులకు ఏమిజరుగబోతున్నదో తెలియజేస్తున్నాడు. తరువాత వారు ప్రభువు ముందుగానే ఈ విషయమును వారికి తెలియజేసి వారిని అన్నిటికి సిద్ధపడేలా జేస్తున్నాడు. యూదా గురించి ప్రభువు ముందుగానే తెలుసు అందుకే మీరు శుద్ధులై ఉన్నారు కాని అందరు కాదు అని చెప్పారు. యూదా యేసు ప్రభువుతోటి కలిసి జీవించాడు, కలిసి తిన్నాడు కాని, తన స్వార్ధానికి తనను నమ్మిన ప్రభువును అమ్ముకుంటున్నాడు. ప్రభువులో ఏ లోపం చూసి యూదా యేసు ప్రభువుకు వ్యతిరేఖంగా మారలేదు, కేవలం స్వార్ధం, అసూయ, స్వలాభం అనేక గుణాలను పెంపొందించుకొన్నాడు. ప్రభువు గురించి తెలిసి కూడా తన స్వార్ధముననే నిలబడ్డాడు. లేఖనము నెరవేరుటకై ఇవన్నీ జరగాలి అని ప్రభువు చెబుతున్నారు. అంటే ప్రభువు మనలను రక్షించుటకు అన్నిటికి సిద్దపడిఉన్నాడు.  ఇవన్నీ జరిగినప్పుడు వారు ప్రభువు వారికి ఇవ్వన్నీ చెప్పారు అని వారు తెలుసుకున్నారు. 

ప్రభువును స్వీకరించుట

యేసు ప్రభువున శిష్యులు గురువు, రాజు, ప్రవక్త,  క్రీస్తుగా స్వీకరించారు. యేసు ప్రభువును ఈవిధంగా స్వీకరించడం ద్వారా యేసు ప్రభువును గౌరవిస్తున్నారు. దేవునితో ఆయనకు ఉన్న సంబంధమును అంగీకరిస్తున్నారు. కేవలం అంగీకరించడమే కాక వారుకూడా ఆ బంధములో ఉండాలనే కోరికను వెల్లడిచేస్తున్నారు. తనను స్వీకరించువారు తన తండ్రిని స్వీకరిస్తున్నారు అని చెబుతున్నారు. యేసు ప్రభువు తండ్రి తరపున, తండ్రి చిత్తమును నెరవేర్చడానికి వచ్చాడు. యేసు ప్రభువు తన శిష్యులను అన్ని విధాలుగా  సిద్ధపరచే సమయం కడరా భోజన సమయం. అందుకే ఇక్కడ వారితో చెబుతున్నాడు. మిమ్ములను స్వీకరించువాడు నన్ను స్వీకరిస్తున్నాడు అని అంటున్నాడు. యేసు ప్రభువు శిష్యులు ఆయన  ప్రతినిధులుగా వున్నారు. వారి జీవితం, మాటలు, పనుల ద్వారా ప్రభువును వ్యక్తపరచాలి. శిష్యులు ప్రభువుతో సంభందం కలిగివున్నారు. దేవుని వాక్కును బోధించుట, దేవుని అనుభవించిన వారి కర్తవ్యం. అది ధన్యమైన జీవితం. వారిని గౌరవించడం అందరి విధి.  

ప్రార్ధన : ప్రభువా! మీ  శిష్యులను అన్ని విధాలుగా మీవలే గొప్ప జీవితం జీవిస్తూ, ఇతరుల రక్షణ కొరకు పాటుపడాలని కాక్షించారు. వారు మీరు వాక్కును బోధిస్తూ ఉన్నత జీవితం జీవించారు. మీ వలె కొన్నిసార్లు తిరస్కరించబడ్డారు. మా జీవితాలలో కూడా మిమ్ములను ఇతరులకు తెలియపరచాలని కోరుకుంటున్నాము. అందుకు మీలాంటి జీవితం జీవించాలని ఆశపడుతున్నాము. కాని కొన్ని సార్లు మాలో ఉన్న స్వార్ధం మమ్ములను మీకు దూరంగా చేస్తుంది. అటువంటి సమయాలలో మమ్ము క్షమించి, మేము మీ నిజమైన శిష్యులుగా జీవించుటకు కావలసిన అనుగ్రహము దయచేయండి.  మేము మీ వాక్కును బోధించేవారిని గౌరవించి, మిమ్ములను స్వీకరించేలా మమ్ములను మార్చండి. ఎప్పుడు మీతో ఉండాలనే మమ్ము దీవించండి. ఆమెన్  

Fr. Amruth 


కలవరపడకుడు యేసు మీతో ఉన్నాడు

 కలవరపడకుడు యేసు మీతో ఉన్నాడు 

యోహాను 14: 1-6 

యేసు వారితో "మీ హృదయములను కలవరపడనియకుడు. దేవుని విశ్వసింపుడు. నన్నును విశ్వసింపుడు. నా తండ్రి గృహమున అనేక నివాసములు కలవు. లేకున్నచో నేను మీతో అటుల చెప్పను. నేను మీకొక నివాసస్థానమును సిద్దము చేయబోవుచున్నాను. నేను వెళ్ళినచో మీకు ఒక నివాసమును సిద్ధపరచి, మరల వత్తును. నేను ఉండు స్థలముననే మీరును ఉండునట్లు మిమ్ములను నా యొద్దకు చేర్చుకొందును. నేను వెళ్ళు స్థలమునకు మార్గమును  మీరు ఎరుగుదురు." అనెను. తోమా ఆయనతో "ప్రభూ! మీరు వెళ్ళు స్థలమేదో మాకు తెలియదు. ఇక మార్గమేట్లు ఎరుగుదుము?" అనెను. అందుకు యేసు, "నేనే మార్గమును, సత్యమును, జీవమును నా మూలముననే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు. 

శిష్యుల ఎందుకు కలవరపడుతున్నారు? 

యేసు ప్రభువు తన శిష్యులతో మీ హృదయములను కలవరపడనియకుడు అని చెబుతున్నారు. వీరు కలవరపడవలసిన పరిస్తితి ఎందుకు వచ్చినది? ఎందుకంటే యేసు ప్రభువు వారి నుండి వెళ్లిపోతున్నాను అని చెప్పారు. మూడు సంవత్సరాలు వారు యేసు ప్రభువుతో కలిసి జీవించారు. ఆయన చేసిన అన్ని అద్భుతకార్యములకు, ఆయన చూపిన కారుణ్యమునకు వీరు సాక్షులు. శిష్యులకు ఆయన జీవితం భరోసా అయ్యినది. అటువంటి ప్రభువు ఇప్పుడు వారి నుండి వెళ్లిపోతున్నారు. ఇంకా ఎందుకు వీరు కలవరపడుతున్నారు? యేసు ప్రభువుకి పరిసయ్యులు, ధర్మ శాస్త్ర భోదకులు కొంత మంది సద్దుకయ్యులు శత్రువులుగా మారిపోయారు. ఇప్పుడు యేసు ప్రభువు వీరి నుండి వెళ్లిపోతే యేసు ప్రభువు శిష్యులు వారికి శత్రువులుగా మారి వీరిని, శిక్షిస్తారు అని కలవరం వారికి ఉండవచ్చు.  యేసు ప్రభువుకు మరియు శిష్యులకు ఉన్న సంబంధం చాలా అన్యోన్యత కలిగిఉన్నది. ఈ అన్యోన్యత తెగిపోతుంది అని వారు కలవరపడి ఉండవచ్చు. 

ఎందుకు ప్రభువు శిష్యులు కలవరపడకూడదు 

యేసు ప్రభువుతో పేతురు తన కోసం మరణించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను, అందరు వెళ్ళిపోయిన, తాను వదలి వెళ్ళను అని అన్నాడు, దానికి యేసు ప్రభువు, పేతరు తనను ఎరుగనని చెబుతున్నారు ఏమి జరుగబోవుతుందో అని కలవరపడిఉండవచ్చు.  తమ గురువును వారే అమ్మబోవుతున్నారు అని యేసు ప్రభువు చెబుతున్నారు, అది తలచుకొని వారు కలవరపడి ఉండవచ్చు. ప్రతి ఒక్కరికీ ఒక్కో కారణం ఉండి ఉండవచ్చు కలవరపడటానికి , అది వారికి యేసు ప్రభువుకు మధ్య ఉన్న అన్యోన్యత మరియు ప్రేమ మీద ఆధారపడుతుంది. యేసు ప్రభువు వీరికి కలవరపడవద్దు అని చెబుతున్నారు. వీరు కలవరపడకుండా ఉండుటకు ఆయన కారణం చెబుతున్నారు. ఆయన వారి నుండి  పోవుతున్నది వారి కోసమే అని చెబుతున్నారు. వారు ఎందుకు కలవరపడనవసరం లేదంటే, ఆయన వారి నుండి వెల్లుతున్నది వారికి ఒక నివాసస్థానం ఏర్పాటు చేయడానికి. మరలా ఆయన వారి వద్దకు వచ్చును. ఆయన వుండే చోటునే వీరు కూడా ఉండే విధంగా ఆయన చేస్తారు. కనుక వారు కలవరపడనవసరం లేదు. 

యేసుప్రభువు  శాశ్వత నివాసము ఏర్పాటు చేయుటకు వెళుతున్నారు. 

"నా తండ్రి గృహమున అనేక నివాసములు కలవు. లేకున్నచో నేను మీతో అటుల చెప్పను. నేను మీకొక నివాసస్థానమును సిద్దము చేయబోవుచున్నాను. నేను వెళ్ళినచో మీకు ఒక నివాసమును సిద్ధపరచి, మరల వత్తును. నేను ఉండు స్థలముననే మీరును ఉండునట్లు మిమ్ములను నా యొద్దకు చేర్చుకొందును." నా తండ్రి గృహమున అనేక నివాసములు కలవు. యేసు ప్రభువు తన తండ్రి గురించి ఎప్పుడు చెబుతూనే ఉన్నారు. ఇక్కడ కూడా మనం చూసేదీ తండ్రికి మరియు కుమారునికి మధ్యగల సంబంధం, అందుకే ఆయన "నా"తండ్రి గృహమున అనేక నివాసములు కలవు అని చెబుతున్నారు. ఈ సంబంధం గురించి ఆయన అనేక సార్లు చెప్పుటకు కారణం ఏమిటి అంటే తన తండ్రిని ఆయన అంతగా ప్రేమిస్తున్నారు అని తెలియచేయడమే, ఆయనే పనులను మాత్రమే కుమారుడు చేస్తున్నాడు. తండ్రికి తెలియకుండా ఏమి చేయుటలేదు. ఆయన తన తండ్రి గృహమున మనకు ఒక నివాసాన్ని ఏర్పాటుచేయడానికి కల్వరి కొండమీద శిలువ మరణం ద్వారా మనకు సిద్దపరుస్తున్నాడు. మూడు రోజులు భూగర్భంలో ఉండి మనకు నివాసాన్ని ఏర్పాటుచేస్తున్నాడు. 

యేసు ప్రభువుతో ఎల్లప్పుడు ఉండుట 

"నేను ఉండు స్థలముననే మీరును ఉండునట్లు మిమ్ములను నా యొద్దకు చేర్చుకొందును." యేసు ప్రభువు ఇక్కడ చేసిన ఈ వాగ్ధానం తన శిష్యులకు చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఆయన తన శిష్యులను వదలి వేయడం లేదు. ప్రత్యేకంగా వీరి కొరకు వస్తాను అని చెబుతున్నారు. ఇది లోకాంతంలో కాదు. ఇది తన శిష్యులు ఎప్పుడు కూడా ఆయన సాన్నిధ్యం పొందేలా చేస్తుంది. అంతేకాక వీరిని తన వద్దకు చేర్చుకుంటాను అని చెబుతున్నారు. యేసు ప్రభువు తన శిష్యులను , మరియు తన శిష్యుల ద్వారా ఆయన అనుచరులు అయిన వారికి ఇచ్చిన ఒక గొప్ప వరం ఇది. నేను ఉండు స్థలమునే మీరును ఉండునట్లు నా వద్దకు చేర్చుకొందును అనే వాగ్ధానం మరల ఆయన శిష్యులు ఎవరు నీరుత్సాహంలో లేకుండే చేసే వాగ్ధానం. కాని దీనిని ఎల్లప్పుడు గుర్తుంచుకోవడంలో మనం విఫలం  చెందుతున్నాము. యేసు ప్రభువు చేసిన ప్రతి వాగ్ధానం మనం గుర్తు చేసుకొని మనం జీవించినచో మన జీవితంలో ఎటువంటి అపాయంలో కూడా మనం కలవరపడకుండా ఉండగలం. 

తోమా ఆయనతో "ప్రభూ! మీరు వెళ్ళు స్థలమేదో మాకు తెలియదు. ఇక మార్గమేట్లు ఎరుగుదుము?" అనెను. తోమస్సు యేసు ప్రభువు చెప్పిన మాటలు అర్ధం చేసుకోలేక పోయాడు. అందుకే ఆయనే వేరే ఎక్కడకు వెళుతున్నారో తెలియదు అని చెబుతున్నారు. తోమసు మొదటి నుండి తనకు అర్ధం కాని విషయములను అడుగుటకు సిగ్గుపడలేదు. ప్రభువు ముందు తనను అప్పుడు గొప్పవాడిగా లేక మొత్తం తెలిసిన వానిగా చూపించుకోవాలని చూడలేదు, తన నిజ స్తితి ఎప్పుడు బహిర్గతం చేస్తునే ఉన్నాడు. అందుకే ప్రభూ మీరు ఎక్కడకు వెళుతున్నారో మాకు తెలియదు, ఇక మార్గం ఎట్లు ఎరగుదుము అని అంటున్నారు. అందుకు ప్రభువు నేనే మార్గము సత్యము జీవము. నా మూలమునే తప్ప ఎవడును తండ్రి దగ్గరకు రాలేడు అని చెబుతున్నాడు. 

యేసు ప్రభువు మాత్రమె దేవునికి మార్గం 

దేవున్ని మనం ఎలా తెలుసుకోగలము? ఆయన దగ్గరకు మనం ఎలా వెళ్లగలము? ఆయన ఎవరు? అనే ప్రశ్నలకు యేసు ప్రభువు మాటలలో మనకు సమాధానం దొరకుతుంది. అంతేకాక ఆ సమాధానం ఆయనే అవుతున్నారు. యేసు ప్రభువే తండ్రి దగ్గరకు వెళ్ళుటకు మార్గం, మరియు ఆయన మన గమ్యంగా ఉంటారు, ఎందుకంటే ఆయనను చేరుకున్నప్పుడు తండ్రిని చేరుకున్నట్లే, ఆయన తండ్రి యందు తండ్రి ఆయన యందు ఉన్నారు. ఆయనే సత్యము, ఆయన కేవలం సత్యమును తెలియజేయుటకు మాత్రమే రాలేదు, ఆయనే సత్యం, ఆయన మాత్రమే నిత్యుడు, ఆయన మనకు జీవం ఇచ్చువాడు మాత్రమే కాదు ఆయనే జీవము. కనుకనే యేసు ప్రభువు మాత్రమే తండ్రి దేవుని దగ్గరకు మార్గం, ఆయన ద్వారా మాత్రమే మనం తండ్రిని చేరుకోగలం. 

ప్రార్ధన : ప్రభువా! మీరు మీ శిష్యులకు కలవరపడకుడు అని చెబుతున్నారు, వారికి మరలా మీ దగ్గరకు వస్తాను అని అభయమిస్తున్నారు, వారికి నివాసస్థానము తయారు చేస్తాను అని వాగ్ధానం చేస్తున్నారు. మా జీవితములవ కూడా ప్రభువా మేము అనేక విషయముల గురించి కలవరపడుతున్నాము. మా జీవితములలో వచ్చే సమస్యలతో మేము కలవరపడుతున్నాము. అప్పుడు మాకు తోడుగా ఉండండి. మాకు కూడా మీ భరోసా ఇవ్వండి. మాకు కూడా మీ రాజ్యంలో నివాసస్థానం ఏర్పాటు అనుగ్రహించండి. మాకు మార్గ చూపరిగా ఉండండి. మాకు మార్గం, సత్యం, జీవమై మమ్ము దీవించండి. ఆమెన్. 

Fr. Amruth 

యేసు క్రీస్తును చూచుటయే దేవున్ని చూచుట

  యేసు క్రీస్తును చూచుటయే  దేవున్ని  చూచుట

యోహాను 14:6-14 

అందుకు యేసు, నేనే మార్గం, సత్యము, జీవము. నా ములమున తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. మీరు నన్ను ఏరిగియున్నచో, నా తండ్రిని కూడా ఏరిగి యుందురు. ఇక నుండి మీరు ఆయనను ఎరుగుదురు. మీరు ఆయనను చూచి ఉన్నారు " అని పలికెను. అప్పుడు పిలిప్పు "ప్రభూ! మాకు తండ్రిని చూపుము. మాకు అది చాలు" అనెను. అందుకు యేసు ఇట్లనెను: "పిలిప్పు! నేను ఇంతకాలము మీతో ఉంటిని. నన్ను తెలిసికొనలేదా? నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచి ఉన్నాడు. తండ్రిని చూపమని ఎట్లు అడుగుచున్నావు! నేను తండ్రి యందు, తండ్రి నా యందు ఉన్నామని నీవు విశ్వసించుటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేను చెప్పుట లేదు. కాని, తండ్రి నా యందు నివసించుచు, తన కార్యములను నెరవేర్చు చున్నాడు. నేను తండ్రి యందు ఉన్నానని, తండ్రి నా యందు ఉన్నాడని మీరు విశ్వసింపుడు. లేనిచో ఈ క్రియలను బట్టియైన నన్ను విశ్వసింపుడు. నేను తండ్రి యొద్దకు వెల్లుచున్నాను. కనుక, నన్ను విశ్వసించువాడు నేను చేయు క్రియలను చేయును. అంతకంటేను గొప్ప క్రియాలను చేయును అని మీతో నిశ్చయముగ చెప్పుచున్నాను. తండ్రి కుమారుని యందు మహిమ పరుప బడుటకు మీరు నా పేరిట ఏమి అడిగినను చేసేదను. మీరు నా పేరిట నన్ను ఏమి అడిగినను దానిని చేసెదను. 

యేసు ప్రభువు దేవున్ని  లోకానికి ఎరుక పరిచారు 


 నేనే మార్గం, సత్యం, జీవం. నా ములమున తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు. యేసు ప్రభువు ఇక్కడ తోమసు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతున్నారు. నేనే మార్గం అని చెబుతున్నారు. తండ్రి దగ్గరకు పోవుటకు యేసు ప్రభువు మాత్రమే మార్గం. ఎందుకంటే తండ్రి గురించి పూర్తిగా తెలిసినది కుమారునికి మాత్రమే. యేసు ప్రభువు ఇతర ప్రవక్తల వలె, నాయకుల వలె, న్యాయాధిపతుల వలె కాక తండ్రి ప్రేమను, కరుణను, కృపను, తండ్రి అయిన దేవున్ని చూపించడంలో విఫలం చెందక, పూర్తిగా దానిలో సఫలీకృతం అయ్యి తండ్రిని తన మాటల ద్వారా, పనుల ద్వారా మరియు అద్భుతాల ద్వారా, కరుణ ద్వారా మరియు తాను చూపించిన ప్రేమ ద్వారా తెలియ పరిచారు. ఎవరు ఈ తండ్రి అని తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు మనం యేసు ప్రభువు జీవితం ద్వారా తెలుసుకుంటున్నాం. ఎందుకంటే ఆయన చేసిన పనులన్నీ తండ్రి ద్వారానే చేశారు, తానకై తాను చేయక, తండ్రి ఇష్టప్రకారమే అన్ని చేశాడు. అలా తండ్రిని తన ద్వారా చూపించాడు. 

యేసు ప్రభువే  తండ్రికి మార్గం 


తండ్రి దేవున్ని తెలుసుకోవడానికి మార్గం కేవలం యేసు ప్రభువు మాత్రమే. యేసు ప్రభువు దేవున్ని తెలుసుకోవడానికి మార్గం మాత్రమే కాదు, ఆయన గమ్యం కూడా. ఈ మార్గం మనలను ఎక్కడకు తీసుకుపుతున్ననది, అంటే తండ్రి దగ్గరకు. తండ్రి మరియు కుమారుడు ఎప్పుడు ఏకమై ఉన్నారు. ఆ విధంగా ఆయనే మనం మార్గం మరియు గమ్యంగా ఉన్నారు. ఆయనను అనుసరించినచో మనము ఎప్పటికీ మార్గమును తప్పక, ఆయనను అనుసరించిన ప్రతి ఒక్కరూ గమ్యం చేరుకుంటారు. 

యేసు ప్రభువు మాత్రమే సత్యం 


యేసు ప్రభువు నేనే సత్యం అని చెబుతున్నారు. ఏమిటి ఈ సత్యం? యేసు ప్రభువును సత్యమనగా ఏమిటి? అని పిలాతు అడుగుతున్నారు. యేసు ప్రభువు తనను తాను లోకమునకు వెలుగు అని చెబుతున్నారు. ఆయనలో అంధకారం అనేది ఏమి లేదు. నేనే సత్యం అని యేసు ప్రభువు చెబుతున్నప్పుడు ఆయనలో అసత్యం అనేది ఏమి లేదు. ఆయన పూర్తిగా సత్యం. ఆయన చెప్పిన ప్రతి మాట కూడా సత్యం. ప్రతిదీ కూడా జరిగితీరుతుంది. మన మాటలలో అనేక అసత్యాలు ఉంటాయి కాని యేసు ప్రభువు సత్యం. ఈ లోకంలో ఉన్న ఏ వ్యక్తి కూడా యేసు ప్రభువు వలె సత్యం కాదు, వారి వారి జీవితాలలో అనేక సార్లు అసత్యం అడినవారే. సత్యం మనలను స్వతంత్రులను చేస్తుంది. సత్యం మనకు దేవున్ని తెలియపరుస్తుంది. సత్యమును అన్వేషించే ప్రతి వారు కూడా దేవున్ని అన్వేషించే వారే. దేవుడు సత్య స్వరూపుడు. అందుకే యేసు ప్రభువు తాను సత్యమును అని చెపుతున్నారు. అసలు సత్యం అంటే ఏమిటి? తత్వశాస్త్రంలో అరిస్టాటిల్ సత్యం గురించి ఉన్నదానిని ఉన్నది అని చెప్పడం, తెలుసుకోవడం సత్యం అని చెబుతారు. పునీత అక్విన తోమసు గారు సత్యం గురించి నిత్యం ఉండునది సత్యం అని చెబుతున్నారు. కేవలం దేవుడు మాత్రమే నిత్యం ఉండేది. అందుకే యేసు ప్రభువు నేనే సత్యము అని చెబుతున్నారు. 

యేసు  ప్రభువే  జీవం 


నేనే జీవం అని యేసు ప్రభువు చెబుతున్నారు. దేవుడు జీవం, మనందరికీ జీవం ఉంది. కాని దేవుడు జీవం. మన నుండి ఈ జీవం వెళ్ళి పోతుంది. కాని దేవుడే జీవం కాబట్టి ఆయన నుండి అది వెళ్లిపోదు, అందుకే మనం ఆయనను స్వయంబు అని చెబుతున్నాము. తాను జీవించుటకు ఎవరి మీద ఆధారపడలేదు. కాని మనం మన జీవించుటకు వేరే వారి మీద ఆదరపడిఉంటాం. మనం కూడా ఈ జీవంతో ఎల్లప్పుడు ఉండాలి అనే కోరిక ఉంటుంది అది ఆయన మనకు ఇస్తాడు ఎందుకంటే ఆయన జీవం కాబట్టి. అందుకే యేసు ప్రభువు నేనే జీవం అని చెబుతున్నారు. యేసు ప్రభువు ఈ విషయం గురించి అనేక సార్లు చెప్పారు. పాత నిబంధనలో కూడా దేవుని గురించి మోషే అడుగుతున్నప్పుడు దేవుడు ఆయన ఎవరు అని చెబుతున్నారు. మోషే , దేవునితో నిన్ను ఎవరు పంపారు, ఆయన పేరు ఏమిటి అని అడిగితే నేను ఏమి చెప్పాలి అని అడుగుతున్నప్పుడు దేవుడు ఆయనకు చెబుతున్నారు. "నేను ఉన్నవాడను" అని. ఇక్కడ ఉన్నవాడు అంటే కలకాలం ఉండేవాడు అని అర్ధం. ఆయన గతించిన కాలంలో ఉన్నాడు, భవిష్యత్తు కాలంలో ఉంటాడు, మరియు వర్తమాన కాలంలో ఉన్నాడు అని అర్ధం. ఇలా ఎందుకు అంటే ఆయన జీవం కాబట్టి. ఏవరు అయితే కలకాలం ఉండాలి అంటే ఆయన దగ్గరకు వెళ్ళాలి. 

యేసు  ప్రభువుని  చూడటం తండ్రిని చూడటమే 


ఇవి అన్ని కూడా దేవుని లక్షణాలు, యేసు ప్రభువు తన జీవితం ద్వారా తండ్రిని మనకు తెలియజేస్తున్నాడు. అందుకే యేసు ప్రభువు మాత్రమే దేవుని దగ్గరకు మనలను తీసుకువెలుతారు, ఎందుకంటే యేసు ప్రభువుకు మాత్రమే తండ్రి పూర్తిగా తెలుసు. అందుకే యేసు ప్రభువు ములమునే మనం తండ్రి దగ్గరకు వెల్లగళం. తండ్రిని మనం తెలుసుకోవాలి అనుకున్న, లేక తండ్రిని చూడాలి అని అనుకున్నా మనం యేసు ప్రభువును తెలుసుకోవాలి, మరియు చూడాలి. అందుకే పిలిప్పు తండ్రిని చూపించమని అడుగుతున్నప్పుడు యేసు ప్రభువు, పిలిప్పు నీవు నన్ను చూడలేదా? అని అడుగుతున్నారు. యేసు ప్రభువు మాటలు మొత్తం తండ్రి మాటలు, యేసు ప్రభువు పనులు మొత్తం తండ్రి పనులు. ఇక్కడ యేసు ప్రభువు ఇంకొక మాట చెబుతున్నారు. అది ఏమిటి అంటే నేను తండ్రి యందు మరియు తండ్రి నా యందు ఉన్నాము అని చెబుతున్నారు. యేసు ప్రభువు అనేక సార్లు తండ్రితో తన ఐక్యత గురించి చెప్పారు. యేసు ప్రభువు తన శిష్యులను ఆయన చేసిన పనులను బట్టి అయిన తనని విశ్వసించమని చెబుతున్నారు. ఆయనను విశ్వసించిన వారి ద్వారా మరియు తన శిష్యుల ద్వారా ఆయన అనేక మంచి పనులను చేస్తారు. ఆయన శిష్యులు ఆయనను ఏమి అడిగిన అది దయచేస్తాను అని వాగ్ధానం చేస్తున్నారు. 

ప్రార్దన : ప్రభువా మీరు చెప్పిన విధముగా మీరే మార్గం సత్యము జీవం, మీ ద్వారా మాత్రమే మేము తండ్రిని తెలుసుకోగలుగుచున్నాము. మీ ములమున మాత్రమే మేము తండ్రి దగ్గరకు చేరుతాము అని విశ్వసిస్తున్నాము. మీరు మాకు మార్గం మాత్రమే కాదు మా గమ్యం అని కూడా తెలుసుకుంటున్నాము. మేము ఎల్లప్పుడు మిమ్ములను వదలకుండా ఎల్లప్పుడు మిమ్ములను అనుసరిస్తూ జీవించే వారీగా మమ్ములను దీవించండి. ప్రభువా మాకు మిమ్ములను పూర్తిగా తెలుసుకొని మీరు అనుగ్రహించే అన్ని అనుగ్రహాలు పొందే భాగ్యం మాకు దయచేయమని వెదుకొనుచున్నాము. మీరు తండ్రి యందు ఉన్నారు అని, తండ్రి మీ యందు ఉన్నారు అని విశ్వసిస్తున్నాము , కొన్ని సార్లు మాకు ఉన్న సమస్యల వల్ల లేక మా అజ్ఞానం వలన మిమ్ములను పూర్తిగా తెలుసుకోలేక పోయిన సందర్భాలలో మమ్ములను క్షమించమని అడుగుచున్నాము. మీ మీద విశ్వాసం వలన మేము మా జీవితాలను కావలసిన వాటిని అనుగ్రహించమని వెదుకునుచున్నాము. ఆమెన్. 
Fr. Amruth 

లూకా 5: 33-39

  లూకా 5: 33-39 "యోహాను శిష్యులు తరచుగా ఉపవాసములు, ప్రార్ధనలు చేసెదరు. అటులనే పరిసయ్యుల శిష్యులను చేయుదురు. కాని, మీ శిష్యులు మాత్రము త...