2, ఆగస్టు 2024, శుక్రవారం

యిర్మీయా 26:11-16,24 మత్తయి 14:1-12

యిర్మీయా 26:11-16,24 మత్తయి 14:1-12 (3 ఆగస్టు 2024)

ఆ కాలమున గలిలీయ ప్రాంత పాలకుడగు హేరోదు యేసు ప్రఖ్యాతిని విని, "ఇతడు స్నాపకుడగు యోహానే. అతడే మృతులనుండి లేచియున్నాడు. కావున, అద్భుత శక్తులు ఇతని యందు కనిపించుచున్నవి" అని తన కోలువుకాండ్రతో చెప్పెను. హేరోదు తన సోదరుడగు ఫిలిప్పు భార్యయైన హేరోదియ కారణముగా యోహానును బంధించి చెరలో వేయించెను. ఏలయన, "ఆమెను నీవు ఉంచుకొనుట ధర్మము కాదు" అని యోహాను హేరోదును హెచ్చరించుచుండెను. యోహానును చంపుటకు హేరోదు నిశ్చయించెను. కాని అతడు ప్రవక్తయని ప్రఖ్యాతిగాంచుటచే ప్రజలకు భయపడెను. హేరోదు జన్మదినోత్సవమున హేరోదియ కుమార్తె సభలో నాట్యమాడి అతనిని మెప్పింపగా ఆమె ఏమి కోరినను దానిని ఆమెకు ఒసగెదను అని అతడు ప్రమాణ పూర్వకముగా వాగ్దానము చేసెను. అపుడు ఆమె తల్లి ప్రోత్సాహమువలన "స్నాపకుడగు యోహాను శిరస్సును ఒక పళ్ళెరములో ఇప్పుడు ఇప్పింపుము" అని అడిగెను. అందుకు ఆ రాజు దుఃఖించెను. కాని, తన ప్రమాణముల కారణముగ, అతిధుల కారణముగ ఆమె కోరిక తీర్చ ఆజ్ఞాపించి సేవకులను పంపి చెరసాలలోనున్న యోహానును శిరచ్చేదనము గావించెను. వారు అతని తలను పళ్ళెములో తెచ్చి ఆ బాలికకు ఇవ్వగా ఆమె దానిని తన తల్లికి అందించెను. అంతట యోహాను శిష్యులు వచ్చి అతని భౌతికదేహమును తీసుకొనిపోయి భూస్థాపనము చేసిరి. పిమ్మట వారు యేసు వద్దకు వెళ్లి ఆ విషయమును తెలియజేసిరి. 

ప్రియమైన దైవ ప్రజలారా! ఈనాడు మొదటి పఠనంలో మనము యిర్మీయా ప్రవక్తను చూసి, ఆయన చెప్పిన దైవ సందేశాన్ని విని భయంతో, కోపంతో, అసూయతో, గర్వంతో యిర్మీయా ప్రవక్తను చంపివేయాలని యాజకులు ప్రవక్తలు, నాయకులను ప్రజలను రెచ్చగొట్టడం చూస్తున్నాము. ఎందుకంటే యిర్మీయా ప్రవక్త చాలా కఠినమైన సందేశాన్ని వారికి వినిపించారు. ఆ సందేశం ఏమిటంటే వారు వారి మార్గములను, క్రియలను మార్చుకొని దేవునికి విధేయులు కాకపోతే నాశనము చేయబడుదురు. వారి దేవాలయం నాశనము చేయబడుతుంది. పదే  పదే ఆయన ప్రజలను హెచ్చరిస్తున్నాడు. యిర్మీయా ప్రవక్త వారిని, మీరు మీ మార్గాలను, మీ పాపపు పనులను మీ గర్వాన్ని వదలిపెట్టి మారు మనసు పొంది దేవునికి విధేయతతో జీవిస్తే మిమ్మి అయన రక్షిస్తాడు, మీ శిక్షను తొలగిస్తాడు అని బోధిస్తున్నాడు. ఈ సంగతులెల్ల మీకు తెలియజేయుటకు ప్రభువు నన్ను పంపాడు అని చెబుతున్నాడు. ఇది విని నాయకులు, ప్రజలు తమ యొక్క నాయకులు ప్రవక్తలతో యిర్మీయాకు మరణ శిక్ష  విధించుట తగదు. ఎందుకు అనగా అతడు మన దేవుడైన ప్రభువు పేరు మీదుగా మాట్లాడేను అంటున్నారు. 

సువిశేష పఠనంలో మనము స్నాపకుడగు యోహాను గారి శిరచ్చేదనము గురించి వింటున్నాం. యోహాను గారు దైవ సందేశాన్ని భయపడకుండా ధైర్యంతో భోదించినందుకు తన ప్రాణమును కోల్పోయాడు. హేరోదురాజు యేసు ప్రభువుని పేరు ప్రఖ్యాతులను విని ఖచ్చితముగా యోహానే మృతలనుండి లేచి, ఇన్ని అద్భుతశక్తులు కలిగిఉన్నాడు అని తన సేవకులతో చెబుతున్నాడు. యోహాను గారు రాజైన హేరోదుతో నీ సోదరుడగు ఫిలిప్పు భార్యను నీవు ఉంచుకొనుట ధర్మముకాదు అని అధర్మాన్ని ఖండించి, హెచ్చరించాడు. అందువలన హేరోదు యోహానును చంపుటకు నిర్ణయం తీసుకున్నాడు, కాని  భయ పడ్డాడు ఎందుకంటే యోహాను నిజమైన దేవుని ప్రవక్త అని హేరోదు అర్ధం చేసుకున్నాడు. యోహానును చరసాలలో బంధించారు. హేరోదియ కూడా యోహాను పట్ల కోపం, ఈర్ష్య ద్వేషంతో యోహానును చంపాలని చూసింది. ఆమె కూతరు హేరోదు రాజును నాట్యంద్వారా మెప్పించి,సంతోష పెట్టినందుకు నీము ఏమి కావాలో కోరుకో అని ప్రమాణం చెయ్యగా తన తల్లి మాట మీదగా స్నాపకుడగు యోహాను తనను ఒక పళ్లెంలో ఇవ్వమని అడిగింది. 

హేరోదు తన ప్రమాణము కారణంగా, అతిధుల ముందు మాటను ఇచ్చి ఉండటంవలన ఆమె కోర్కెను తీర్చాడు. దేవుని సత్య సువార్తను ధైర్యంగా బోధించి సత్యంకోసం  తన రక్తాన్ని కార్చిన స్నాపకుడగు యోహాను వారి వలె, మనము అధర్మాన్ని ఎదిరించి తప్పును తప్పు అని చెప్పగలమా! ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం భయంతో ఉంటె సత్యానికి, సత్య సువార్తకు సాక్షులుగా ఉండలేం. కనుక యిర్మీయా ప్రవక్త వలె స్నాపకుడగు యోహాను వలె మనము కూడా దేవుని వాక్కుని విని, పాటించి ధైర్యంగా ఏ భయం , ఆందోళన లేకుండా నిజమైన సత్య సువార్తను బోధించుదాం. సత్యానికి సాక్షులుగా నిలబడదాం. సత్యం ధర్మం కొరకు మన ప్రాణాలను త్యాగం చేయడానికి కూడా వెనుకడుగు వేయకుండా ఉందాం. దేవుడు తన   సత్య సువార్తను మన హృదయాలలో నింపి మనలను నడిపించులాగున  ప్రార్ధించుదాం. 

ప్రార్ధన: సత్య స్వరూపుడైన తండ్రి, మమ్ము మీ సత్య వాక్కుతో నింపుము.మేము అన్ని వేళలలో సత్యానికి సాక్షులుగా జీవిస్తూ సత్య సువార్త బోధిస్తూ, ప్రజలను మీ సత్యపు వెలుగు లోనికి నడిపించడానికి మాకు శక్తిని, బలమును, ధైర్యమును దయచేయుము. తద్వారా ఎన్నో ఆత్మలను రక్షించుటలో మా వంతు బాధ్యతను నెరవేర్చుటకు మీ అనుగ్రహం  దయ చేయండి. ఆమెన్ 

ఫా. సురేష్ కొలకలూరి OCD

యిర్మీయా 26:1-9 మత్తయి 13: 54-58

యిర్మీయా 26:1-9  మత్తయి 13: 54-58    2 ఆగస్టు 2024

యేసు తన పట్టణమును చేరెను. అచట ప్రార్ధనామందిరములో ఉపదేశించుచుండగా, ప్రజలు ఆశ్చర్యచకితులై, "ఇతనికి ఈ జ్ఞానము, ఈ అద్భుత శక్తి ఎచటినుండి  లభించినవి?" అని అనుకొనిరి. "ఇతడు వడ్రంగి కుమారుడు కాడా? ఇతని తల్లి మరియమ్మ కాదా? యాకోబు  , యోసేపు, సీమోను, యూదాలు ఇతని సోదరులుకారా? ఇతని సోదరీమణులు అందరు మన మధ్యనలేరా? అటులయిన ఇవి అన్నియు యితడు ఎట్లు పొందెను?" అని ఆయనను తృణీకరించిరి. అప్పుడు యేసు వారితో  "ప్రవక్త  స్వదేశమందును, స్వగృహమందును తప్ప మరెందును సన్మానింపబడకపోడు" అని పలికెను. ఆ ప్రజల అవిశ్వాసమువలన ఆయన అచట ఎక్కువగా అద్భుతములను చేయలేదు. 

ఈనాడు ప్రభువు తన వాక్కును యిర్మీయా ప్రవక్తకు, నన్ను ఆరాధించుటకు వచ్చిన ప్రజలకు నేను ఆజ్ఞాపించిన సంగతులెల్ల వినిపింపుము. వాటిలో ఒక్క మాటకూడా వదలిపెట్టవలదు అని  వినిపించాడు.  ప్రియా మిత్రులారా దేవుడు ప్రవక్తలను ఎన్నుకొని , తన వాక్కును వినిపించి, తనను ఆరాధించే ప్రజలకు తన సందేశాన్ని ఒక్క మాటకూడా వదలి  పెట్టకుండా చెప్పడానికి మన మధ్యకుపంపిస్తున్నాడు. ఎందుకు దేవుడు తన ప్రవక్తలను పంపిస్తున్నాడు అంటే, దేవుని వాక్కును సందేశాన్ని విని పాపులమైన మనము  మన దుష్ట మార్గము నుండి మంచి మార్గములోనికి రావాలని, మన బ్రతుకులు మార్చుకొవాలని, మనము  మనం పాపలు నుండి చేదు వ్యసనాల నుండి మారకపోతే  దేవుని ప్రేమకు దగ్గరగా రాకపోతే మనం నాశనమునకు గురిచేయబడుతాం. మారుమనస్సు పొందితే రక్షణ లేకపోతే నాశనము. మరి మనము మన మనస్సును మార్చుకోవాలంటే ఏమి చేయాలి.

యిర్మీయా 26:4 వ వచనంలో దేవుడు "మీరు నేనిచ్చిన ధర్మ శాస్త్రమును పాటించి నాకు విధేయులు కావాలి"  అని చెబుతున్నాడు. మరి మనము దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నామా? ఆజ్ఞలు అన్ని దైవ ప్రేమ, సోదర ప్రేమపై ఆధారపడియున్నవి. మరి మనము దేవుని మరియు మన తోటి వారిని ప్రేమించగలుగుతున్నామా? అదేవిధంగా దేవునికి నిజంగా విధేయులమై ఉంటున్నామా? మనం ఎవరికీ విధేయత చూపిస్తున్నాం? దేవుని వాక్కులుకు విధేయత చుపిస్తున్నామా? ఒకవేళ దేవుని వాక్కు కు విధేయత చూపించకపోతే మనము మన నాశనమును  కోని తెచ్చుకుంటాము. దేవుడు యిస్రాయేలు ప్రజలతో , మీరు నా సేవకులగు ప్రవక్తల  పలుకులు వినలేదని అంటున్నాడు.  మరి ఈనాడు మనం దేవుని సేవకులగు ప్రవక్తలు,   గురువులు పెద్దల మాటలను వింటున్నామా  లేదా ఆలోచించండి. ఒక ప్రవక్తగా, దైవ సేవకునిగా, దేవుని వాక్కును భయపడకుండా, భాధలకు దూరంగా వెళ్లకుండా  ధైర్యంగా ప్రకటించాలి. యిర్మీయా ప్రవక్త వలె ఉండాలి.   ఆయన దేవుని వాక్కును, సందేశాన్ని ప్రకటించినప్పుడు ప్రజలు ఆయనను నింధించారు. ఆయనపై అరిచారు. కాని  ఆయన దేవుని వాక్కును, సువార్త పరి చర్యను ఆపివేయలేదు. 

ఈనాటి సువిశేషంలో తన పట్టణ ప్రజలే క్రీస్తు ప్రభువునుతృణీకరించారని వింటున్నాం. ఆయనను చిన్న చూపు చూచి, ఆయన బోధనలు విని ఆశ్చర్యపోయి, క్రీస్తు ప్రభువునికి ఇంతటి  జ్ఞానం ఎట్లు వచ్చినదని,  ఆయనను ఔన్నత్యాన్ని ఒప్పుకోలేక,  ఆయన బోధనలను తృణీకరించారు. క్రీస్తు ప్రభువు, తన శిష్యులమైన  మనకు  తెలియజేసేది ఏమిటంటే మనవారే కొన్ని  సార్లు మనలను తృణీకరిస్తారు , మన మాటలను అంగీకరించరు, మన మాటలపై అవిశ్వాసం వ్యక్తపరుస్తారు, భయపడకండి, నా సందేశాన్ని అందరికి తెలియజేయండి. కొన్నిసార్లు అగౌరవంగా మాట్లాడుతారు. కాని  మీరు సువార్త ప్రకటనను కొనసాగించండి అని తెలియజేస్తున్నాడు. 

ప్రార్థన : 
ప్రేమమయుడైన  దేవా! నీవు మమ్ము రక్షించువాడవు. మేము నీ వాక్కును విని, ఆరాధిస్తూ, నీ ఆజ్ఞలను పాటించి జీవించే భాగ్యం  నాకు దయజేయండి. తద్వారా మేము మా దృష్టమార్గములను విడిచిపెట్టి, నీ ప్రేమా ,  సువార్తను  ప్రకటించే భాగ్యం మాకు దయచేయండి. మమ్ము ఎవరు తృణీకరించిన బాధపడకుండ,  నీ సత్య మార్గములో నడిచే శక్తిని ఇవ్వండి.   ఆమెన్ 

ఫా. సురేష్ కొలకలూరి OCD

31, జులై 2024, బుధవారం

మత్తయి 13: 47-53

 మత్తయి 13: 47-53 (1.ఆగస్టు 2024)

"ఇంకను పరలోకరాజ్యము సముద్రములో వేయబడి, అన్ని విధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది. వల నిండినపుడు దానిని ఒడ్డునకు లాగి అచట కూర్చుండి మంచి చేపలను బుట్టలలో వేసి, పనికి రాని వానిని పారవేయుదురు. అటులనే అంత్యకాలమందును జరుగును; దూతలు బయలుదేరి దుష్టులను నీతిమంతులనుండి వేరుపరచి అగ్ని గుండములో పడద్రోయుదురు. అచట వారు ఏడ్చుచు, పండ్లు కోరుకుకొందురు." వీనినన్నింటిని మీరు గ్రహించితిరా?" అని యేసు అడిగెను. "అవును" అని వారు సమాధానమిచ్చిరి. అయన "పరలోక రాజ్యమునకు శిక్షణ  పొందిన ప్రతి ధర్మశాస్త్ర బోధకుడు తన కోశాగారము నుండి నూతన, పురాతనవస్తువులను వెలికి తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడు" అనెను. 

ఈరోజు దేవుని వాక్యం మొదటి పఠనమును  మనము చూస్తే,  దేవుడు యిర్మీయా ప్రవక్తను ఓక  కుమ్మరి వాని ఇంటికి తన యొక్క సందేశాన్ని వినిపించమని పంపిస్తున్నాడు,  అయితే ఆ ప్రవక్త  వెళ్లి ఆ కుమ్మని సారెమీద పని చెయ్యడం చూసాడు. దేవుడు ఎన్నో  సార్లు తన ప్రవక్తలను, శిష్యులను కూడా మన  దగ్గరకు పంపిస్తునాడు. మన  గ్రామాలకు, కుటుంబాలకు, సంఘాలకు పంపించుచున్నాడు. ఎందుకు అనగా మనయొక్క జీవిత విధానాలను చూచి, మన  వ్యాధి బాధలను చూచి మనలకు సువార్తను అంటే, దేవుని సందేశాన్ని అందించమని తన ప్రవక్తలను పంపుచున్నాడు. 

ఆనాడు యిర్మీయా ప్రవక్త కుమ్మరివాని  ఇంటి దగ్గర కుమ్మరి చేసే పనిని చూచి ఉన్నాడు. మనము ఈనాడు ఏ పనులు చేస్తున్నాము. దానిని బట్టి దేవుడు తన సందెశాన్ని మనకు అందిస్తాడు. కుమ్మరి,  సరిగా తయారుకాని కుండను ఏ విధంగానైతే వేరొక పాత్రగా చేసాడో అదే విధంగా  దేవుడు కూడా మన జీవిత విధానం బట్టి, మన జీవితాన్ని రూపుదిద్దుతాడు. పాడైపోయిన కుండా మరల ఏ విధంగా అందమైన పాత్రగా మార్చుబడుతుందో, దేవుడు పాడైపోయినా మన జీవితాలను కూడా అందమైన పాత్రగా మార్చగలడు. మన జీవితం ఏ విధంగా ఉన్న, మన బలహీనతలు ఏమైనా  దేవుడు వాటిని తొలగించి  మనలను   మరల సుందరంగా అందంగా మార్చుతాడు, మార్చగలడు.  ఓ! యిస్రాయేలు ప్రజలారా మీరు ఎలాంటి వారంటే కుమ్మరి చేతిలో మట్టివలె మీరును నా చేతిలో ఇమిడిపోయేదరు అంటున్నారు.  కాబట్టి మనము అర్ధం చేసుకోవలసినది మనము దేవుని చేతిలో మట్టి వంటి వారము, మన  జివితాలు దేవుని చేతిలో ఉంచితే మన జీవితాలను, కుటుంబాలను సంఘాలను దేవుడు ఎంతో అందంగా మార్చివేస్తారు. 

మన జీవితాలు ఎవరి చేతులో ఉన్నాయి? మనము ఏ విధంగా ఉన్నాము? ఆలోచించాలి. ప్రస్తుత కాలంలో మనము మన జీవితాలను వేరే వారి చేతులలో పెడుతున్నాము. మన జీవితాలను నాశనము చేసుకుంటున్నాము. పదే పదే పాపములో పడిపోయి, పాపపు పనులు చేస్తున్నాము. కాబట్టి దేవుడు మనతో ఈ కుమ్మరి మట్టిని ఎట్లు మలచెనో నేనును మిమ్మునట్లు మలవకూడదా? అంటున్నాడు. మరి మన సమాధానం ఏమిటి ఈ ప్రశ్నకు ? ఆత్మ పరిశీలన చేసుకుందాం.  మనము దేవునికి మనలను మార్చడానికి అవకాశం ఇస్తున్నామా? పునీత అగస్టిను వారు నీ అనుమతి లేకుండా నిన్ను సృష్టించిన దేవుడు నీ అనుమతి లేకుండా నిన్ను రక్షించాడు అని అంటున్నాడు. మరి మనము దేవుని చిత్తమునకు అనుమతిస్తున్నామా? 

సువిశేష పఠనంలో పరలోక రాజ్యం సముద్రంలో వేయబడి అన్నివిధములైన చేపలను పట్టు వలను పోలియున్నది అని క్రీస్తు ప్రభువు బోధిస్తున్నారు. అపుడు మంచి చేపలను బుట్టలో వేసి పనికిరాని వాటిని పారవేయుదురు. మనం ఇక్కడ గమనించవలసినది ఏమిటి అంటే  దూతలు అంత్యకాలంలో మంచి చేపలు అంటే మంచి పనులు చేస్తూ, పరిశుద్ధంగా జీవించేవారు, బుట్ట అంటే పరలోకరాజ్యము. పనికిరాని చేపలు అంటే దుష్టులు చెడు పనులు చేయువారు. వీరు నరకంలో పారవేయబడి శిక్ష అనుభవిస్తారు. కాబట్టి పరలోకంలో చేరాలి అంటే మనము మన పాప క్రియలను విడిచి పశ్చాతాపంతో ప్రభువును ఆశ్రయించాలి, ప్రార్ధించాలి. అపుడు దేవుని రాజ్యంలో చేర్చబడుతాం. 

ప్రార్ధన: ప్రభువైన దేవా మేము మమ్ము తగ్గించుకొని ప్రతినిత్యం మా జీవితం విధానాలను మార్చుకుంటూ మీ  సందేశాన్ని, ప్రణాలికను అర్ధంచేసుకుంటూ మా జీవితాలను అందంగా, పరిశుద్ధంగా మార్చుకొని మంచి వారిగా ఉంటూ మంచి పనులను చేస్తూ పరలోక రాజ్యం పొందేబాగ్యం మాకు దయ చేయండి. ఆమెన్

ఫా. సురేష్ కొలకలూరి  

27, జులై 2024, శనివారం

17వ సామాన్య ఆదివారం


2 రాజుల 4: 42-44, ఎఫేసి 4:1-6, యోహాను 6:1-15
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుడు మానవుల యొక్క ఆకలిని సంతృప్తి పరచు విధానం గురించి తెలుపుచున్నవి. ఆకలితో అలమటిస్తున్నటువంటి వారి యెడల దేవుడు తన యొక్క కనికర హృదయమును ప్రదర్శిస్తూ వారి యొక్క శారీరిక ఆకలిని సంతృప్తి పరుస్తున్నారు. 
ఈనాటి మొదటి పఠణములో ఎలీషా ప్రవక్త దేవుని అనుగ్రహము ద్వారా చేసినటువంటి ఒక గొప్ప అద్భుతమును చదువుకుంటున్నాం. ఎలీషా ప్రవక్త క్రీస్తుపూర్వం తొమ్మిదవ శతాబ్దంలో దేవుని సందేశమును ప్రకటించారు.  ఆయన ప్రవచించే సందర్భంలో కరువు సంభవించినది. ఒకరోజు బాల్షాలిషా నుండి ఒక భక్తుడు ఏలీషా ప్రవక్తకు కానుకగా 20 రొట్టెలను, ధాన్యాన్ని సమర్పించారు. ఎలీషా ప్రవక్త ఈ యొక్క రొట్టెలను తన చెంతకు వచ్చిన ప్రవక్తలకు పంచి పెట్టమని చెప్పారు కానీ వారి సంఖ్య అధికముగా ఉండుటవలన ఇవి సరిపడమని భావించి సేవకుడు 100 మందికి ఇవి ఏ పాటివి అని ప్రశ్నించారు. వాస్తవానికి ఎలీషా ప్రవక్త దేవునియందు నమ్మకం ఉంచి అవి సరిపోతాయి అని శిష్యుడికి తెలుపుచున్నారు. ఎలీషా ప్రవక్త తనకు ఇవ్వబడినది, ఇతరులకు పంచి ఇచ్చి ఉన్నారు కాబట్టి దేవుడు ఆయన యొక్క మంచితనము మరియు విశ్వాసమును బట్టి అద్భుతం చేశారు. 
ఈ యొక్క మొదటి పఠణము ద్వారా మనము గ్రహించవలసిన కొన్ని అంశములు ఏమిటంటే 
1. ఎలీషా ప్రవక్త యొక్క ఉదారత. ఏమియు ఆశించకుండా ఇతరులకు మేలు చేయాలని కోరుకున్నాడు.
2. ఎలీషా ప్రవక్త యొక్క విశ్వాసం. శూన్యము నుండి సృష్టిని చేసిన దేవుడు 20 రొట్టెలను 100 మందికి సమకూరుస్తారు అని ఎలీషా విశ్వసించారు. ఎడారిలో మన్నాను ఇచ్చిన దేవుడు అవి మిగులు లాగిన చేశారు అలాగే ఈ రొట్టెలు కూడా ఇంకా మిగులుతాయి అని చెప్పారు.
3. ఆకలిని సంతృప్తి పరచాలి అనే కోరిక ఎలీషా ప్రవక్తకు ఉన్నది. ఇతరుల యొక్క ఆకలి గుర్తించి వారికి ఆహారము ఇచ్చారు.
4. సేవకుని యొక్క విధేయత. యజమానుడి యొక్క మాటను నమ్మి ఆయనకు సంపూర్ణంగా విధేయత చూపారు.
ఈనాటి రెండవ పట్టణంలో పునీత పౌలు గారు మనందరినీ కూడా దేవుడు, మన కొరకు ఏర్పరిచినటువంటి అంతస్తుకు తగిన విధంగా జీవించమని తెలుపుచున్నారు దానిలో భాగంగా మనము సాధువులు గను, సాత్వికులుగను, సహనశీలురులుగా ఉంటూ ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ప్రేమను పంచుకోవాలి అని పౌలు గారు కోరారు.
ఈనాటి సువిశేష భాగములో ఏసుప్రభు 5000 మందికి(స్త్రీలను, చిన్న బిడ్డలను లెక్కించకుండా) ఆహారమును ఒసగిన విధానము చదువుకుంటున్నాము. ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో వారు సంతృప్తిగా పోషింపబడతారు అని కూడా ప్రభువు తెలుపుతున్నారు అయితే ఈ యొక్క సువిశేష భాగములో ఏసుప్రభు అద్భుతం చేయుటకు కారణము ఒక బాలుడు తన వద్ద ఉన్నటువంటి ఐదు రొట్టెలను రెండు చేపలను ఇతరుల కొరకై సమర్పించిన విధానం.  ఈ యొక్క సువిశేష భాగములో మనము గ్రహించవలసిన కొన్ని అంశములు; 
1. ఏసుప్రభు యొక్క కనికర హృదయం. ఆయన తన ప్రజల మీద జాలి కలిగి ఉన్నారు కాబట్టి వారి యొక్క ఆకలిని సంతృప్తి పరచాలని భావించారు.
2. బాలుని యొక్క త్యాగ గుణం. తన దగ్గర ఉన్నది కొంచెమైనప్పటికీ కూడా, అదియు తన కొరకు తెచ్చుకున్నటువంటి ఆహారమైనప్పటికీ ఆయన  త్యాగం చేసి ఇతరుల కొరకు శిష్యులకిస్తున్నారు. 
3. బాలుడు యొక్క ఉదార స్వభావం. ఈ యొక్క బాలుడు సంతోషముగా ఇతరుల యొక్క శ్రేయస్సు కొరకై తన వంతు, తన దగ్గర ఉన్నటువంటి భాగమును సమర్పిస్తున్నారు. 
ఒకరోజు కలకత్తాపురి మదర్ తెరెసా గారు తన జీవిత సంఘటన తెలుపుచున్నారు అది ఏమనగా; మదర్ థెరీసా గారు ఒక పేద కుటుంబమును సందర్శించి వారికి ఒక బియ్యం బస్తాను ఇచ్చారు. వారు దాదాపుగా ఒక వారం రోజుల పాటు భోజనం చేయడం లేదని గ్రహించి వారి యొక్క దీనస్థితిని గుర్తించి మదర్ తెరెసా వారికి సహాయం చేశారు. ఆ సహాయము పొందినటువంటి కుటుంబము ఆ బస్తా బియ్యంలో సగం బియ్యమును తీసుకొని వేరే వారికి ఇంకొక సగం బస్తా బియ్యమును ఇచ్చారు. ఎందుకు నువ్వు ఈ విధంగా చేసావు అని  అడిగినప్పుడు ఆ యొక్క తల్లి చెప్పిన మాట, మేము కేవలం వారం రోజుల నుండి పస్తులు ఉంటున్నాం కానీ మా కన్నా ఎక్కువగా మా యొక్క పొరుగువారు పస్తులు ఉంటున్నారు అదేవిధంగా వారి కుటుంబంలో కూడా పిల్లలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్లకి కూడా ఆహారం దొరుకుతుంది అనే ఉద్దేశంతో మాకు ఉన్న సగం ఇచ్చాను అని తెలుపుచున్నది. ఈ యొక్క సంఘటన ద్వారా మదర్ తెరెసా గారు ఉన్నదాంట్లో ఇతరులకు దానం చేస్తే దానిలో నిజమైన సంతోషం ఉందని  గ్రహించింది. ఈ యొక్క బాలుడు కూడా తన దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు రెండు చేపలను ఇతరుల యొక్క సంతోషం కొరకై ఉదారంగా ఇచ్చారు. 
4. ఐదు రొట్టెలు రెండు చేపలు తిరు సభలో ఉన్న ఏడు దివ్య సంస్కారాలకి ప్రతిరూపం. ఈ ఐదు రొట్టెలు రెండు చేపలు ఆనాటి ప్రజల యొక్క ఆకలిని సంతృప్తి పరచిన విధముగా ఈ యొక్క ఏడు దివ్య సంస్కారాలు ప్రతి ఒక్కరిని కూడా సంతృప్తి పరుస్తుంది. వాటిని స్వీకరించటానికి మనము సిద్ధముగా ఉండాలి.
ఈ యొక్క పరిశుద్ధ గ్రంధం పట్టణముల ద్వారా మనం కూడా మన జీవితంలో ఇతరులను యొక్క ఆకలి బాధను చూసి వారికి ఆహారమును ఇవ్వాలి. ఎంత ఇచ్చాము అన్నది ప్రభువు చూడరు కానీ వారికి మంచి చేశామా అన్నది ప్రభువు చూస్తారు కాబట్టి మన అందరిలో కూడా త్యాగం చేసేటటువంటి గుణం, కనికరం కలిగిన హృదయం, ఉదారంగా ఇచ్చే మనసు ఎప్పుడూ ఉండాలి అప్పుడే మనం కూడా ఇంకా అధికముగా దీవించబడతాం. మనం చేసే మనిషి వలన ఇతరులు సంతోషము ను పొందుతారు కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి వరములను ఇతరులతో పంచుకుంటూ సోదర ప్రేమ కలిగి జీవించటానికి ప్రయత్నించుదాం. 
Fr. Bala Yesu OCD

20, జులై 2024, శనివారం

16వ సామాన్య ఆదివారం


యిర్మియా 23:1-6, ఎఫేసి 2:1-6, మార్కు 6:30-34

ఈనాటి పరిశుద్ధ గ్రంథము పఠణములు దేవుడు మంచి కాపరిగా ఉంటూ తన ప్రజలకు అన్నియు సమకూర్చి వారిని కాపాడుతుంటారు అని అంశమును తెలుపుచున్నవి. దేవునికి ప్రజలకు ఉన్నటువంటి బంధము ఏ విధంగా ఉన్నదంటే కాపరికి మందకు ఉన్నటువంటి బంధం ఇవి రెండూ కూడా ఎప్పుడు కలసి ఉంటాయి. 
ఈనాటి మొదటి పఠణంలో యిర్మియా ప్రవక్త యొక్క మాటలను చదువుకుంటున్నాము. యిర్మియా ప్రవక్త క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలో యూదా రాజధాని అయినటువంటి యెరుషలేములో పరిచర్యను చేశారు. ఆయన అనేక మంది రాజులను, ప్రజలను, నాయకులను దేవునికి విశ్వాస పాత్రులుగా జీవించమని తెలిపారు. దేవుని యొక్క దృష్టిలో ఏది  ఉత్తమం దానిని ప్రకటించారు. యిర్మియ సత్యమును ప్రకటించుటవలన అనేక బాధలను అనుభవించవలసి వచ్చింది. యిర్మియా ప్రవక్త సెద్కియా కాలంలో ప్రవచించారు. ఆయన ఒక బలహీనమైన రాజు, నిలకడత్వం లేని వ్యక్తి. ప్రవక్త యొక్క సందేశాన్ని ఆలకిస్తాడు కానీ దానిని ఆచరణలో ఉంచడు. అప్పుడు యూదా రాజ్యం బాబిలోనియా చక్రవర్తికి లోబడుతుంది. యిర్మియా ప్రవక్త రాజును బాబిలోని రాజుకు లోబడి జీవించమని తెలిపినప్పుడు దానిని ఆచరించలేదు దానికి బదులుగా రాజభవనంలో ఉన్న కొంతమంది సలహాదారులు ఐగుప్తు సహాయం రాజు సహాయం కోరమని తెలియజేశారు కానీ యుద్ధం చేసిన తర్వాత యూదా ప్రజలు ఓడిపోయారు దానికి గాను బాబిలోనికి బానిసత్వానికి వెళ్లారు. 
నాయకులు ప్రజల పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ఉండేవారు కాబట్టి ప్రభువే స్వయముగా తన గొర్రెలను ప్రోగు చేసి వారి కొరకు కాపరులను నియమిస్తాను అని తెలుపుచున్నారు. దేవుడే స్వయముగా ఒక కాపరిగా ఉంటూ తన ప్రజలకు అన్నియు సమకూర్చుతారు అనేటటువంటి అంశమును కూడా తెలుపుచున్నారు (కీర్తన 23). ఆయన యొక్క శ్రద్ధ వలన తన మంద పోషించబడుతుంది, అభివృద్ధి చెందుతుంది. తన మందను ఎన్నడూ విడిచి పెట్టినటువంటి కాపరులను కూడా నియమిస్తానని తెలుపుచున్నారు. యావే ప్రభువు తనకు ఉన్నటువంటి ప్రేమ వలన ప్రజల కొరకు మంచి కాపరులను నియమిస్తానని తెలుపుచున్నాను.
దేవుడు ఎవరికి అయితే తమమందనం చూసుకొనమని బాధ్యతను అప్పగించి ఉన్నారో వారు సరిగా వ్యవహరించకపోతే దేవుడు వారిని శాపగ్రస్తులుగా చేస్తుంటారు అని పలికారు. దేవుడు నమ్మి బాధ్యతను అప్పగించారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దానిని సక్రమంగా నెరవేర్చాలి. తండ్రికి కుటుంబ బాధ్యతను అప్పగించారు, గురువుకు విచారణ బాధ్యతను అప్పగించారు, ఉపాధ్యాయునికి పిల్లల బాధ్యతను అప్పగించారు, వైద్యులకు రోగుల బాధ్యతను అప్పగించారు, రాజకీయ నాయకులకు దేశ ప్రజల బాధ్యతను అప్పగించారు ఈ విధముగా చాలా విధములైనటువంటి బాధ్యతలు దేవుడు ఇచ్చి ఉన్నారు కాబట్టి వానిని మనము సక్రమముగా ప్రజల యొక్క, ఇతరుల యొక్క శ్రేయస్సు కొరకై వినియోగించాలి. 
అందరి కొరకై దేవుడు దావీదు వంశము నుండి మంచి కాపరి అయినటువంటి ఏసుప్రభువును, మనలను పరిపాలించు నిమిత్తము పంపిస్తారు అని కూడా యిర్మియా ప్రవక్త ద్వారా తెలుపుచున్నారు. 
ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు దేవుడు ఉత్తమ కాపరిగా ఉంటూ యూదులను అన్యులను ఐక్యము చేశారు అని తెలిపారు. ఏసుప్రభు యూదులను మరియు అన్యులను సఖ్యపరచి వారిని ఒకటిగా చేశారు. ఏసుప్రభు నందు విశ్వాసము ఉంచినటువంటి వారందరూ కూడా ఎటువంటి వ్యత్యాసం లేకుండా ఒకే ప్రజగా జీవిస్తారు అని తెలిపారు  (గలతి 3:28-29). క్రైస్తవులుగా మారిన యూదులు ఏసుప్రభువును మెస్సయ్యగా గుర్తించి అంగీకరించారు, అదే విధముగా అప్పటివరకు అన్య దైవములను పూజించిన అన్యులు కూడా యేసు ప్రభువును రక్షకునిగా గుర్తించి విశ్వసించి ఆయనను వెంబడించారు.
ఈనాటి సువిశేష భాగంలో ఏసుప్రభు యొక్క శిష్యులు పరిచర్యను ముగించుకొని తిరిగి వచ్చినటువంటి సంఘటనను చూస్తున్నాం. శిష్యులు యేసు ప్రభువు యొక్క నామమున అనేక రకములైన అద్భుతములు చేసి దయ్యములను వెళ్లగొట్టి రోగులను స్వస్థపరచి తిరిగి వచ్చారు వారి యొక్క స్థితిని చూసినటువంటి ప్రభువు వారికి కొద్దిపాటి విశ్రాంతి కావాలి అని భావించారు. అందుకే ఒక నిర్జన ప్రదేశమునకు వెళ్లి విశ్రాంతి తీసుకోవాలని భావించారు కానీ అదే సందర్భంలో ప్రజలు అనేకమంది ప్రభువు కొరకు ఎదురుచూస్తూ ఉన్నారు. 
ఇక్కడ గమనించవలసిన కొన్ని అంశములు ఏమిటంటే 
1. ఏసుప్రభువుకు తన శిష్యులు మీద ఉన్నటువంటి గొప్ప ప్రేమ.  ( వారి యొక్క శారీరక బలహీనతను అర్థం చేసుకున్నారు)
2. ప్రతి ఒక్కరి జీవితంలో కొద్ది సమయం విశ్రాంతి (A time of introspection) తీసుకోవాలి ఎందుకంటే ఆ విశ్రాంతి సమయంలో మనం ఎలాగ జీవించాము అని ఆత్మ పరిశీలన చేసుకొనుట కొరకై.
3. ప్రభువు తన యొక్క ప్రజల యొక్క అవసరతను గుర్తించి వారికి బోధించారు. 
4. దేవుని యొక్క వాక్కు కొరకై ప్రజలకు ఉన్నటువంటి గొప్ప తపన. 
5. దేవుని కొరకై తపించేవారు ఎప్పుడు దేవుని విషయంలో ముందే ఉంటారు. ప్రజలు ఏసుప్రభువు చూడటానికి వారి కంటే ముందుగా కాలినడక మీదనే వచ్చారు.
6. ఏసుప్రభు యొక్క సహనము మనము అర్థం చేసుకోవాలి అలసిపోయినప్పటికీ ప్రజల యొక్క పరిస్థితిని చూసినప్పుడు వారికి ఇవ్వవలసిన సమయం దేవుడు వారికి ఇస్తున్నారు. 
7. ప్రభువు కాపరి వలె తన మందమీద కనికరమును చూపించారు మనం కూడా అదే విధంగా జీవించాలి.
ఈ యొక్క పరిశుద్ధ పఠణముల ద్వారా దేవుడు మనందరిని కూడా కాపరులుగా ఉంచుతూ మనకు ఇచ్చినటువంటి బాధ్యతలను సక్రమముగా నెరవేర్చమని తెలుపుచున్నారు. 
యిర్మియా తన బాధ్యతను నెరవేర్చిన విధంగా, పౌలు తన బాధ్యతను నెరవేర్చిన విధంగా మరియు శిష్యులు తమకు ఇచ్చిన పనిని సక్రమంగా చేసిన విధంగా మనకి కూడా దేవుడు ఇచ్చిన ప్రతి బాధ్యతను కాపరి వలె మంచి చేస్తూ మంద కొరకు జీవించే వ్యక్తులుగా ఉండాలి. 
Fr. Bala Yesu OCD

13, జులై 2024, శనివారం

15వ సామాన్య ఆదివారం


ఆమోసు 7:12-15, ఎఫేసి 1:3-14, మార్కు 6:7-13
ఈనాటి పరిశుద్ధ గ్రంధం పఠణములు, దేవుని పిలుపు- మానవ స్పందన గురించి తెలుపుచున్నాయి. ప్రతి పఠణం కూడా దైవ పిలుపును విశ్వాసముతో స్వీకరించి ప్రభువు యొక్క సేవ చేయాలి అనే అంశమును తెలియజేస్తున్నాయి.
మొదటి పఠణంలో యావే దేవుడు ఆమోసు ప్రవక్తను  ఉత్తర ఇస్రాయేలు ప్రజలు చెంతకు పంపించిన విధానము చదువుకుంటున్నాము.  
యావే ప్రభువు క్షీణించే ప్రజల మధ్యకు ప్రవక్తను  పంపారు. ఆమోసు ప్రవక్త సామాజిక న్యాయం కొరకు పోరాడిన వ్యక్తి. గొర్రెల మందను కాసుకునేటటువంటి వ్యక్తిని దేవుడే స్వయముగా పరిచర్యకు పిలిచారు అని తెలిపారు. ఆమోస్ ప్రవక్త తాను భుక్తి కోసం పనిచేయటం లేదు కేవలము దేవుని యొక్క ప్రణాళిక ప్రకారమే నిస్వార్థముగా పనిచేస్తున్నాను అని తెలిపారు. క్రీస్తుపూర్వం ఎనిమిదివ శతాబ్దంలో పాలస్తీనా దేశం లో ఉత్తర రాజ్యంలో జేరోబవాము రాజు ఇశ్రాయేలు ప్రజలను పాలిస్తున్నారు. ఈ రాజు యొక్క పరిపాలన కాలంలో మత విలువలు అడుగంటిపోయాయి, అవినీతి పెరిగింది, ధనికులు అన్యాయంగా పేదవారిని దోచుకొనుట సాధారణమైంది. ఒక ప్రక్కన ధనికులు సుఖసంతోషాలతో జీవిస్తుంటే, పేదవారు మాత్రము ఆకలి బాధతో అలమటించేవారు. రాజు సైతం దేవుడిని మరచి అన్య దైవములను కొలవటం ప్రారంభించారు ఇట్టి సందర్భంలో ప్రభువు ఆమోస్ను ప్రజల యొక్క శ్రేయస్సు కొరకై, వారి జీవిత విధాన మార్పు కొరకై పంపిస్తున్నారు. ప్రవక్త ప్రజల యొక్క తప్పిదములను వారి అవినీతిని పండించారు, విగ్రహారాధనను రూపుమాపారు. యావే దేవుని యొక్క మాట విననట్లయితే బానిసత్వం లోనికి వెళ్ళవలసి ఉన్నది అని ప్రవక్త గట్టిగా ఉపదేశించారు, వాస్తవానికి అది జరిగినది కూడా. బేతేలు క్షేత్రం వద్ద పలికిన ఈ మాటలు అ అచ్చటి అర్చకుడైన అమాస్య ప్రవక్తకు నచ్చలేదు అందుకే ఆమోసుతో, నీవు నీ ప్రాంతమునకు వెళ్లి ప్రవచనములు పలుకుతూ భోజనమును సంపాదించుకోమని హేళనగా మాట్లాడారు, ఇకమీదట బేతేలులో ప్రవచించవద్దు అని కూడా హెచ్చరించారు కానీ ఆమోస్ మాత్రము ధైర్యముగా దేవుడు తనకు అప్పచెప్పిన బాధ్యతను నెరవేర్చారు.
ఆ రోజుల్లో కొందరు ప్రవక్తలు కేవలం పొట్టకూటిపై ప్రవక్తలగా చలామణి అయ్యేవారు రాజు యొక్క మెప్పు కొరకు పని చేసేవారు. రాజు ఏది చెబితే అదే దైవ చిత్తము గా బోధించారు రాజును మెప్పించుట కొరకు చెడును కూడా మంచిగానే బోధించేవారు ఇలాంటి ఒక పరిస్థితుల్లోనే దేవుడు అమోస్ ప్రవక్తను ఎన్నుకొని సత్యమును బోధించుటకు పంపించారు. 
ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు దేవుని యొక్క పిలుపుని గురించి తెలుపుచూ ఆయన మనలను సృష్టికి పూర్వమే పవిత్రులుగా ఉండుటకు నిర్దోషులుగా ఉండుటకు ఎన్నుకున్నారు అని తెలిపారు. దేవుడు తన కుమారుని ద్వారా మనకు ఉచితముగా అనుగ్రహాలను వసగి ఉన్నారు. క్రీస్తు రక్తము వలన మనము విముక్తులము కావించబడ్డాము, మన పాపాలు క్షమించబడ్డాయి. 
ఈనాటి సువిశేష భాగములు యేసు ప్రభువు తన యొక్క అపోస్తులను సువార్త సేవకై పంపించిన విధానము చదువుకుంటున్నాము. ఆమోసు ప్రవక్తను ఇశ్రాయేలు ప్రజల‌ వద్దకు పంపిన విధంగా, పౌలు గారిని అన్యుల వద్దకు పంపిన విధంగా, ఏసుప్రభు తన శిష్యులను కూడా దైవ సందేశ నిమిత్తమై వివిధ ప్రాంతాలకు ఇద్దరు చొప్పున పంపిస్తున్నారు. ఈ యొక్క సువిశేషంలో ధ్యానించవలసిన ప్రధానమైన అంశములు; 
1. అందరూ రక్షింపబడాలి అన్నది ప్రభువు యొక్క ఉద్దేశం. 
2. దేవుని యొక్క సందేశము ప్రతి ఒక్కరికి ప్రకటింపబడాలి అందుకే ప్రభు తన శిష్యులను పంపిస్తున్నారు.
3. శిష్యులు ప్రజలలో ఉన్నటువంటి వ్యాధి బాధలను, దయ్యములను పారద్రోలి వారికి మేలు చేయాలి. 
4. అపోస్తులను ప్రతినిత్యము ఏసుప్రభు మీదే ఆధారపడి జీవించాలి. 
5. దేవుని పనిలో కొన్నిసార్లు తిరస్కరణలు ఎదురైనా వాటిని ఎదుర్కొని ముందుకు సాగాలి. 
6. అపోస్తులు హృదయ పరివర్తనను ప్రకటించి అనేక మందికి స్వస్థత చేకూర్చారు.
7. దేవుడు ఎల్లప్పుడూ తాను ఎన్నుకున్న వారికి తోడుగానే ఉంటారు అనే విషయం మనం ప్రభువు వెల్లడిస్తున్నారు ఎందుకనగా ప్రజల జీవితంలో అద్భుతాలు జరగటానికి దేవుడు వారికి తోడుగా ఉన్నారు అనేటటువంటి ఒక కారణం. 
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు ఏ విధముగానయితే దేవుని యొక్క సందేశము కొరకై పిలవబడిన వారి గురించి మరియు వారి యొక్క సేవ జీవితం గురించి తెలియచేయబడినదో మనము కూడా దేవుని చేత జ్ఞాన స్నానం ద్వారా ఎన్నుకొనబడినటువంటివారం కాబట్టి మనం దేవుని యొక్క ప్రేమను పంచాలి ఆయన సేవ చేయాలి. 
Fr. Bala Yesu OCD.

6, జులై 2024, శనివారం

14 వ సామాన్య ఆదివారం

14 వ సామాన్య ఆదివారం 
యెహెజ్కేలు 2:2-5, 2 కొరింతి 12:7-10, మార్కు 6:1-6
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుని యొక్క పిలుపు గురించి అదే విధముగా ఆ పిలుపులో ఎదురయ్యేటటువంటి తిరస్కరణ గురించి తెలియజేస్తున్నాయి. ప్రతి ఒక్కరి జీవితంలో తిరస్కరణ ఏదో ఒక సందర్భంలో వస్తూనే ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో మనము ధైర్యం కోల్పోకుండా ముందుకు దైవశక్తితో సాగాలి. 
ఈనాటి మొదటి పఠణంలో దేవుడు యెహెజ్కేలు ప్రవక్తను పిలిచిన విధానము  చదువుకుంటున్నాము. దేవుడు ఇశ్రాయేలు ప్రజల చెంతకు ఒక ప్రవక్తను పంపిస్తున్నారు, ప్రజలు తన మీద తిరుగుబాటు చేసినప్పటికీ,తనకు అవిధేయత చూపించినప్పటికీ ఆయన మాత్రము వారి శ్రేయస్సు కొరకై ప్రవక్తలను పంపుచున్నారు ఇది దేవుని యొక్క గొప్పతనం. మనం గ్రహించవలసిన సత్యం ఏమిటంటే ఇతరులు మనకు హాని చేసినప్పటికీ మనము మాత్రము వారికి మేలు చేయుటకే ప్రతినిత్యము ప్రయత్నం చేయాలి ఎందుకనగా దేవుడు సైతము తనకు విరుద్ధముగా నడుచుకున్న వారిని శిక్షింపక వారిని రక్షించుట నిమిత్తమై వారి కొరకు ప్రవక్తలను పంపుచునే ఉన్నారు. రక్షణ చరిత్రలో అనేక సందర్భాలలో ప్రవక్తలను ప్రజలు తిరస్కరిస్తూనే ఉన్నారు. ప్రవక్తలను తిరస్కరించారు అంటే దేవుడిని తిరస్కరించినట్లే ఎందుకనగా ఏసుప్రభువు కూడా సువిశేషములో ఎవరైతే మిమ్ములను ఆహ్వానిస్తారో వారు మమ్మును కూడా ఆహ్వానిస్తారు అని తెలుపుచున్నారు, ఎవరైతే తిరస్కరిస్తారో వారు దేవుడిని కూడా తిరస్కరిస్తారని అర్థం. మత్తయి 10:40. ప్రజలు ఏ విధంగా ఉన్నా సరే దేవుడు మాత్రమే ప్రవక్తను పంపించనున్నారు. వారికి తెలుపుచున్న సత్యము ఏమిటంటే కనీసం వారి మధ్య ఒక ప్రవక్త ఉన్నారు అని గ్రహిస్తారు అనేటటువంటి ఉద్దేశంతోనే దేవుడు ఇశ్రాయేలు ప్రజలు నడుమున యెహెజ్కేలు ప్రవక్తను పంపిస్తున్నారు.
యెహెజ్కేలు ప్రవక్త, ప్రజల తప్పిదములను వేలెత్తి చూపారు, వాటిని ఖండించారు అలాంటి సందర్భాలలో ప్రజలు తనను ఎదిరించారు తన యొక్క సందేశాన్ని పెడచెవిని పెట్టారు ఎన్నో కష్టాలకు గురి చేశారు అయినప్పటికీ భయపడలేదు, పారిపోలేదు ఎందుకంటే దేవుడు వారికి ముందుగానే భయపడకూడదు అని ధైర్యమని ఇచ్చారు. (యెహె 2:6-7). ప్రజలు ఏలియా, హోషయ, యెషయా, యిర్మియ, యెహెజ్కేలు మరియు మిగతా ప్రవక్తలను తిరస్కరించినప్పటికీ వారు ప్రభువు సందేశమును తెలియజేశారు. 
ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు దేవుని యొక్క కృప గురించి మాట్లాడుచున్నారు ఆయన కష్టములలో, బాధలో ఉన్న సందర్భంలో దేవునికి ప్రార్థింపగా ప్రభువు అతనికి ఇచ్చిన అభయం నా కృప నీకు చాలును. దేవుడు తనకు అన్ని సమయంలో శక్తిని ఒసగుతారు అని అభయమునిస్తున్నారు కాబట్టి పౌలు గారు కూడా క్రీస్తు ప్రభువు కొరకు ఎన్ని అవమానాలైన హింసలైన భరించటానికి సిద్ధంగా ఉన్నాను అని తెలుపుతున్నారు దానికి కారణం దేవుని కృప ఆయనకు ఎప్పుడు ఉంటుంది.
ఈనాటి సువిశేష పఠణములో ఏసుప్రభు నజరేతు వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొన్నటువంటి నిరాదరణ గురించి మార్కు సువార్తికుడు తెలుపుతున్నారు. ప్రభువు మొదటిగా ప్రార్థన మందిరంలో బోధించిన సందర్భంలో అందరు కూడా ఆయన యొక్క జ్ఞానము చూసి ఆశ్చర్యపడుచున్నారు మరలా అదే ప్రజలు ఆయన యొక్క గతం గురించి, కుటుంబ చరిత్ర గురించి మాట్లాడుతున్నారు. చాలా సందర్భాలలో మనం కూడా చూసే అంశం ఇది ఒక వ్యక్తి మంచిగా ప్రసంగం చెబుతున్నారంటే వెంటనే వారు ఆయన యొక్క గతం గురించి ఆలోచిస్తూ ఉంటారు, తరువాతనే ఆ వాక్యమును పాటించటానికి ప్రయత్నం చేస్తారు ఇక్కడ ఏసుప్రభు యొక్క జీవితంలో కూడా తన యొక్క సొంత ప్రజలే తనను అర్థం చేసుకోలేదు అందుకే ఏసుప్రభు ఏ ప్రవక్త కూడా తన స్వదేశంలో ఆదరింపబడురు అని తెలుపుచున్నారు వారి యొక్క అవిశ్వాసమును బట్టి అక్కడ కేవలము కొన్ని అద్భుతాలు మాత్రమే ప్రభువు చేశారు. మనము గమనించవలసిన అంశం ఏమిటంటే మన జీవితంలో మనము అంగీకరించబడినా, అంగీకరించక పడకపోయినా ముందుకు వెళ్లాలి మనకు అప్ప చెప్పినటువంటి పనిని నెరవేర్చాలి. ఏసుప్రభును తన ప్రజలే తనను నిరాకరించినప్పుడు కృంగిపోలేదు, పరిచర్య మానుకోలేదు ఆయన ధైర్యంతో ముందుకు సాగి తండ్రి చిత్తమును నెరవేర్చారు అదే విధముగా మనము కూడా తిరస్కరించబడినపుడు దైవ శక్తితో ముందుకు సాగి దేవుని చిత్తమును నెరవేర్చాలి. 

Fr. Bala Yesu OCD

29, జూన్ 2024, శనివారం

13వ సామాన్య ఆదివారం

13వ సామాన్య ఆదివారం 
సొలోమోను జ్ఞాన 1: 13-15, 2: 23-24, 2 కొరింతి 8:7, 9,13-15
మార్కు 5:21-43
ఈనాటి పరిశుద్ధ గ్రంధ పఠణములు దేవునికి ఈ సృష్టి మీద మరియు మానవుల మీద ఉన్నటువంటి ప్రేమను గురించి తెలుపుచున్నవి.  ఆయన సృష్టిని చేసినప్పుడు కంటికి అంతా బాగుగా ఉండెను.
ఈనాటి మొదటి పఠణంలో దేవుడు ఏ విధముగా సృష్టిని చేసి ఆ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దానిని కూడా కాపాడుతున్నారని తెలుపుతుంది. దేవుడు మరణమును సృష్టించలేదు ఆయన సృష్టిని చేసిన సందర్భంలో ఏదీ కూడా తన కంటికి చెడుగా కనిపించలేదు అంతా కూడా బాగానే ఉన్నది. ఆయన ప్రణాళిక ప్రకారము సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా జీవించటానికి, అభివృద్ధి చెందడానికి మరియు మంచిగా ఉండటానికి సృష్టించారు కానీ సైతానే అసూయవలన మానవుడిని ప్రేరేపించి పాపంలోనికి నెట్టివేసి మరణంనకు గురిచేసినది. దేవుడు ఎవరిని నాశనం చేయాలని కోరుకోలేదు కేవలం మానవుడు చేసిన తప్పిదం వలన తనంతట తాను మరణమును కొని తెచ్చుకున్నాడు. ఎవరి నాశనం వలన దేవుడు సంతోషించరు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా హృదయ పరివర్తనం చెందాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం.(యెహెజ్కేలు 18:23)
ఒకవేళ దేవుడే మనము నాశనం అవ్వాలి అని కోరుకున్నట్లయితే మన పాపాలకు ఆయన మనల్ని ఎప్పుడూ శిక్షించి ఉండవు కానీ అలా చేయలేదు. 
ఆయన ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు తన యొక్క ప్రవక్తలను పంపి ఉండేవారు కాదు అలాగే తప్పిపోయినటువంటి గొర్రె కొరకు వెదకేటువంటి వారు కాదు మనము మంచిగా జీవించుట నిమిత్తమై దేవుడు మన కొరకు ప్రతినిత్యం కూడా కృషి చేస్తున్నారు.
ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు మనందరం కూడా ఉదార స్వభావులై  ఒకరికి ఒకరు సహయం చేసుకుని జీవించాలని తెలుపుతున్నారు ఏసుప్రభువు ఏ విధముగానయితే ఈ లోకంలో తనకు ఉన్నటువంటి మొత్తం కూడా విడిచిపెట్టి మన మధ్యకు ఒక సామాన్యమైన వ్యక్తిగా వచ్చి తన అనుగ్రహాలను అందరికీ కూడా పంచి ఇచ్చి ఉన్నారో అదేవిధంగా ధనవంతులైనటువంటి వారు, ఉన్నవారు ఇతరులకు సహాయం చేసి జీవించేటటువంటి   సుగుణం కలిగి ఉండాలి అని పౌలు గారు తెలుపుచున్నారు. ఈనాటి సువిశేష పఠణంలో యేసు ప్రభువు యాయిరు కుమార్తెను బ్రతికించిన విధానము మరియు 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీకి స్వస్థత ఇచ్చిన విధానము చదువుకుంటున్నాం. ఈ రెండు సంఘటనలలో ఒకరి వయసు 12 సంవత్సరాలు మరియు 12 సంవత్సరాల అనారోగ్యం . ఇక్కడ వీరిద్దరి యొక్క  అచంచలమైనటువంటి విశ్వాసమును చూస్తూ ఉన్నాం. వారి జీవితంలో వారి ప్రయత్నం చేసిన తర్వాత నిరాశలో ఉన్న సందర్భంలో దేవుని వైపు తిరుగుతూ కేవలం దేవుని శక్తి మీదే ఆధారపడుతూ యేసు ప్రభువుని ఆశ్రయించారు అందుకే ప్రభువు వారిద్దరి జీవితంలో మేలు చేశారు.
మోషే ధర్మ శాస్త్ర ప్రకారము రక్తస్రావంతో బాధపడే స్త్రీ అశుద్ధురాలుగా పరిగణింపబడుతుంది ఆమె దేవాలయమునకు వెళ్ళుటకు అనర్హురాలు అదేవిధంగా ఇతరులతో కలిసి ఉండటకు అనర్హురాలు. (లేవి 15:25-27) ఆమె తన దగ్గర ఉన్నది మొత్తం కూడా ఖర్చు చేసింది ఏ వైద్యుడు కూడా తనకు స్వస్థత నివ్వలేదు తన యొక్క ప్రయత్నం తాను చేసిన తర్వాత చివరిసారిగా బహుశా యేసు ప్రభువు యొక్క మంచితనమును, స్వస్థతను తెలుసుకొని ఆయన యందు విశ్వాసం ఉంచి కనీసం ఆయన యొక్క వస్త్రంను తాకినా స్వస్థత పొందవచ్చు అని భావించినది. ఏసుప్రభు ప్రయాణం చేసే సందర్భంలో చాలా మంది ఆయనను తాకారు కానీ వారెవరు స్వస్థత పొందినట్లు ప్రభువు పలకలేదు కేవలం ఈమెను గురించి మాత్రమే ఏసు ప్రభువు తెలిపారు ఎందుకంటే ఆమె నిజమైనటువంటి విశ్వాసం కలిగి యేసు ప్రభువుని ఆశ్రయించి, ఆయన వస్త్రములు కూడా స్వస్థత ఉందని గట్టిగా నమ్మినది కాబట్టే తన విశ్వాసము ప్రకారంగా యేసుప్రభు అద్భుతం చేశారు.
యాయీరు కూడా ఒక అధికారి  అయినప్పటికీ ఆయన తన యొక్క కుమార్తె అనారోగ్యంతో బాధపడే సమయంలో తనకి మనవి చేయగా ఏసుప్రభువు  అతని విశ్వాసం చూసి  ఆ బిడ్డను స్వస్థతపరచ వచ్చి, ఆమెకు స్వస్థతనిచ్చారు. బాలిక మరణించినప్పటికీ కూడా ప్రభువు ఆమె కు నూతన జీవాన్ని ప్రసాదించారు. దేవుడు ఆమెకు జీవాన్ని ప్రసాదించి నా కుటుంబంలో సంతోషాన్ని ఇచ్చారు అలాగే రక్తస్రావంతో బాధపడేటటువంటి ఆమెకు ప్రభువు ఆనందాన్నిచ్చారు.
ధ్యానించవలసిన అంశాలు 
1. దేవుడు ఎవరు నాశనం అవ్వాలి అని కోరుకోరు కాబట్టి మనము కూడా నాశనం ణము కోరుకోకూడదు.
2. ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉండాలి. 
3. దేవుని యందు పటిష్ట విశ్వాసం కలిగి ఉండాలి.
4. దేవుని మీద ఆధారపడి జీవించాలి. 
5. మనకు దేవుడు తోడుగా ఉంటారు అని నమ్మకం కలిగి జీవించాలి.
Fr. Bala Yesu OCD

22, జూన్ 2024, శనివారం

12వ సామాన్య ఆదివారం

12వ సామాన్య ఆదివారం 
యోబు 38:1, 8-11, 2 కొరింతి 5:14-17,  మార్కు 4:35-41
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుడు మానవుల జీవితంను ఏ విధముగా ప్రశాంత పరుస్తారు అనే అంశమును తెలుపుచున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, సమస్యలు, అనారోగ్యాలు ఉంటూనే ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏ విధముగా తన ప్రజలకు తోడుగా ఉండి వారిని బలపరుస్తారు అనే అంశము ఈనాటి పఠణాలలో క్షుణ్ణంగా అర్థమవుచున్నది.
ఈనాటి మొదటి పఠణంలో యావే దేవుడు యోబుకు ఇచ్చిన సమాధానము గురించి తెలపబడినది. యోబు జీవితము మొదటిలో బాగానే ఉన్నది. ఆయన పిల్లాపాపలతో, సిరిసంపదలతో, మంచి పేరుతో సంతోషంగా జీవించాడు కానీ సైతాను తన యొక్క జీవితమును శోధించినప్పుడు యోబు అన్నీ కోల్పోయాడు. ఆయన సంపదలు పోయాయి, తన యొక్క ఇష్టమైన కుటుంబము  దూరమైపోయింది, స్నేహితులు దూరమయ్యారు, తనకు అనారోగ్యం సోకింది ఈ విధముగా అన్ని కోల్పోయిన సందర్భంలో తన జీవితంలో ఒక ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలనుకున్నాడు "నా యొక్క దీనస్థితికి కారణం ఏమిటి అన్నది" యోబు దేవుడిని తన యొక్క పరిస్థితికి కారణం ఏమిటి అని పదేపదే అడగగా దేవుడు అతనికి సమాధానమిచ్చారు. యోబుతో యావే దేవుడు సమాధానమిచ్చే సందర్భంలో తన స్థితికి కారణం ఏమిటి అని చెప్పలేదు కానీ దేవుడు ఆయనయే సమస్తమును సృష్టించిన సృష్టికర్త అని, సమస్తము ఆయన ఆధీనంలో ఉన్నది అని తెలిపారు. దేవునికి ప్రతి ఒక్కరి గురించి ఒక ప్రణాళిక ఉన్నది కాబట్టి యోబు యొక్క విశ్వాసము స్థిరమైనది అని ఈ లోకమునకు నిరూపించుట కొరకై ఆయన జీవితంలో కష్టాలను దేవుడు అనుమతించారు. అయినప్పటికీ ఆయన కష్టాలు ముగిసిన సందర్భంలో యోబును దేవుడు ఇంకా అధికముగా ఆశీర్వదించి తనను ప్రశాంత పరిచారు. (యోబు 42:10). వాస్తవానికి యోబు యొక్క గ్రంథం బహుశా యూదులు  బానిసత్వంలో ఉండినప్పుడు వ్రాసి ఉండవచ్చు. ఈ గ్రంథంలో మరీ ముఖ్యంగా రచయిత మానవుని యొక్క బాధలకు కారణం ఏమిటి అనేటటువంటి అంశము తెలపాలనుకున్నారు కానీ దానికి తగిన సమాధానము ఇవ్వలేదు. యోబు గ్రంథం తెలిపే ఇంకొక అంశము ఏమిటి అంటే ఈ లోకంలో మంచివారు కష్టాలు అనుభవించవచ్చు, దుర్మార్గులు సంతోషిస్తూ జీవించ ఉండవచ్చు కానీ చివరికి దేవుడు కష్టాలు అనుభవించే మంచి వారిని ఆశీర్వదిస్తారు దుర్మార్గులను శిక్షిస్తారు. యోబు యొక్క జీవితంలో మనము గ్రహించవలసిన అంశము ఏమిటి అంటే మన అందరి జీవితాలలో కష్టాలు, బాధలు అనేవి ఎదురవుతూనే ఉంటాయి అలాంటి సందర్భంలో దేవుని శక్తి మీదే ఆధారపడుతూ విశ్వాసము కోల్పోకుండా ఆయనను నమ్ముకొని ముందుకు సాగాలి. యోబు వలె విశ్వాసములో పటిష్టంగా ఉండాలి.
ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు ఎవరైతే క్రీస్తు నందు ఉంటారో వారు నూతన సృష్టి అని తెలిపారు. క్రీస్తు నందు ఉన్నవారు పాత జీవితమును ముగించి కొత్త జీవితమును ప్రారంభిస్తారు అనగా వారి కష్టాలు తొలగించబడి సంతోషకరమైన జీవితము జీవిస్తారు అని అర్థం. క్రీస్తు నందు జీవించటం చాలా కష్టం కానీ అలా జీవించిన వారికి దేవుడు సమస్తమును సమకూర్చును. పౌలు గారు క్రీస్తునందు జీవించుట కొరకు అనేక కష్టాలు అనుభవించారు కాబట్టి ఆయన నూతన సృష్టిగా చేయబడ్డారు కాబట్టి మనం కూడా క్రీస్తునందు జీవించటానికి ప్రయత్నం చేయాలి. 
ఈనాటి సువిషేశ పఠణంలో దేవుడు శిష్యుల యొక్క జీవితమును ప్రశాంత పరిచిన విధానము ధ్యానిస్తున్నాము. ఈ సువిశేషం ద్వారా మనం కొన్ని విషయాలు  ధ్యానించాలి. 
1. మన జీవితంలో (Sudden incidents )హఠాత్తుగా జరిగే అంశాలకు ఎవరు కూడా గ్యారెంటీ ఇవ్వలేరు. 
శిష్యులు తమ యొక్క ప్రయాణం ప్రారంభించినప్పుడు అంత ప్రశాంతంగానే సాగింది కానీ ఒక్కసారిగా అలలు ప్రారంభమై సముద్రంలో పడవ మునిగేలాగా పరిస్థితి ఏర్పడింది. మన జీవితంలో కూడా కొన్ని కొన్ని సందర్భాలలో హార్ట్ ఎటాక్, యాక్సిడెంట్స్, పక్షవాతం అనేవి హఠాత్తుగా వస్తూ ఉంటాయి. అలాంటివారికి ఎవరు గ్యారెంటీ ఇవ్వలేరు కాబట్టి మనము పరిస్థితులను అర్థం చేసుకొని ముందుకు సాగాలి. 2020లో కరోనా వైరస్ సడన్గా అన్ని దేశాల్లో వ్యాపించి అనేకమంది జీవితాలను నాశనం చేసింది. శిష్యుల ప్రయాణం కూడా అప్పటివరకు బాగానే సాగింది కానీ ఒక్కసారిగా అంతా అతలాకుతలమైంది. 
2. మన కష్ట సమయాలలో దేవుడు మనతో ఉన్నారా అని మనకు అనిపిస్తుంది. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్య ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నట్లయితే ఎందుకు కష్టాలు ఎదురవుతాయి అని చాలామంది భావిస్తూ ఉంటాం. శిష్యుల యొక్క జీవితంలో కూడా దేవుడు వారికి తోడుగా ఉన్నా వారి యొక్క పడవ మునగటం ప్రారంభించింది అంటే దేవుడు మనకు తోడుగానే ఉన్నప్పటికీ మన జీవితంలో ఆయన కష్టాలను అనుమతిస్తారు అది మరలా మనలను రక్షించుట కొరకే. మన విశ్వాసం బలపరచుట కొరకు.
3. మన యొక్క కష్ట సందర్భాలలో మనము విశ్వాసముతో దేవుని వైపు మరలాలి. శిష్యులు వారి యొక్క పడవ మునిగిపోవుచుండగా ఏసుప్రభు చెంతకు వెళ్లి వారి యొక్క మనవిని తెలిపారు. వాస్తవానికి సువిషేశంలో ఏసుప్రభు నిద్రిస్తున్నారు అని రాయబడి ఉన్నది వాళ్లందరూ భయంతో ఉంటే యేసు ప్రభువు మాత్రం హాయిగా నిద్రిస్తున్నారు అంటే శిష్యులు తన చెంతకు వస్తారా?, రారా?, అని ప్రభువు ఎదురు చూస్తున్నారు. మనం కష్టాలు ఎదుర్కొనేటప్పుడు దేవుని వైపు రావాలి అని మరచిపోకూడదు. చాలామంది కష్టాలు వచ్చినప్పుడు దేవుడికి దూరంగా ఉంటారు. దేవుడు మాకు ఏమీ చేయటం లేదులే ఇంక దేవాలయానికి ఎందుకు వెళ్లాలి అనే ఆలోచనతో జీవిస్తుంటారు.
4. దేవుడు మన కష్టాలను చూసి మనల్ని ఆదుకుంటారు. శిష్యుల యొక్క పరిస్థితి చూసిన ప్రభువు వారిని ఆదుకున్నారు. వారికి తోడుగా నిలబడ్డారు వారి జీవితంలో సంతోషాన్నిచ్చారు.
5. మన కష్టాలు కొలది కాలం మాత్రమే. శిష్యుల యొక్క బాధ, భయం కొద్ది కాలం మాత్రమే ఉన్నది అది శాశ్వతంగా లేదు. పునీత అవిలాపురి తెరేసమ్మ గారు "Pain is never permanent' అని అంటారు అంటే ఏ బాధ కూడా శాశ్వతం కాదు అది కొద్ది కాలం మాత్రమే ఉంటుంది దాని తర్వాత సంతోషం ఉంటుంది. 
6. దేవుడు మన జీవితాలను ప్రశాంత పరుస్తారు. శిష్యులు ఎదుర్కొన్న భయాన్ని దేవుడు ప్రశాంత పరిచారు ఆయన సమస్తమును సృష్టించినటువంటి ప్రభువు కాబట్టి సమస్తము ఆయన అధీనంలో ఉన్నది కావున ఆయన అలలను ప్రశాంత పరిచారు అదే విధముగా శిష్యుల యొక్క భయాన్ని భాదని తొలగించి సంతోషాన్నిచ్చారు. 
దేవుడు మనతో ఉన్నట్లయితే మనకు కష్టాలు ఉన్న బాధలు ఉన్న అన్నిటిని కూడా మనం ఎదుర్కొని ముందుకు సాగగలం కాబట్టి దేవుని చెంతకు వస్తూ ఆయన మీద ఆధారపడుతూ మనము జీవించాలి ఆయనే మన జీవితాలను ప్రశాంతపరచి మన కష్టాలను తొలగించి మనలో సంతోషాన్ని నింపుతారు. 
Fr. Bala Yesu OCD

15, జూన్ 2024, శనివారం

11వ సామాన్య ఆదివారం

11వ సామాన్య ఆదివారం 
యెహెజ్కేలు17:22-24, 1 కొరింతి 5:6-10, మార్కు 4:26-34
ఈనాటి పరిశుద్ధ గ్రంధ పఠణములు దేవుని యొక్క రాజ్య విస్తరణ గురించి బోధిస్తున్నాయి. 
ఈనాటి మొదటి పఠణంలో యెహెజ్కేలు ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలు బాబిలోనియా బానిసత్వంలో ఉన్నటువంటి సమయములో వారి జీవితంలో ఒక నమ్మకమును కలుగ చేస్తున్నారు. దేవుడు ఎత్తైన దేవదారు మీద ఒక కొమ్మను విరిచి దానిని పర్వతం మీద నాటుతారు అని అన్నారు. ఆ యొక్క చెట్టు పెద్దదిగా ఎదిగి గొప్ప దేవదారు వృక్షం అగును అని తెలుపుచున్నారు. ఇది ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితమును ఉద్దేశించి ప్రభువు పలికినటువంటి మాటలు.
ఇశ్రాయేలు ప్రజలు తాము చేసినటువంటి పాపమునకు ఫలితముగా బానిసత్వ జీవితమును జీవింపవలసి వచ్చినది. అన్యదైవములను పూజించినందుకు వారు దేవుని చేత శిక్షింపబడ్డారు. వారి యొక్క బాధలో ఉన్న సమయంలో దేవుడు వారిని మరలా స్వీకరించటానికి సిద్ధపడ్డారు అందుకుగాను ప్రభువు పలుకుచున్నారు నేనే స్వయముగా కొమ్మను నాటుదను అది ఎదుగును అని తెలుపుచున్నారు అనగా యావే ప్రభువు త్వరలో ఇశ్రాయేలు ప్రజలను తమ దేశానికి తీసుకుని వచ్చి మరల వారికి స్వేచ్ఛ జీవితాన్ని ప్రసాదిస్తారని ఒక అర్థం ఇంకొక అర్థం ఏమిటంటే రాబోయే కాలంలో ఇజ్రాయేలు ప్రజల నుండి మెస్సయ్య జన్మించి ఆయన సువార్త పరిచర్య ద్వారా అనేకమంది దేవుని యొక్క బిడ్డలగా మార్చబడతారు మరియు దేవుని యొక్క రాజ్యము విస్తరిల్లుతున్నది అని అర్థం. 
మొదటి పఠణము ద్వారా గ్రహించవలసిన అంశములు ఏమిటి అంటే;
1. దేవుడు మనతో ఉంటే మనం అభివృద్ధి చెందుతుంటాము, దీవించబడతాం. ప్రభువు ఏ విధముగానయితే ఇశ్రాయేలు ప్రజలకు భద్రతను కల్పిస్తూ, తోడుగా ఉంటూ వారు అభివృద్ధి చెందే విధంగా ప్రజలును దీవించారు. అలాగే దేవుడు మనతో ఉంటే మనం కూడా దీవించబడతాం.
2. ప్రభువు ఎత్తైన చెట్లను నరుకుతాను అని తెలుపుచున్నారు దీనిని ఆధ్యాత్మికంగా అర్థం చేసుకున్నట్లయితే ఎవరైతే గర్వంతో ఉంటారో వారిని దేవుడు తమ యొక్క పదవుల నుండి తొలగిస్తారు. అందుకే మరియ తల్లి తన స్తోత్ర గీతములో దేవుడు ఎలాగ గర్వాత్ములను అధికారం నుండి పడగొడతారు తెలుపుతూ దీనులను ఏ విధంగా దీవిస్తారో తెలిపారు. (లూకా 1:51,52)
3. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని తెలుపుతున్నారు ఎందుకనగా పచ్చని చెట్లు ఎండిపోవునట్లు, ఎండిన చెట్లు పచ్చబడునట్లు చేసేది దేవుడు మాత్రమే అనగా నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి జీవితాలలో నమ్మకమును దయచేసి దేవుడే అలాగే గర్వముతో , భయము, భక్తి లేకుండా జీవించే వారి యొక్క జీవితాలు సంతోషము లేని జీవితాలుగా మారతాయి. దేవుడు తన ప్రజల జీవితంలో ఏదైనా చేయవచ్చు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు.
ఈనాటి సువిశేష భాగములో కూడా ఏసుప్రభు పరలోక రాజ్య వ్యాప్తి గురించి రెండు ఉపమానముల ద్వారా తెలియచేయుచున్నారు. ఈ రెండు ఉపమానములలో ఎదుగుదల అనేది గొప్పదిగా ఉంటుంది. ప్రారంభం చిన్నదిగా ఉన్న ముగింపు మాత్రం పెద్దదిగా ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఎదగాలి అది విశ్వాసములో అవ్వొచ్చు, చదువులోనైనా అవ్వొచ్చు, ప్రార్థనలో నైనా అవ్వొచ్చు, సంపదల్లోనైనా అవ్వొచ్చు.  ప్రభువు విత్తు వాడిని ఉదాహరణగా తీసుకొని ఆ విత్తనములు వెదజల్లినప్పుడు ఏ విధంగానైతే ఎవరికీ తెలియకుండా మొలకలు వస్తాయో అదే విధముగా ప్రభువు యొక్క రాజ్యము కూడా ఎవరు ఊహించని విధంగా విస్తరిల్లుతుంది అని తెలిపారు.
రెండవ ఉపమానము ఏసుప్రభు ఆవగింజను ఉదాహరణగా తీసుకొని పరలోక రాజ్యం గురించి తెలుపుచున్నారు. ఆవ గింజ చూడటానికి చిన్నదైనప్పటికీ దాని యొక్క ఎదుగుదల ప్రభావము చాలా గొప్పది. ప్రభువు ఎందుకు ఆవగింజనే ఉదాహరణగా తీసుకున్నారు అని ధ్యానించినట్లయితే ఆవగింజ చిన్నది కానీ ఫలితం పెద్దది అలాగే మన జీవితంలో కూడా వినయముతో ప్రారంభించిన ఏ పని అయినా సరే అది విజయవంతమగుతున్నది  ఎందుకంటే ఆయన దీనులను ఆశీర్వదిస్తారు కాబట్టి.
ఆనాడు దేవుడు ఆదాము అవ్వతో ప్రారంభించిన సృష్టి ఏ విధంగానైతే గొప్పగా విస్తరిల్లినదో అలాగే ఏసుప్రభు 12 మంది శిష్యుల ద్వారా ప్రారంభించిన తన యొక్క పరిచర్య ఈనాడు దేవుని రాజ్యం ఎంతగానో విస్తరిల్లినదో మనం చూస్తున్నాం దీనికి కారణం దేవుడు. శ్రీ సభ దినదినాభివృద్ధి చెందాలి అంటే దేవుని కృప సహకారం ఉండాలి. ఆయన కృప లేనిదే ఏది కూడా సాధ్యం కాదు. 
మన యొక్క అనుదిన జీవితంలో కూడా మనము దినదినాభివృద్ధి చెందాలి దానికి గాను వినయముతో జీవించాలి.
Fr. Bala Yesu OCD

8, జూన్ 2024, శనివారం

పదవ సామాన్య ఆదివారం

పదవ సామాన్య ఆదివారం 
ఆది 3:9-15
2 కొరింతి 4:13-5:1
మార్కు 3:20-35
ఈనాటి పరిశుద్ధ దివ్య గ్రంథ పఠణములు పాపము దాని యొక్క ఫలితము గురించి బోధిస్తున్నాయి. పాపము చేయటం ద్వారా మానవులు దేవుని యొక్క ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు. పాపము చేయటం ద్వారా దేవునికి దూరమవుతాం అదేవిధంగా మన యొక్క పొరుగు వారికి కూడా దూరం అవుతాం అలాగే వారిని బాధిస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరి జీవితంలో పాపము చేస్తూనే ఉంటారు. ఈనాటి మొదటి పఠణంలో ఈ లోకంలోకి పాపము ప్రవేశించినటువంటి విధానము గురించి ఆదికాండములో వివరించబడినది. ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వ పాపము చేసి దేవునికి విరుద్ధముగా నడుచుకున్నారు. దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించారు. హీబ్రూ భాషలో పాపమును HATTAH అని పిలుస్తారు అనగా చేయవలసిన మంచి చేయకపోవడం. ( Missing the target). ఆదాము అవ్వ దేవుడి ఎడల మంచిగా ప్రవర్తించవలసి ఉండినది కానీ వారు ప్రవర్తించలేదు. దేవునికి వారు విధేయత చూపించాలి కానీ చూపించలేదు అది వారి యొక్క పాపం. పాపం చేయటం ద్వారా ఆదాము అవ్వ దాగుకొని జీవిస్తున్నారు ఆ సందర్భంలో దేవుడు ఆదామును నీవెక్కడ అని ప్రశ్నించారు? ఇది దేవుడు పవిత్ర గ్రంథంలో అడిగిన మొట్టమొదటి ప్రశ్న. దీని యొక్క అర్థం ధ్యానించినట్లయితే -దేవుడు ఆదామును నీవు నాతో ఉన్నటువంటి బంధములో ఎక్కడ ఉన్నావు అని ప్రశ్నిస్తున్నారు.
- నీవు నీ కుటుంబ సభ్యుల బంధములో ఎక్కడున్నావు 
- నీవు నీ పొరుగు వారి యొక్క విషయాలలో ఎక్కడున్నావు 
- నీవు దేవాలయం రాకుండా ఎక్కడున్నావు 
- ప్రార్థించకుండా ఎక్కడున్నావు అని వివిధ కోణాలలో ఈ యొక్క ప్రశ్న గురించి ధ్యానించవచ్చు. నేడు దేవుడు ఇదే ప్రశ్న మనందరిని కూడా అడుగుచున్నారు. నీవు ఎక్కడున్నావు?
పాపములో జీవిస్తున్నటువంటి మనము దేవునితో ఉన్నటువంటి బంధంలో ఎక్కడ జీవిస్తున్నాం. మనం కూడా ఆదాము అవ్వలే పాపం చేసి దేవుని సన్నిధికి రాకుండా జీవిస్తున్నామా?
 దేవుడు ఆదాము అడిగిన రెండవ ప్రశ్న నీవు దిశములతో ఉన్నావు అని ఎవరు చెప్పితిరి? 
ఆదాము సైతాను నాకు ఈ విషయమును తెలియజేశారు అని పలికాడు. ఆదాము సైతాను మాట విన్నాడు కాబట్టి పాపము చేసాడు. సైతాను మనల్ని అనేక సందర్భాలలో మోసం చేస్తూనే ఉంటూ ఉంటుంది. మనం ఎవరి స్వరమును వినాలి, ఎవరిని అనుసరించాలి, ఎవరికి విధేయత చూపించాలి అనేది మన యొక్క అనుదిన జీవితంలో ఒక పోరాటం లాంటిది కాబట్టి మనం సరియైన నిర్ణయం తీసుకొని దేవుడికి అనుగుణంగా మంచిని ఎన్నుకొని జీవించాలి.
1.పాపము చేయటం ద్వారా - ఆదాము అవ్వలు అవమానానికి గురయ్యారు అందుకనే వారు ఎవరికీ కనబడకుండా దాగుకొని జీవించడానికి సిద్ధమయ్యారు.
2. పాపము చేయడం వలన కొన్నిసార్లు దానిని మనము అంగీకరించము. ఆదాము అవ్వ చేసినటువంటి పాపము కూడా అంగీకరించలేదు. 
3. పాపము మనలను ఇతరులను నిందించేలాగా చేస్తుంది. ఆదాము అవ్వను నిందించాడు, అవ్వ పామును నిందించినది. ఈ విధంగా ప్రతిసారి పాపం చేసిన సందర్భంలో మనము ఎవరినో ఒకరిని నిందిస్తూ ఉంటాం.
4. పాపం చేయడం ద్వారా ఆదాము అవ్వ భయపడుతూ, భయపడుతూ జీవిస్తున్నారు. 
5. పాపము చేయటం ద్వారా స్వేచ్ఛను కోల్పోతున్నారు.
6. పాపము చేయటం ద్వారా దేవునితో ఉన్నా స్నేహం కోల్పోయారు. 
7. పాపము చేయటం ద్వారా పరలోకమును కోల్పోయారు.
 ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు దేవుని యందు విశ్వాసము కలిగి జీవించుట అనే అంశం గురించి తెలుపుచున్నారు. ఈ లోకంలో చిన్న చిన్న కష్టాలు ఎదురైనా సరే దేవుడువసగు ప్రతిఫలము ద్వారా సంతోషముగా జీవిస్తున్నాం అని పౌలు గారు తెలుపుతున్నారు. 
ఈనాటి సువిశేష భాగములో మార్కు సువార్తికుడు రెండు అంశములను గురించి తెలియజేస్తున్నారు. 
1. ఏసుప్రభు ఎవరి అధికారంతో దయ్యములను పారద్రోలుచున్నారు అని.
2. ప్రభువు యొక్క ఆధ్యాత్మిక తల్లి, సోదరీ సోదరులు ఎవరని. 
ఏసుప్రభు నజరేతు వచ్చినటువంటి సమయంలో అక్కడికొందరి ప్రజలు ఆయనకు మతి చలించినదని భావించారు. ఆయన వారికి ఎంత మంచి చేసినప్పటికీ వారు మాత్రము ఆయన గురించి తప్పుగా అర్థం చేసుకుని పాపం చేశారు. దానికి ప్రతిఫలంగా ప్రభువు, ఆయన ఎవరి అధికారంతో దయ్యములను వెళ్ళగొట్టుచున్నారని తెలిపారు. 
అదేవిధంగా ప్రభువు యొక్క కుటుంబ సభ్యులో భాగస్తులై జీవించాలి అంటే మనము దేవుని యొక్క చిత్తమును మన యొక్క జీవితంలో నెరవేర్చాలి, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలి. మరియ తల్లి దేవుని యొక్క ఆజ్ఞలను పాటించి దేవునికి విధేయత చూపించినది కాబట్టే ఆమె నిష్కలంక మాతగా జీవించారు. మరియ తల్లి పాపము చేయకుండా సంపూర్ణముగా దేవునితో బంధము కలిగి ఆమె మనందరికీ కూడా ఒక సుమాతృకగా జీవించారు.
ఈనాడు మనందరం కూడా మన యొక్క బలహీనత ద్వారా పాపములో పడకుండా, సైతాను శోధనలకు లొంగకుండ దేవుని చిత్తానికి లోబడి, మంచిని చేస్తూ ఆయనతో బంధము కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. 
పాపం మనల్ని దేవుడి నుండి దూరం చేస్తుంది కాబట్టి పాపమని విడిచిపెట్టి, పశ్చాతాపపడి దేవునికి దగ్గర జీవించుదాం.
Fr. Bala Yesu OCD

1, జూన్ 2024, శనివారం

పరమ పవిత్ర క్రీస్తు శరీర రక్తముల పండుగ

పరమ పవిత్ర క్రీస్తు శరీర రక్తముల పండుగ 

ఈనాడు తల్లి శ్రీ సభ ఏసుక్రీస్తు దివ్య శరీర రక్తముల పండుగను కొనియాడుచున్నది. ఈ పండుగ దేవుని యొక్క నిజమైన సాన్నిద్యం దివ్యసప్రసాదంలో ఉన్నది అని తెలుపుచున్నది. ఈ పండుగ 13వ శతాబ్దంలో జూలియానా అనేటటువంటి భక్తిపరురాలు తనకు కలిగినటువంటి దర్శనం ద్వారా అప్పటి 4 వ ఉర్బన్ పాపుగారు తెలియజేసి ఈ పండుగ అధికార పూర్వకంగా ప్రపంచమంతా జరుపుకోవాలని ప్రకటించారు. ఈ యొక్క పండుగ మూడు విశ్వాస సత్యాలను మనకు నేర్పిస్తుంది. 
1. నిజ దేవుడు నిజమానవుడైన యేసు క్రీస్తు ప్రభువు మన కొరకు భూమికి దిగి రావటం. మన కొరకు తన శరీర రక్తములను ఆహారముగా ఇచ్చుట. 
2. దేవుడు ఎల్లప్పుడూ తన ప్రజలతో జీవిస్తారు ఈ యొక్క దివ్య సత్ప్రసాదం ద్వార.
3. దేవుని యొక్క సాన్నిద్యాన్ని ప్రతిరోజు దివ్యబలి పూజ ద్వారా అనుభవించుట.
 ఏసుప్రభు మరణించే ముందు మనందరికీ కూడా ఇచ్చినటువంటి రెండు విలువైన కానుకలు ఆయన యొక్క శరీర రక్తములు. దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉండటానికి ఆయన యొక్క శరీర రక్తములను మనకు ఒసగి ఉన్నారు.
 ఈనాడు మనందరం కూడా ప్రత్యేక విధముగా ధ్యానించవలసినటువంటి అంశము ఏమిటి అంటే దివ్య సత్ప్రసాదం యొక్క గొప్పతనం. దివ్య సత్ప్రసాదం ద్వారా దేవుడు అనేక అద్భుతములు చేసి ఉన్నారు. దివ్యసప్రసాదం శ్రీ సభకు ఉన్నటువంటి ఒక గొప్ప సంపద. ఎక్కడ ఎవరి దేవాలయానికి వెళ్లిన వారికి కేవలం దొరికేది దేవుని యొక్క ప్రసాదం మాత్రమే కానీ కతోలికలకు లభించేది ఏమిటి అంటే సాక్షాత్తు దేవుని యొక్క శరీర రక్తములు. స్వయముగా దేవుడే ప్రజల యొక్క హృదయంలోకి వేంచేస్తారు. చాలామంది పునీతులు దివ్య సత్ప్రసాదం యొక్క ఔన్నత్యం గురించి తెలియజేశారు. పునీత మదర్ తెరిసా గారు నేను ఇంతటి గొప్ప సేవ చేస్తున్నాను అంటే దానికి కారణము దివ్య సత్ప్రసాద నాధుడు నాకు శక్తిని ఇస్తున్నారు అని పలికారు. 
పునీత మరియా జాన్ వియాని గారు దివ్యసప్రసాదం గురించి తెలిపే సందర్భంలో ఈ విధంగా అంటున్నారు దివ్యసప్రసాదం స్వీకరించిన వ్యక్తి ఒక నీటి చలమ దగ్గర ఉండి ఆ నీటిని తనలోకి తీసుకోలేకుండా దాహంతో మరణించినవారి లాంటి వారు.
పునీత సిరిల్ గారు దివ్య సత్ప్రసాదం గురించి ఈ విధంగా అంటున్నారు దివ్య సత్ప్రసాదములో ఉన్న సజీవుడైన యేసును స్వీకరించిన వ్యక్తి సజీవుడుగా మారతాడు. 
పునీత్ అగస్టీను గారు అంటారు, దివ్య సత్ప్రసాదమును స్వీకరించిన వ్యక్తి క్రీస్తు వలే రూపాంతరం చెందుతారు. క్రీస్తు ప్రభువు యొక్క జీవితమే మన జీవితంగా మారుతుంది. పునీత పౌలు గారు పలికిన విధంగా ఇక నేను కాదు జీవించేది నాలో ఉన్న క్రీస్తే జీవిస్తారు (గలతి 2:20) అని అన్నట్టుగా మన జీవితం మారాలి. ఆయన వలే ప్రేమించాలి, ఆయన వలే క్షమించాలి, ఆయన వలె సహాయం చేయాలి ఇంకా ఆయన వలే మంచి లక్షణములు కలిగి జీవించాలి అప్పుడే మనందరం కూడా క్రీస్తు ప్రభువు వలే రూపాంతరం చెందిన వారంగా పిలవబడతాం.
దివ్యసత్రసాదం మనకు బలమును, జీవమును, అనుగ్రహమును దయ చేస్తుంది. దివ్య సత్ప్రసాదములో ఉన్న ఏసుప్రభు మనందరినీ ఆయన యొక్క శరీర రక్తములను భుజించమని తెలిపారు. యోహాను సువార్త 6:53 ఆయన యొక్క శరీర రక్తమును భుజించిన ఎడల మనలో జీవము ఉంటుంది అని తెలియజేశారు. అదేవిధంగా ప్రభువు శరీర రక్తములను స్వీకరించుట ద్వారా మన యందు దేవుడు దేవునియందు మనం ఐక్యమై జీవిస్తాము. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు ఆకాశము నుండి మన్నాను భుజించిరి కానీ వారు మరణించిరి కానీ ఏసుప్రభు తన యొక్క శరీర రక్తములను వసగుట ద్వారా వాటిని స్వీకరించిన మనము నిత్యము ప్రభువు నందు జీవిస్తాము.
ఇజ్రాయిల్ ప్రజలు మన్నా భుజించారు ఆ మన్నా కొలది కాలం మాత్రమే వారితో ఉన్నది కానీ ఏసుప్రభు ఇచ్చిన శరీర రక్తములు మనతో శాశ్వతంగా ఉంటాయి. ఇశ్రాయేలు ప్రజలు మన్నాను భుజించి మరణించింరి కానీ ఆయన శరీర రక్తములు భుజించిన మనం నిత్యము జీవిస్తాము.
దివ్యసప్రసాదము ద్వారా క్రీస్తు తన యొక్క జీవితాన్ని మనందరికీ కూడా త్యాగం చేశారు మరి మనము కూడా మన యొక్క జీవితంలో త్యాగం చేస్తూ ఇతరులకు సంతోషమును దయచేయాలి. 
దివ్య సత్ప్రసాదం దేవుని యొక్క ప్రేమకు గుర్తు కాబట్టి మనము కూడా ప్రేమతో జీవించాలి. 
దివ్యసప్రసాదం ఐక్యతకు గురుతు కాబట్టి మనము కూడా ఐక్యంగా జీవించాలి.
Fr. Bala Yesu OCD

25, మే 2024, శనివారం

త్రియేక దేవుని పండుగ

త్రియేక దేవుని పండుగ 
ద్వితీయో 4:32-34, 39-40
రోమి 8:14-17, మత్తయి28:16-20
ఈనాడు తల్లి శ్రీ సభ త్రియేక దేవుని పండుగను కొన్ని యాడుచున్నది. ప్రతి ఆదివారం కూడా వీరి ముగ్గురి పండుగ ఎందుకనగా, పితదేవుడు ఆదివారం రోజున సృష్టిని ప్రారంభించారు. పుత్రుడైన దేవుడు ఆదివారం రోజున మరణమును గెలిచి పునరుత్థానం అయ్యారు. పవిత్రాత్మ దేవుడు శిష్యుల మీదకు పెంతుకోస్తు ఆదివారం రోజున వేంచేశారు కావున ప్రతి ఆదివారము వీరి ముగ్గు పండుగను జరుపుకుంటాం. ఈరోజు ప్రత్యేకంగా దైవార్చన ఆదివారం ప్రకారం వీరి యొక్క రక్షణ పాత్రను ప్రత్యేకంగా ధ్యానించమని శ్రీ సభ కోరుచున్నది. 
మనం ఉదయం లేచిన దగ్గర నుండి నిద్రించే వరకు పితా, పుత్ర పవిత్రాత్మ నామమున ప్రార్థన చేస్తూ ఉంటాము వారి ద్వారానే ఏ కార్యమైనా తలపెడుతుంటాం, వారి ద్వారానే ఏ దివ్య సంస్కారమైనా అందచేయబడుతుంది. ఈ ముగ్గురు వ్యక్తులు అన్నిటిలో సరిసమానులు, శాశ్వతమైన వారు, ఒకే స్వభావము కలిగి ఉన్నారు. కొన్ని కొన్ని సందర్భాలలో ఆలోచిస్తే ఇది మానవ ఆలోచనలకు అందనిది సత్యం. పునీత ఆగస్టీను గారు కూడా ఈ యొక్క పరమ రహస్యమును తన యొక్క జ్ఞానముతో అర్థం చేసుకోవాలని ప్రయత్నించారు కానీ అది సాధ్యపడలేదు. దేవుని పరమ రహస్యం మన యొక్క ఆలోచనల ద్వారా అర్థం చేసుకోవాలి అంటే సాధ్యపడని విషయం అయినప్పటికీ దేవుడే తనను అర్థం చేసుకున్నటకై నూతన నిబంధన గ్రంధంలో ప్రత్యేక విధముగా కొన్ని ఉదాహరణలతో వారు ముగ్గురు  వ్యక్తులు కానీ  ఒకే స్వభావం కలిగిన త్రియేక దేవుడు. సృష్టి ప్రారంభం కాకము నుపే వీరి ముగ్గురు కలిసి ఉన్నారు. 
తండ్రి సృష్టిని చేశారు (ఆది1:3)
ఆదిలో వాక్కుగా ఏసుప్రభువు ఉన్నారు (యోహాను 1:1)
దేవుని యొక్క ఆత్మ నీటిపై తిరుగు చుండెను (ఆది 1:2).
ఒకరు సృష్టిని చేస్తే మరొకరు సృష్టిని రక్షించారు ఇంకొకరు సృష్టిని పవిత్ర పరిచారు. 
- ఏసుప్రభు యొక్క జన్మమునకు ముందు గాబ్రియేలు దూత మరియమాతకు మంగళవార్త చెప్పిన సందర్భంలో పితా,పుత్రా,పవిత్రాత్మ ముగ్గురు ప్రత్యక్షమై ఉన్నారు. తండ్రి దేవుడు గాబ్రియేలు దూతను పంపించారు. పుత్రుడైన యేసు ప్రభువు మరియ తల్లి గర్భమందు శరీర రక్తముల ద్వారా రూపం పొందుకున్నారు. పవిత్రాత్మ మరియు తల్లి మీద వేంచేసి వచ్చారు.
- ఏసుప్రభు జ్ఞాన స్నానం పొందిన తర్వాత ఆకాశము తెలవబడి, తండ్రి పావుర రూపమున ఈయన నా ప్రియమైన కుమారుడు ఈయనను గూర్చి నేను ఆనందిస్తున్నాను అని పలికారు.
- తాబోరు కొండమీద కూడా పితా,పుత్ర, పవిత్రాత్మ ముగ్గురు ఉన్నారు.
- ఏసుప్రభు యొక్క మోక్షారోహణ సమయంలో కూడా పితా,పుత్రా,పవిత్రాత్మ నామమున జ్ఞాన స్నానం ఇవ్వమని కోరారు .
త్రియేక దేవుని పండుగ జరుపుకుంటున్న సందర్భంలో మనం నేర్చుకోవలసిన అంశములు ఏమిటి అంటే 
1. త్రియేక దేవుని వలె మనము ఒకరితో ఒకరము బంధము కలిగి జీవించాలి. 
2. త్రియేక దేవుని వలె ఒకరికి ఒకరు సహకరించుకోవాలి 
3. త్రియేక దేవుని వలె ప్రేమ కలిగి జీవించాలి. 
4. త్రియేక దేవుని వలె కలసి మెలసి జీవించాలి 
5. త్రియేక దేవుని వలె అర్థం చేసుకుని ఉండాలి.
6. త్రియేక దేవుడు ముగ్గురు వ్యక్తులు అయినప్పటికీ వారు ఒకే  దేవుడు అని తెలుపుటకు మనకు కొన్ని ఉదాహరణలు ఉన్నవి. 
1. సూర్యుడు, సూర్యకిరణాలు, వేడి ఈ మూడు కూడా ఒకటే. 
2. నీరు,ఆవిరి, మంచు ఈ మూడు కూడా ఒకదానికి చెందినవే.
3. ఒక ఆపిల్ పండు యొక్క తోలు, కండ, విత్తనం మొత్తం కూడా ఒకటే (ఆపిల్) ఈ యొక్క ఉదాహరణలు మూడు భిన్నమైనవి ఒకటిగా ఉంటుంది.
ఈరోజు మన విశ్వాస సంబంధమైన త్రియేక దేవుని పండుగను కొనియాడుతున్న సందర్భంగా మనందరం కూడా పితా పుత్ర పవిత్రాత్మ వలే కలిసిమెలిసి జీవించుట ప్రయత్నించుదాం 

Fr. Bala Yesu OCD

18, మే 2024, శనివారం

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ 
అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23
ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు పండుగను వివిధ రకాలుగా పిలవవచ్చు శ్రీ సభ ప్రారంభమైన రోజు అని, పవిత్రాత్మ శిష్యులపై వేంచేసిన రోజు అని, క్రీస్తు నాధుడికి సాక్షులుగా జీవించమని కోరినటువంటి రోజు. 
పెంతుకోస్తు అనేటటువంటి పదము గ్రీకు భాష నుండి వచ్చినది గ్రీకు భాషలో దీనిని pentekoste అని అంటారు అనగా 50వ రోజు అని అర్థం.
పవిత్ర గ్రంథములో పవిత్రాత్మను వివిధ రకాల చిహ్నాలతో పోల్చుతారు; అగ్నితో, పావురంతో, గాలితో, నీటితో..
పెంతుకోస్తు యొక్క పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకున్నట్లయితే ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో ఈ పండుగ ఒక ప్రధానమైన పండుగ. యూదులకు మూడు ముఖ్యమైనటువంటి పండుగలు ఉన్నాయి. మొదటిగా పాస్కా పండుగ, రెండవదిగా పెంతుకోస్తు పండగ, మూడవదిగా గుడారాల పండుగ. ఈ మూడు పండుగలను వారు తప్పనిసరిగా చేసుకునేటటువంటి వారు. యెరుషలేముకు దాదాపు 20 మైళ్ళ దూరం ఉన్నటువంటి ప్రతి మగవారు యెరుషలేముకు వచ్చి ఈ మూడు పండుగలను తప్పనిసరిగా జరుపుకునేవారు.
ఈ మూడు పండుగలు వ్యవసాయానికి సంబంధించినటువంటి పండుగలు. 
పాస్కా పండుగ ఇస్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన సందర్భంలో వారి యొక్క విముక్తిగాను, స్వేచ్ఛకుగాను గురుతుగా ఈ పండుగను జరుపుకునేవారు.  ఇజ్రాయిల్ ప్రజలు దేవుడు మోషే ద్వారా సినాయి పర్వతం దగ్గర ఇచ్చిన 10 ఆజ్ఞలకు సూచనగా ఉన్న అంశమును బట్టి పెంతుకోస్తు పండుగ జరుపుకునేవారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాస్యం నుండి బయలుదేరి సీనాయి పర్వతం దగ్గరకు చేరినప్పుడు దాదాపు అది 50వ రోజు, ఆ రోజే దేవుడు వారికి ఈ ఆజ్ఞల పలకను ఇచ్చారు. ఇశ్రాయేలీయులు పెంతుకోస్తు పండుగను సీనాయి సంఘటనను సూచించే పండుగా జరుపుకునేవారు. 
ఇక గుడారాల పండుగ అనేది ఇజ్రాయేలు ప్రజలు పాలస్తీనా దేశం చేరకముందు గుడారాల్లో నివసిస్తూ ఎడారిలో సంచరించిన కాలాన్ని సూచించే పండుగ జరుపుకోవడం ఆరంభించారు.
ఈ మూడు కూడా వ్యవసాయానికి సంబంధించినవి. ఈరోజు పెంతుకోస్తు పండుగ అనగా దేవునికి కృతజ్ఞత తెలిపేది కోతకాలమైన ఏడు వారాల తర్వాత దేవునికి కృతజ్ఞతలు తెలిపేవారు, దేవుడిచ్చిన పంటకు గాను మరియు ఆయన చేసిన అద్భుత కార్యములకు గాను కృతజ్ఞతలు తెలియజేసేవారు. ఈ పండుగ రోజున పండిన గోధుమ పంటను దేవునికి ప్రజలు అర్పించేవారు.మరియ తల్లి గర్భం ధరించే సందర్భంలో పవిత్రాత్మ ఆమెపై వేంచేశారు.
- ఏసుప్రభు జ్ఞాన స్నానం పొందినప్పుడు పవిత్ర ఆత్మ ఆయన మీద వేంచేశారు.
- శిష్యులు ప్రార్థించే సమయంలో వారి మీదకు పవిత్రాత్మ వేంచేసారు.
నూతన నిబంధన గ్రంథంలో పెంతుకోస్తు రోజున శిష్యుల యొక్క జీవితంలో ఒక మహాత్తరమైన కార్యము జరిగింది ఏమిటంటే వారు పవిత్రాత్మను పొందారు. 
పెంతుకోస్తు రోజున జరిగిన కార్యములు.
1. శిష్యుల మీదకు మరియు తల్లి మీదకు అగ్ని నాలుకలు వలే పవిత్రాత్మ  వేంచేశారు.
2. భయంతో ఉన్న శిష్యులు ధైర్యముతో నింపబడ్డారు. 
3. శిష్యులు సువార్త ప్రకటింపగా అన్యులు తమ సొంత భాషల్లో వారిని వినసాగారు. 
4. తొలి క్రైస్తవులు దేవునికి గట్టి సాక్షులుగా తయారయ్యారు.
పవిత్రాత్మ దేవుడు చేయు పనులు 
1. మనం దేవుని యొక్క ఆలయం అని తెలుపుతూ మనలో జీవిస్తారు. (1 కొరింతి 3:16)
2. మనకు ధైర్యం ఇస్తూ, బలపరస్తారు. ( అపో 1:8, 4:8)
3. మనల్ని దివ్య సంస్కారాల ద్వారా పవిత్ర పరుస్తారు. 
4. మనకు బోధిస్తారు 
5. మన యొక్క ప్రార్థన ఆలకిస్తారు 
6. మనకు వరములను దయ చేస్తారు. (1 కొరింతి 12:7, 11)
7. మన తరుపున న్యాయవాదిగా పోరాడుతారు. 
8. మనకు ఫలములను దయచేస్తారు.
9. ప్రార్థించుటకు సహాయం చేస్తారు. (రోమి 8:26-27)
10. మనల్ని నడిపిస్తారు (గలతి 5:16, 25, అపో 8:29, 13:2, 15:7, 9, రోమి 8:14)
11. దేవుని విషయంలుఅర్థం చేసుకొనుటకు సహాయపడతారు. ( అపో 13:2)
12. మనల్ని ప్రేమిస్తారు (రోమి 15:30)
13. మనం సాక్ష్యమిచ్చేలా సహాయపడతారు (యోహాను 15:26).
14. మనల్ని వెదకుతారు ( 1 కొరింతి 2:11)
ఇంకా పవిత్రాత్మ చేయు పనులు అనేకములు ఉన్నవి అయితే ఈరోజు మనం గుర్తుంచుకోవలసిన అంశం ఏమిటి అంటే పవిత్రాత్మకి అనుగుణంగా జీవించాలి. పవిత్రాత్మ ఏ విధముగా  శిష్యులను నడిపించారో అదేవిధంగా మనలను కూడా నడిపించుట నిమిత్తమై సిద్ధంగా ఉన్నారు కాబట్టి పవిత్రాత్మ స్వరమును ఆలకిస్తూ, నడుచుటకు ప్రయత్నం చేద్దాం.

Fr. Bala Yesu OCD

11, మే 2024, శనివారం

మోక్షరోహణ పండుగ

మోక్షరోహణ పండుగ 
అపో 1:1-11, ఎఫేసీ1:17-23, మత్తయి 28:16-20
ఈనాడు తల్లి శ్రీ సభ క్రీస్తు ప్రభువు యొక్క మోక్షరోహణ పండుగను కొనియాడుతున్నది. ఏసుప్రభు పునరుత్థానమైన తర్వాత  శిష్యులకు 40 రోజులు దర్శనమిస్తూ, ధైర్యమనిస్తూ, బలపరుస్తూ వారిని సువార్త సేవకై సంసిద్ధం చేసిన తర్వాత పవిత్రాత్మను పంపుట నిమిత్తమై ఆయన మోక్షమునకు వెళుచున్నారు. ప్రభువు ఎక్కడినుండి వచ్చారో మరలా తిరిగి అక్కడికే వెళుచున్నారు. యోహాను 16 :28. మోక్షరోహణం అనేది క్రీస్తు ప్రభువు యొక్క పట్టాభిషేకము అని చెప్పవచ్చు అనగా ఆయన ఈ భూలోకంలో తన తండ్రి అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేరుస్తూ పరలోకంలో ఉన్న పితదేవుని ఎదుట విజేతగా నిలిచి ఉన్నారు. తండ్రి తన కుమారున్ని సింహాసనం పై కూర్చుండబెట్టి పరలోక భూలోకాలకు రాజుగా పట్టాభిషేకం చేస్తున్నారు. ఆయన భూలోక పరలోకానికి అధిపతి అయినప్పటికీ మోక్షరోహణ పట్టాభిషేకం ఆయన యొక్క విజయమునకు సూచనగా ఉన్నది. ప్రభువు పాపమును, సైతాను జయించి ఉన్నారు కాబట్టి తన కుమారునికి ఇచ్చిన గొప్ప బహుమానం, ఇది ఆయన ప్రేమకు చిహ్నం.
ఈనాటి మొదటి పఠణములో ఏసుప్రభు తన శిష్యులను పవిత్రాత్మను పొందు వరకు యెరూషలేమును విడిచి వెళ్ళవద్దని ఆజ్ఞాపించారు. అదేవిధంగా పవిత్రాత్మను పొందిన తర్వాత 'మీరు నాకు సాక్షులై ఉండాలి' అని ప్రభువు తెలిపారు (అపో 1:8). ఏసుప్రభు పరలోకమునకు వెళ్ళుచుండగా ఆయనతో పాటు ఇద్దరు దేవదూతలు కూడా వుంటిరి,వారు ఏసుప్రభు మరల తన యొక్క మహిమతో భూలోకమునకు వేంచేస్తారు అని వాగ్దానమిచ్చారు. ఈ మొదటి పఠణము ద్వారా మనము గమనించవలసిన విషయం ఏమిటి అంటే "సహనంతో ఉండటం", "వేచి ఉండటం"దాదాపు మూడు సంవత్సరాలు తన శిష్యులతో పాటు కలసి పరిచర్య చేసి ప్రభువు తండ్రి చిత్తము నెరవేర్చిన తర్వాత ఒక్కసారిగా ఆయన భౌతికంగా వారి నుండి దూరంగా వెళ్లే సమయంలో శిష్యులు భయపడకుండా, అలజడలకు నిరాశ చెందకుండా, కష్టాలలో ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఏసుప్రభువు వారికి భౌతికంగా దూరంగా ఉండే సమయంలో తన శిష్యులను సహనంగా ఉండమని ప్రభువు తెలియచేస్తున్నారు. మన యొక్క జీవితంలో కూడా కొన్ని కొన్ని సందర్భాలలో సహనంగా ఉండాలి అప్పుడే మనము ఎక్కువగా దీవించబడతాం. పునీత అవిలాపురి తెరేసమ్మ గారు సహనము సమస్తమును పొందును అని తెలియచేస్తున్నారు. ఆనాడు శిష్యులు అన్ని సమయాలలో సహనంగా ఉన్నారు కాబట్టే వారు పవిత్రాత్మను పొంది దేవునికి సాక్షులుగా ఉన్నారు.
ఈనాటి రెండవ పఠణములో పునీత పౌలు ఏసుప్రభు మహిమను పొందుటకు గల కారణం గురించి తెలుపుచున్నారు. ఆయన యొక్క త్యాగజీవితం దానికి నిదర్శనం. మనకు కొరకు తండ్రి సమస్తము తన కుమారుని పాదముల కింద ఉంచెను, సమస్తముపై ఆయనకు అధికారము ఉన్నది ఆయనను శ్రీ సభకు శిరస్సుగా అనుగ్రహించెను (ఎఫేసి 1: 22). ఒక విధముగా చెప్పాలి అంటే రెండవ పఠణం మనందరం కూడా మోక్షరోహణము అవుతాము అని తెలుపుచున్నది అది ఎప్పుడంటే మనము సంపూర్ణంగా ఈ లోకమును జయించినప్పుడు, అలాగే దేవుని యొక్క చిత్తమును నెరవేర్చినపుడు. క్రీస్తు ప్రభువు మనవలె మానవ స్వభావం కలవారు ఆయన పరలోక మహిమను పొందారు అంటే అది మనం కూడా పొందగలము అని అర్థం. క్రీస్తు ప్రభువు మన మధ్యకు మనలాగ వచ్చి అన్నిటిలో సుమాతృకగా నిలచి మనకు పరలోక దారి చూపారు. ఆయనతో పాటు మనం ఐక్యమై, సజీవులుగా,సత్ప్రవర్తనతో, ఆజ్ఞలు పాటిస్తూ జీవించినట్లయితే తప్పనిసరిగా ఆయన మహిమలో కూడా భాగస్తులు అవుతాము. అలాగే మనము క్రీస్తు బాధల్లో పాలుపంచుకున్నప్పుడు ఆయన మహిమలో కూడా మనము భాగస్తులుకాగలం. (రోమి8:18).
ఈనాటి సువిషేశ భాగములో ఏసుప్రభు మోక్షమునకు వెళ్లేటప్పుడు తన శిష్యులకు ఒక గొప్ప బాధ్యతను ఇస్తున్నారు అది ఏమిటంటే ప్రపంచమంతట తిరిగి సకల జాతి జనులకు సువార్తను ప్రకటించమని తెలుపుచున్నారు, పిత, పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానమివ్వమని శిష్యులకు తెలిపారు. ఏసుప్రభు తన శిష్యులను నమ్మి ఉన్నారు కాబట్టి వారికి గొప్ప బాధ్యతను అప్పచెప్పి వెళ్తున్నారు. శిష్యులు ఆయన మరణం అప్పుడు చల్లా చెదిరిపోయినప్పటికీ, ఆయనను మోసం చేసినప్పటికీ మరలా వారికే దర్శనమించి, వారి చేతుల్లోనే సువార్త ప్రకటించే బాధ్యతను, శ్రీ సభను అప్పచెప్పుతున్నారు. ఆయన వారి యెడల నమ్మకముంచారు కాబట్టి అంత బాధ్యతను అప్పచెప్పారు. చాలా సందర్భాలలో దేవుడు మనల్ని నమ్ముతారు కానీ మనము దేవుడిని నమ్మలేం.
ఏసుప్రభు తన తండ్రి చెంతకు తిరిగి వెళ్ళినప్పటికీ కూడా ఆయన మనతోనే ఉంటాను అని సెలవిచ్చుచున్నారు అనగా ‌ దివ్య సప్రసాదం ద్వారా, దివ్య సంస్కారాల ద్వారా, పవిత్ర గ్రంథం ద్వారా, ప్రార్థించుట ద్వారా ఆయన మనతోనే ఉంటారు. 
ప్రభువు యొక్క మోక్షారోహణం మనకు తెలియచేసే అంశములు ఏమిటి అంటే 
1. పవిత్రాత్మను పొందు వరకు వేచి ఉండుట 
2. దేవుని మహిమను పొందాలి అంటే క్రీస్తు ప్రభువు వలే జీవించాలి 
3. దేవుడు అప్పచెప్పిన బాధ్యతలు శిష్యులు నెరవేర్చిన విధంగా మనం కూడా నెరవేర్చాలి. 
4. దేవుడు మనతో ఉన్నాడు అని ధైర్యంతో ముందుకు సాగాలి. 
5. దేవుని యొక్క శుభవార్తను ప్రకటించాలి. 
6. పవిత్ర జీవితం జీవించాలి.

Fr. Bala Yesu OCD

4, మే 2024, శనివారం

పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం 
అపో 10:25-26, 34-35,44-48
1యోహను 5:7-10
యోహాను 15:9-17

ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు ఆయన ప్రేమలో ఐక్యమై ఉండుట గురించి తెలియజేస్తున్నాయి. దేవుని యొక్క ప్రేమ చాలా గొప్పది ఆయన ప్రేమ స్వరూపుడు కాబట్టి మనలను ప్రతినిత్యం ప్రేమిస్తూనే ఉన్నారు. 
ఈనాటి మొదటి పఠణంలో దేవుని యొక్క ప్రేమ అన్యులకు ఏ విధంగా అందచేయబడినది అనే అంశమును అపోస్తుల కార్యములు ద్వారా చదువుకుంటున్నాం. అన్యుడైనటువంటి కొర్నేలి ఆయన పేతురు గారిని కలుసుకున్న సందర్భంలో పేతురు దేవుడు ఎటువంటి పక్షపాతం చూపించని వారని, ఆయనకు అందరూ కూడా అంగీకార యోగ్యులే, అందరినీ సమదృష్టితో చూస్తారు అని తెలియజేస్తున్నారు. ఎవరైతే దేవునికి భయపడుచు, సత్ప్రవర్తన కలిగి జీవిస్తారో వారు ఏ జాతికి చెందిన వారైనా, ఏ కులానికి చెందిన వారైనా, ఏ మతానికి చెందిన వారైనా ప్రభువుకు అంగీకారులే. దేవుని యందు భయభక్తులు చూపుట అంటే ఆయన ఎడల విశ్వాసము కలిగి మంచి మార్గంలో నడుస్తూ దేవుని యొక్క ఆజ్ఞలను పాటించి జీవించటమే. దేవుడికి భయపడినప్పుడు మనము పాపము చేయలేము. దేవునికి భయపడుచు మనము పరలోకం గురించి ఆలోచన చేసిన సందర్భంలో మంచి జీవితాన్ని ఈ భూలోకంలో జీవిస్తాం. సత్ప్రవర్తన కలిగి ఉండుట అంటే మానవ యొక్క జీవితంలో ఎటువంటి స్వార్థం లేకుండా, ఎవరినీ మోసం చేయకుండా, సోదర భావంతో, నిర్మలమైన మనసుతో సహాయం చేస్తూ జీవించటం అలాంటి వారందరూ దేవునికి దేవుని ఇష్టమైనవారు. 
దేవుని ఆజ్ఞలను పాటించుచు ధర్మ మార్గంలో జీవించేవాడు ఏ జాతికి చెందిన ఏ వర్గానికి చెందిన దేవుని మిత్రుడే అని తెలిపారు అందుకుగాను దేవుడు కొర్నేలి కుటుంబమును ఎన్నుకొని ఆ కుటుంబ సభ్యులను  తన మిత్రులుగా చేసుకున్నారు. 
ఈనాటి రెండవ పఠణంలో దేవుడు ప్రేమ స్వరూపి అని తెలుపుచున్నారు. ప్రేమ దేవుడు నుండి పుట్టినది కావున మనము కూడా పరస్పరము ప్రేమ కలిగి ఉండాలి అని తెలుపుచున్నారు. ప్రేమించువాడు దేవుడిని తెలుసుకున్నవాడిగా పరిగణింపబడతాడు (1 యోహాను 4: 7). ప్రేమించకుండా జీవించేవారు ఇంకా దేవుడిని తెలుసుకొనకుండానే ఉన్నారు అని యోహాను గారు తెలుపుచున్నారు. యోహాను గారు దేవుని యొక్క అచంచలమైన ప్రేమను గ్రహించి ఆయన మనము కూడా ప్రేమించే వారిగా జీవించాలని తెలుపుతున్నారు. 
ఎందుకు ప్రేమ గురించి ఎక్కువగా మాట్లాడుచున్నారు, అనగా ప్రేమకు ఉన్న శక్తి ఈ లోకంలో  దేనికి లేదు. ప్రేమ సమస్తమును భరించునని, సహించునని, పౌలు గారు తెలుపుచున్నారు. 1 కొరింతి 13: 4-8). 
మనము దేవునుండి జన్మించిన వారము కాబట్టి పరస్పర ప్రేమ కలిగి జీవించాలి. 
- ప్రేమ వలన యేసు ప్రభువు మన కొరకై సిలువను మోసారు 
- భూలోకానికి మానవ మాత్రుడుగా వచ్చారు
- పాపులతో కలిసి జీవించారు
- శిష్యుల పాదాలకు కడిగారు
- సుంకరులతో - పాపులతో కలిసి భుజించారు 
- అనేక మందిని తాకి స్వస్థ పరిచారు. 
- ముఖం మీద ఉమ్ము వేసినా సరే, ఏమీ అనలేదు ఇది మొత్తం కూడా ప్రేమకు ఉన్నటువంటి శక్తి. 
- ప్రేమ అన్నిటిని అర్థం చేసుకుని జీవించేలా సహాయపడుతుంది.
-యోహాను గారు మనం ప్రేమిస్తేనే దేవుడిని తెలుసుకున్న వారమని అంటున్నారు కాబట్టి ఈరోజు మనల్ని మనము ప్రశ్నించుకోవాలి నేను ప్రేమిస్తున్నాన? నేను దేవుని తెలుసుకున్నాన? ప్రేమించకుండా ఇంకా ద్వేషాలతో, పగలతోనే ఉండేవారు దేవుడిని ఎరుగునటువంటివారే.
ఈనాటి సువిశేష భాగములో కూడా ఏసుప్రభు తన శిష్యులతో తన ప్రేమ యందు నెలకొని ఉండమని, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించమని, నేను తండ్రి ఆజ్ఞలను పాటించినట్లే మీరును నా ఆజ్ఞలు పాటించమని ప్రభువు తెలుపుచున్నారు. 
- ఆయన ప్రేమ ఎలాంటిది? అంటే తన స్నేహితుల కొరకు ప్రాణం నుంచి అంత గొప్ప ప్రేమ ( యోహాను 15:13). ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా తన స్నేహితుల కొరకు ఏసుప్రభు శ్రమించిన, ప్రాణాలర్పించిన  విధముగా త్యాగం చేసిన విధంగా ఉండరు. ఏసుప్రభు  వీరు కేవలం శిష్యులే అని వ్యత్యాసం చూపించకుండా వారిని తన స్నేహితులుగా పిలిచారు. పాత నిబంధన గ్రంథంలో మోషే తనను తాను దేవుని సేవకుడిగా పిలుచుకున్నారు (ద్వితి 34:5), యెహోషువ సేవకుడిగా పిలుచుకొనుబడ్డారు (యెహోషువ 24:29), దావీదు రాజు కూడా ప్రభువుని సేవకుడిగా పిలవబడ్డారు (కీర్తన 89:20). వారు దేవుని సేవకులుగా పిలవబడుటకు ఇష్టపడ్డారు అయితే ఇక్కడ ఏసుప్రభు తన శిష్యులను కేవలం సేవకులుగా మాత్రమే కాక స్నేహితులయ్యే గొప్ప అవకాశం దయచేస్తున్నారు. స్నేహితుల అవ్వటం అంటే దేవునికి అతి సన్నిహితంగా జీవించటం. స్నేహితులకు తన స్నేహితుడు మొత్తము కూడా బయలపరుస్తారు, చాలా దగ్గర సంబంధం కలిగి జీవించే విధంగా ఉంటారు కాబట్టి ఏసుప్రభువు మనం కూడా ఆయనకు స్నేహితులయ్యే అవకాశాన్ని దయచేసి ఉన్నారు కాబట్టి ఆయనే ఒక ఆజ్ఞలను పాటించి జీవించాలి.
-  మనలో ప్రేమ ఉన్నప్పుడు బేధాభిప్రాయాలు చూపించు. మనలో ప్రేమ ఉన్నప్పుడు అందరిని సరి సమానులుగా చూస్తూ ఉంటా యేసు ప్రభువు కూడా చేసినది అది. 
- ఆయన మనలను ప్రేమించారు కాబట్టే మన యొక్క పాపాలన్నీ కూడా క్షమిస్తున్నారు. ఎదుటి వారు చేసిన తప్పిదములు క్షమించాలి అంటే మనలో తప్పనిసరిగా ప్రేమ ఉండాలి లేకపోతే క్షమించను మనలో ఉన్న ప్రేమ వలనే ఇతరులను క్షమించ గలుగుతాం. (లూకా 15)
- మనము ఏసుప్రభు ఇచ్చిన ప్రేమ ఆజ్ఞ పాటించిన యెడల ఆయన ప్రేమలో నెలకొని ఉంటాము అప్పుడు మన యొక్క ఆనందము, సంతోషము పరిపూర్ణమగును. అదేవిధంగా దేవుని యొక్క ప్రేమ ఆజ్ఞ పాటించుట ద్వారా మనము దేవునికి స్నేహితులవుతున్నాం.  ఒక మానవునికి ఇంతకన్నా గొప్ప దీవెన మరి ఏది ఉండదు. ఎందుకంటే సామాన్యులమైనటువంటి మనందరిని కూడా ఆయన స్నేహితులుగా ఉండే అవకాశం ప్రభువు కల్పిస్తున్నారు. దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తే దేవుడు మనకు దగ్గరవుతారు, దేవుని దీవెనలు పొందుతాం, మన యొక్క ప్రార్థనలు ఆలకించబడతాయి కావున మనం దేవుని యొక్క ఆజ్ఞను పాటిస్తూ జీవించుదాం.
Fr. Bala Yesu  OCD

27, ఏప్రిల్ 2024, శనివారం

పాస్కా ఐదవ ఆదివారం

పాస్కా ఐదవ ఆదివారం 
అపో9: 26-31, 1 యోహాను 318-24, యోహాను 15:1-8
ఈనాటి పరిశుద్ధ దివ్య గ్రంథ పఠనములు దేవునిలో ఐక్యమై జీవించుట అనే అంశము గురించి బోధిస్తున్నాయి. దేవుడిని తెలుసుకొని, దేవుడిని సేవించి, దేవునిలో ఐక్యమై జీవించుట క్రైస్తవ కతోలిక విశ్వాసము మనకు బోధిస్తుంది.
ఈనాటి మొదటి పఠణంలో దేవుడు సౌలును తన యొక్క సువార్త సేవకై ఎన్నుకున్నటువంటి విధానం గురించి వింటున్నాం. దేవునిలో ఐక్యమై జీవించుట నిమిత్తమై ఏసుప్రభు సౌలును ఎన్నుకొని ఆయనకు దర్శనమిచ్చి తన జీవితం మార్చుతున్నారు. సౌలు యొక్క హృదయ పరివర్తనము క్రైస్తవ జీవితంలో ఒక ప్రధానమైనటువంటి అంశం ఎందుకంటే ఆయన మార్పు అనేకమందికి ఆదర్శమైనది, అనేకమంది విశ్వాసం పెంచింది. ఆయన ఏసుప్రభుని అనుసరించేటటువంటి వారిని హింసించాడు అదే ఒక వ్యక్తి మరొకసారి ఏసుప్రభు గురించే ప్రసంగించి అనేకమందిని ఏసుప్రభు చెంతకు చేరుస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరు గ్రహించవలసినటువంటి సత్యం. ఏ విధముగానయితే తోటలో పనిచేసే తోటమాలి మొక్క ఎదుగుట కొరకై దానిని సరి చేస్తూ దాని యొక్క అభివృద్ధి కొరకై సహకరిస్తూ ఉంటారో అదే విధముగా దేవుడు కూడా సౌలు యొక్క హృదయ కాఠిన్యం జీవితమును సరిచేసి ఆయనను మృదువుగా సువార్త పరిచర్యకుడిగా చేశారు. సౌలు కూడా తన యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నారు అదేవిధంగా దేవుడి మీద ఆధారపడి ఉన్నారు. దేవుని పిలుపుకు స్పందించి సౌలు జీవించారు . సౌలు దేవుడిలో ఐక్యమై జీవించుట కొరకై తన యొక్క పాత జీవితంను విడిచిపెట్టారు.
ఈనాటి రెండవ పఠణంలో  మన యొక్క జీవితము కేవలం మాట వలననేకాక క్రియల వలన కూడా ఉండాలి అని యోహాను గారు తెలియచేస్తున్నారు. మనము దేవునికి విధేయులమై ఆయన యొక్క ఆజ్ఞలను పాటించవలెనని తెలియచేస్తున్నారు అప్పుడు దేవుడు మనము ఏది కోరిన సరే దాన్ని వసుగుతారు.
ఈనాటి సువిషేశ పఠణంలో ప్రభువు ద్రాక్షావల్లి తీగలు అనేటటువంటి అంశము ద్వారా మనము ఆయనలో ఐక్యమై జీవిస్తూ ఫలించాలని ప్రభువు తెలియచేస్తున్నారు. ఏసుప్రభు ద్రాక్షావల్లి, తండ్రి వ్యవసాయని తెలుపుచున్నారు అదేవిధంగా మనము ద్రాక్షావల్లి యొక్క తీగలు. ద్రాక్షావల్లిలో భాగస్తులైన తీగలు ఎల్లప్పుడూ కూడా ఫలించాలి అని ప్రభువు తెలుపుతూ ఉన్నారు. ఆ తీగలు ఫలించటానికి వ్యవసాయ కత్తిరిస్తూ వాటిని సరి చేస్తారు. ద్రాక్ష వల్లి ఫలించుట నిమిత్తమై యజమాని కావలసినటువంటి ఎరువులు వేస్తూ తగినటువంటి నీరును సమకూరుస్తూ ఉంటారు. ఆయన యొక్క ఆశ మొత్తము కూడా ఆ తీగలు ఫలించాలి అనే, దానికోసమే ఆయన కృషి 
 చేస్తారు. ద్రాక్ష తీగలు సరిచేసిన సందర్భంలో ఏ కొమ్మ అయితే తోటమాలికి సహకరిస్తూ ఉంటూ ఉంటుందో ఆ కొమ్మ అధికముగా ఫలిస్తుంది. మనలో ఉన్నటువంటి స్వార్ధ భావాలు, అసూయలు, కోప తాపాలు, కత్తిరించినప్పుడే మనము కూడా ఫలించబడతాము. 
మనము ద్రాక్షావల్లిలో  భాగస్తులైన కొమ్మలైతే ఎందుకు ఫలించుటలేదు మనం ఫలించకపోవడానికి కారణం ఏమిటి?
1. మనలో ఉన్నటువంటి పాపము. 
2. మన యొక్క విధేయత 
3. మనము దేవుని మీద ఆధారపడకపోవడం 
4. మన యొక్క స్వార్థపూరితమైన జీవితం  
5. మన యొక్క హృదయ కాఠిన్యం 
6. దేవుని యొక్క వాక్యమును ఆచరించకపోవడం 
7. మన యొక్క అవిశ్వాసం 
8. క్షమించలేకపోవటం
మనల్ని శుద్ధి చేయుట నిమిత్తమై ప్రభువు తన యొక్క వాక్యము ద్వారా హెచ్చరిస్తూ ఉంటారు కాబట్టి ఆయన యొక్క వాక్కును ఆలకించి మనము జీవించాలి అప్పుడే మన యొక్క జీవితాలు ఫలిస్తాయి అదేవిధంగా ద్రాక్షవల్లి తీగలు ఎల్లప్పుడూ కూడా కలిసి ఉండటం నిమిత్తమై మనము ఈ విధంగా ఉండాలి.

1. ప్రార్థన చేయాలి
2. విధేయత చూపాలి 
3. దేవుని చెంతకు మరలి రావాలి 
4. దేవుని మీద ఆధారపడి జీవించాలి 
5.  దైవ ప్రేమ, సోదర ప్రేమ కలిగి జీవించాలి.
ఇవి అన్నియు మన యొక్క జీవితంలో పాటించినప్పుడు మనం దేవునిలో ఐక్యమై జీవిస్తాము.
ఈనాడు తల్లి శ్రీ సభ మనము దేవుడిలో ఐక్యమయి జీవించమని కోరిన సందర్భంలో మనము ఆ ప్రభువు యొక్క వాక్కు అనుసారముగా జీవించ ప్రయత్నించాలి. సౌలు ఏ విధంగానైతే తన యొక్క జీవితాన్ని కత్తిరించినప్పుడు దేవునికి సహకరించారో అదేవిధంగా మనం కూడా దేవునికి సహకరిస్తూ ఆయనలో ఐక్యమవ్వాలి.
Fr. Bala Yesu OCD

20, ఏప్రిల్ 2024, శనివారం

పాస్కా నాలుగవ ఆదివారం

పాస్కా నాలుగవ ఆదివారం 
అపో 4:8-12, 1 యోహాను 3: 1-2
యోహాను 10:11-18
 ఈ యొక్క ఆదివారమును మంచి కాపరి ఆదివారము అని తల్లి శ్రీ సభ పిలుస్తుంది. పాత నిబంధన గ్రంథంలో యావే దేవుడిని గొర్రెల కాపరిగా పోల్చి చెబుతూ ఉంటారు. దావీదు రాజు ప్రభువును కాపరిగా పిలిచారు కీర్తన (23 :1). అదేవిధంగా ఇంకొక చోట మేము నీ ప్రజలము నీ మందలోని గొర్రెలను అని తెలుపుచున్నారు (కీర్తన 79: 13). దేవుడు తన ప్రజలకు ఒక కాపరిగా ఉంటూ వారిని తన వైపుకు ప్రతినిత్యం నడిపిస్తూ, వారి యొక్క జీవిత యొక్క అభివృద్ధి కొరకు ప్రతినిత్యం కూడా కృషి చేస్తూ, వారిని శత్రువుల నుండి అదేవిధంగా విపత్తుల నుండి కాపాడుచూ వారికి తన యొక్క ప్రేమను చూపిస్తున్నారు. 
ఈనాడు చదువుకున్న పరిశుద్ధ గ్రంథ పఠణములు నుంచి కొన్ని అంశములను ధ్యానం చేద్దాం. మొదటి పఠణంలో పేతురు గారు దేవుని చేత తన మంద కొరకు ఒక కాపరిగా ఎన్ను కనబడిన తర్వాత ఆయన చేసిన అద్భుతం గురించి వింటున్నాం. ఈ యొక్క అద్భుతము యేసు ప్రభువు యొక్క నామములో చేయబడినది అని స్పష్టముగా పేతురు తెలియజేస్తున్నారు. ఆయన సజీవుడుగా వారి మధ్య ఉన్నప్పుడు మాత్రమే కాదు అద్భుతములు చేసేది ఆయన మరణించి- పునరుత్థానమైన తర్వాత కూడా ఏసుప్రభు తన ప్రజల యందు అద్భుతములను చేస్తూ ఉన్నారు అని తెలుపుచున్నారు. ఏసుప్రభు యొక్క నామము శక్తివంతమైనదని, ఆ యొక్క నామములో అనేక అద్భుతములు కలవు అని స్పష్టంగా పేతురు వివరించారు. పేతురు కాపరిగా ఉంటూ కుంటివానికి ప్రభువు స్వస్థతనిచ్చారు. అనేక సంవత్సరాల నుండి కుంటివాడిగా నిర్భాగ్య జీవితం జీవిస్తున్నాడు అతడు. అతని యొక్క జీవితంలో ఆనందం లేదు జీవితము కృంగిపోయినది అట్టివానికి పేతురు సంతోషాన్ని దయచేసి, ఏసుప్రభు యొక్క నామమున స్వస్థత పరుస్తూ తనలో ఆనందము నింపుతున్నారు. పేతురు ఒక కాపరిగా తనకు అప్పచెప్పినటువంటి బాధ్యతను ఆయన నెరవేరుస్తూ దేవుడు యొక్క ప్రేమను అదేవిధంగా సందేశమును ఇతరులకు అందజేశారు. ఇది తనకు అప్పచెప్పినటువంటి బాధ్యత.
ఈనాటి రెండవ పఠణంలో యోహాను గారు దేవుడికి మానవుడు ఎడల ఉన్నటువంటి గొప్ప ప్రేమ గురించి తెలియజేస్తున్నారు. దేవుడు మనలను ప్రేమించి ఉన్నారు కాబట్టే మనము ఆయన యొక్క బిడ్డలుగా ఉంటున్నాం. ఈ లోకము ఆయనను ఎరుగదు కాబట్టి ఈ లోకమునకు దేవుని విలువ అదేవిధంగా మన యొక్క ప్రాధాన్యత తెలియదు. దేవుడు మనమ ఆయనకు సాక్షులుగా ఉండటం వలన ఒక రోజున ఆయనను ముఖాముఖిగా దర్శించే అవకాశంను ప్రభువు మనకు కల్పిస్తారు ఆ రోజున మనము కూడా ఆయన వలె చేయబడతాము అని యోహాను గారు తెలియజేస్తున్నారు. ఇది ఎప్పుడు సాధ్యము అంటే,  కేవలం మనం దేవుడిని ఎరిగి ఆయన యొక్క ఆజ్ఞలను పాటించి జీవించినప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది.
ఏసుప్రభువు ఈనాటి సువిశేష భాగములో తన్ను తాను మంచి కాపరిగా పోల్చుకొని చెబుతున్నారు. పవిత్ర గ్రంథములో చాలామంది ప్రవక్తలు, భక్తులు కాపరులుగా ఉంటున్నారు. 
- ఆబేలు గొర్రెల కాపరి 
- అబ్రహాము గొర్రెల కాపరి
- మోషే గొర్రెల కాపరి 
- దావీదు గొర్రెల కాపరి 
- ఆమోసు ప్రవక్త కాపరి
- చాలామంది గొర్రెల కాపరులుగా ఉంటున్నారు. ఒక మందకు కాపరి తప్పనిసరిగా అవసరం లేదంటే ఆ గొర్రెలు విచ్చలవిడిగా జీవిస్తాయి.  ఏసుప్రభు మంచి కాపరి కాబట్టి ఆయనలో ఉన్నటువంటి కొన్ని లక్షలములను ధ్యానం చేద్దాం 
1) మంచి కాపరి తన మంద కొరకు ప్రాణములను త్యాగం చేస్తారు. ఏసుప్రభు ఆయన గొర్రెల దొడ్డి వద్ద గేటు (ద్వారము) వద్ద నిలబడి ఉంటాను అని తెలియజేస్తున్నారు (యోహాను 10: 7). ఆయన ద్వారము వద్ద నిలబడుతూ దొంగలు కానీ జంతువులు కానీ తన మంద దగ్గరకు రాకుండా ఆయనే వాటన్నిటిని రక్షిస్తారు. జీతగాండ్రు సొంత వాడు కాదు కాబట్టి ఆపద వచ్చినప్పుడు తన యొక్క మందను విడిచి వెళతారు కానీ మంచి కాపరి ఒక రక్షణ కవచంగా ఉంటూ తానే ఆపద భరిస్తూ ఆయన తనమందను అన్ని రకాల ఆటంకముల నుండి కాపాడుతారు. కేవలం మంచి కాపరి మాత్రమే తన మంద కొరకు ప్రాణాలు సైతం త్యాగం చేస్తారు ఇది ఎవరికి కూడా సాధ్యపడదు ఏసుప్రభు మంచి కాపరి కాబట్టి మన అందరి యొక్క మరణమునకు బదులు ఆయనే మరణించి తన ప్రాణమును త్యాగం చేసి మనకు జీవమును ప్రసాదించారు ఇది ఆయన యొక్క త్యాగానికి గుర్తు.
2). తన మంద గురించి కాపరికి స్పష్టముగా తెలియను. 
ఏసుప్రభుకి ప్రతి ఒక్కరి యొక్క  జీవిత స్థితిగతులు తెలుసు కాబట్టే ఎవరికీ ఏం అవసరమున్నదో దానిని బట్టి వారిని దీవిస్తున్నారు. ప్రతి ఒక్కరి యొక్క సమస్యలు, అనారోగ్యాలు, బలహీనతలు తెలుసు కాబట్టి వారిని అర్థం చేసుకొని వారిని దీవించారు. 
3. మంచి కాపరి తన మందను పోషిస్తారు. యెషయా 40:11. మంచి కాపరి తన మందును నడిపించే సమయంలో వారికి కావలసిన పోషణను దయ చేస్తారు. ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో పై ప్రయాణం చేసే సందర్భంలో వారు ఆకలితో ఉన్నారు కాబట్టి వారి యొక్క ఆకలని తీర్చారు. ఏసుప్రభువు కూడా తన యొక్క బోధనలను వినటానికి వచ్చినటువంటి వారిని అందరిని కూడా శారీరక మరియు ఆధ్యాత్మిక పోషణను దయ చేశారు. 
4. మంచి కాపరి తన మందను నడిపిస్తారు. (కీర్తన 23: 3)
తానే అన్నిటిలో సుమాతృకగా ఉంటూ తన మందను నడిపిస్తారు. పాత నిబంధన గ్రంథములో యావే దేవుడు కూడా ఇశ్రాయేలు ప్రజలకు ఒక మార్గ చూపరిగా ఉంటూ వారిని ఎడారి గుండా నడిపించారు అలాగే ఏసుప్రభు కూడా తనను విశ్వసించే వారందరికీ కూడా పరలోక మార్గమును చూపిస్తూ, వారు వినయములో నడుచుటకు, విధేయతతో జీవించుటకు, క్షమ కలిగి ఉండటకు, ప్రేమ కలిగి ఉండుటకు ఒక మార్గమును తన యొక్క జీవితం ద్వారా చూపించారు, వారిని నడిపించారు. ఏసుప్రభు తన మందను నడిపించేది మంచి వైపుకు మాత్రమే అనగా పరలోకము వైపు మాత్రమే మనము ఆయన మందకు చెందిన వారమైతే ఆయన స్వరమును విని ఆయన మార్గంలో నడవాలి.
5. మంచి కాపరి తన మందను ప్రేమిస్తారు అలాగే తన ముందు పట్ల శ్రద్ధ వహిస్తారు.
మంచి కాపరి తన మందను ప్రేమించారు కాబట్టి ఆ మందను ఆపదల నుండి కాపాడుతారు అలాగే అవి దారి తప్పిన సమయంలో వారిని వెతికి తీసుకొస్తారు మరియు వారి యొక్క ఎదుగుదలకు అవసరమైనది మొత్తం కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు అందుకనే మంచి కాపరి తన మందును ప్రేమిస్తూ, శ్రద్ధ వహిస్తారు అని పిలుస్తారు. యేసు ప్రభువు కూడా మనలను ప్రేమించారు అలాగే మన యందు శ్రద్ధ వహించారు కాబట్టి మనకు అనేక సత్యములను తెలియజేశారు ప్రతి ఒక్కరు కూడా చేయవలసినది ప్రేమించాలి, శ్రద్ధ వహించాలి.
6. మంచి కాపరి తన మందను సరి చేస్తారు. ఎప్పుడైతే ఒక గొర్రె యజమానుడి యొక్క మాట వినకుండా ఇష్టం వచ్చిన రీతిలో నడుచుకున్నప్పుడు  కాపరి దానిని సరిచేస్తూ, వాటిలో ఉన్న చెడును కత్తిరించి వాటిని మంచి మార్గంలో నడిపిస్తారు. ఏసుప్రభు ఒక మంచి కాపరిగా ఉంటూ ఆయన అనేక మంది యొక్క జీవితాలను సరి చేస్తూ, ఆయన పరిచర్య చేసే సందర్భంలో ఏది సత్యమో, ఏది అనుసరించాలో తెలియచేస్తూ వారి యొక్క విశ్వాస జీవితాలను సరి చేశారు. 
7. మంచి కాపరి తన గొర్రెలను తన భుజముల మీద వేసుకుంటారు.
8. మంచి కాపరి తన మంద పట్ల కనికరం కలవారు. అవి గాయపడిన సందర్భంలో తానే ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనపరుస్తూ వాటి యొక్క గాయములను నయం చేయుట కొరకై ప్రత్యేకంగా కృషి చేస్తారు.
దేవుడు మనలను కూడా మన యొక్క కుటుంబాలకు సంఘాలకు కాపరులుగా ఎన్నుకుంటున్నారు మరి మనము ఆయన వలె లక్షణములను కలిగి జీవించగలుగుతున్నామా ఒక కాపరిగా మనము ప్రేమించగలుగుతున్నామా, పెంచగలుగుతున్నామా, రక్షించగలుగుతున్నామా అని మనము ధ్యానము చేసుకొని మనము కూడా మంచి కాపరి వలె జీవించటానికి ప్రయత్నం చేయాలి. 

Fr. Bala Yesu OCD

13, ఏప్రిల్ 2024, శనివారం

పాస్కా 3 వ ఆదివారం

పాస్కా 3 వ ఆదివారం 
అపో 3:13-15,17-19, 1 యోహాను 2:1-5, లూకా 24:35-48
ఈనాటి దివ్య పఠణములు యేసు ప్రభువు యొక్క పునరుత్థానము నందు విశ్వాసం ఉంచి హృదయ పరివర్తనము చెంది జీవించాలి అని తెలియజేస్తున్నాయి. ఏసుప్రభు పునరుత్థానమై ఇది మూడవ ఆదివారం. ఆయన పునరుత్థానము అయిన తర్వాత  అనేక సందర్భాలలో శిష్యులకు దర్శనమిస్తూ, విశ్వాసులకు దర్శనమిస్తూ వారి యొక్క విశ్వాస జీవితమును బలపరుస్తూ ఉన్నారు.
ఈనాటి మొదటి పఠణంలో పేతురు గారు అందరి సమక్షంలో యెరుషలేములో సొలోమోను మండపం వద్ద  ధైర్యంగా చెప్పిన గొప్ప ప్రసంగం గురించి చదువుకున్నాం. పేతురు గారు కుంటివానికి స్వస్థత నిచ్చిన తర్వాత చేసిన బోధన ఈ రోజున విన్నాము.  పేతురు గారు యూదులకు యావే దేవునితో ఉన్నటువంటి గొప్ప సంబంధం గురించి తెలుపుచూ ఆ యొక్క బంధం ఈనాటికి కూడా ఏసుప్రభు ద్వారా కొనసాగించబడు చున్నదని తెలిపారు.  వారికి(యూదులకు) విశ్వాసం ఉన్నప్పటికీ లేనప్పటికీ  ఆయన మాత్రము దేవుని కుమారుడు అని తెలిపారు. ఈ మొదటి పఠణంలో పేతురు యూదులను ఉద్దేశించి చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే వారు నీతిమంతుడు, పవిత్రుడైన యేసు ప్రభువును నిరంకుశముగా శిక్షించారు అవమానపాలు చేశారు అలాగే మరణ దండనకు గురి చేశారు. ఆ సందర్భంలో అక్కడున్నటువంటి వారందరు  చేసినటువంటి పాపమును పేతురు గారు తెలుపుతూ, హృదయ పరివర్తనము చెందమని కోరారు. ఈ సందర్భంలో రెండు విషయాలు మనము అర్థం చేసుకోవాలి మొట్టమొదటిగా పాపము నుండి హృదయ పరివర్తనము చెందుట. రెండవదిగా దేవుని చెంతకు మరలిరావడం.
- పేతురు గారు యూదులు చేసినటువంటి పెద్ద తప్పిదమును ఖండించుటకు వెనుకంజ వెయ్యలేదు. ఆనాడు ఏ విధముగానయితే తప్పు చేసినటువంటి దావీదును సరి చేయుటకు నాతాను ప్రవక్త వెనుకంజ వేయలేదో, ఆహాబు చేసిన తప్పును ఖండించుటకు ఏలియా వెనుకంజ వేయలేదో, హేరోదు చేసిన తప్పును సరిదిద్దుటకు బప్తిస్మ యోహాను వెనుకంజ వేయలేదో అదేవిధంగా పేతురు గారు కూడా ధైర్యంతో చేసినటువంటి తప్పును సరిదిద్ధారు. జీవనకర్తను మీరు చంపి ఉన్నారు అని చాలా గట్టిగా  బోధించారు. ప్రభువు యొక్క పునరుత్థాన అనుభూతి మరియు పెంతుకోస్తు అనుభూతి శిష్యులకు బలమును, శక్తిని, మాటలను, అద్భుతములు చేయు శక్తిని దయచేశాయి అందుకనే వారు గొప్పగా పునరుత్థాన సందేశమును అందరికీ తెలియజేస్తూ వారి విశ్వాస జీవితాలను సరి చేస్తున్నారు.
- ప్రజలు(యూదులు )మంచి కోరుకొనుటకు బదులుగా చెడును ఆశించారు అనే అంశము కూడా పేతురు గారు స్పష్టంగా తెలియజేశారు ఎందుకంటే దొంగవాడు, అంతకుడైనటువంటి బరబ్బను విడుదల చేయమని కోరారు కానీ ఎటువంటి తప్పు చేయని నీతిమంతుడైన యేసు ప్రభువుని విడుదల చేయమని ఎవరు కోరలేదు దానికి బదులుగా ఆయనను మరణశిక్షకు గురి చేయమని పలికారు. కొన్ని కొన్ని సందర్భాలలో మన జీవితంలో కూడా మనం కూడా ఇతరులను నాశనం చేయుట కొరకు మన శత్రువులతోనైనా కలవడానికి ప్రయత్నం చేస్తాము. మంచిని ఎన్నుకొనటానికి బదులుగా చెడుని ప్రేమిస్తూ చెడు వైపు వెళ్తాం అది మన జీవితంలో చేసే పెద్ద తప్పు. హేరోదు ఏసుప్రభును చంపుట కొరకు శత్రువైన పిలాతుతో కలిశాడు దానివల్ల పాపం చేశారు. చాలా మంది యూదులు కూడా చేసినది ఇలాంటి తప్పే ఏసుప్రభుకు బదులుగా బరబ్బను విడుదల చేయమని అడిగారు. ఈ విధముగా వారు చేసినటువంటి తప్పులు తెలియజేస్తూ పేతురు గారు వారిని పాపమునుండి హృదయ పరివర్తనము చెందమని కోరారు.
- పాపము నుండి హృదయ పరివర్తనం చెందాలి. హృదయ పరివర్తనం అంటే కేవలం పశ్చాత్తాప పడటం మాత్రమే కాదు పూర్తిగా విడిచి పెట్టడం కూడా. పూర్తిగా మన పాపపు క్రియలు విడిచి పెట్టినప్పుడు మాత్రమే మనము హృదయ పరివర్తన చెందిన విధంగా పరిగణించబడతాం అప్పుడు మాత్రమే మన యొక్క పాపములు క్షమించబడతాయని పేతురు గారు తెలుపుచున్నారు. మరి ఈరోజుల్లో మనందరం కూడా మనల్ని సరిదిద్దునప్పుడు ఎలాంటి హృదయంతో తీసుకోగలుగుతున్నాం. హృదయ పరివర్తనం చెందగలుగుతున్నామా? దేవుని వైపు మరలి వస్తున్నామా? లేక ఇంకా మనము కఠినంగానే పాపంలో జీవిస్తూనే ఉన్నామా? అని మనం ధ్యానం చేసుకోవాలి.
రెండవ పఠణంలో యోహాను గారు పాపము చేయవద్దు అని తెలుపుతున్నారు. మనము ఒకవేళ  బలహీనత వలన పాపము చేసినప్పటికీ మన తరుపున న్యాయవాది ఏసుప్రభు ఉన్నారని తెలిపారు. మనలను శిక్షకు గురి చేయకుండా తండ్రి యొక్క క్షమ పొందుకునేలాగా ఏసుప్రభు చేస్తారని యోహాను గారు తెలిపారు. 
యోహాను గారు మనము దేవుడిని ఎరిగి ఉండాలి అని కూడా తెలుపుచున్నారు అనగా దేవునికి విధేయత చూపుతూ ఆయన యొక్క ఆజ్ఞలను పాటించిన యెడల మనందరం కూడా దేవుడిని ఎరిగినవారంగా పరిగణించబడుతుంటాం. దేవుడిని తెలుసుకున్న వారు ఆయనకు విధేయత చూపుతారు ఎందుకంటే దేవుడిని తెలుసుకున్న వారికి ఆయన యొక్క ప్రేమ ఎంత గొప్పది, ఎంత విశాలమైనది, ఎంతో లోతైనది, ఆయన ఎంత కనికరం, త్యాగం ఎంత గొప్పవి అని అర్థం అవుతుంది. వాస్తవానికి దేవుడిని ఎరిగినటువంటి వారు సాధ్యమైన వరకు పాపములో పడిపోకుండా దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తారు అని యోహాను గారు స్పష్టంగా తెలియజేశారు కావున మనము కూడా దేవుడి యొక్క ఆజ్ఞలను సంపూర్ణంగా పాటిస్తూ పాపములు పడిపోకుండా జీవించాలి. 
ఈనాటి సువిషేశ భాగంలో ఎమ్మావు మార్గములో పునరుత్థాన ప్రభువుని తెలుసుకున్న శిష్యులు మిగతా శిష్యులకు జరిగిన సంఘటనలను తెలియచేసే సందర్భంలో ఏసుప్రభు వారి మధ్య ప్రత్యక్షమై మరొకసారి వారికి ధైర్యం ఇస్తూ తాను 'నేనే' అని తెలియజేశారు. ఏసుప్రభు శిష్యులకు పదే పదే దర్శనము ఎందుకు ఇస్తున్నారు అంటే వారి యొక్క విశ్వాసాన్ని బలపరచుట కొరకు అదే విధంగా వారి ఆయనకు సాక్షులుగా ఉండబోతున్నారు కాబట్టి వారు చూసినది మొత్తం నిజము అని వారు గ్రహించినప్పుడే దానిని ఇతరులకు గట్టిగా తెలియచేయగలరు కావున వారికి దర్శనమిచ్చారు. శిష్యులు ఎప్పుడూ కూడా ఒక మరణించిన వ్యక్తి మరలా శరీరంతో తిరిగి రావటం చూడలేదు కాబట్టి వారు ఏసుప్రభు యొక్క పునరుత్థానం విశ్వసించుట కొంచెం కష్టం అందుకే ప్రభువు వారికి పదేపదే దర్శనం ఇచ్చి వారి యొక్క విశ్వాస జీవితాన్ని బలపరిచారు. వారు ఏసుప్రభుకు సాక్షులుగా ఉండబోతున్నారు కాబట్టి వారికి  దర్శనం ఇచ్చారు. ఏసుప్రభు యొక్క పునరుత్థానమునకు మనం కూడా సాక్షులుగా జీవించాలి.
Fr. Bala Yesu OCD

6, ఏప్రిల్ 2024, శనివారం

పాస్కా రెండవ ఆదివారం

పాస్కా రెండవ ఆదివారం
క్రీస్తు దివ్య కారుణ్య పండుగ
అపో 4:32-35, 1యోహను 5:1-6, యోహాను 20:19-31
క్రీస్తునాధునియందు ప్రియమైన సహోదరీ సహోదరులారా ఈనాడు తల్లి శ్రీ సభ యేసు దివ్య కారుణ్య పండుగను కొనియాడుచున్నది. ప్రతి సంవత్సరం పాస్కా రెండవ ఆదివారమును దివ్యకారుణ్య ఆదివారంగా పిలుస్తూ ఉంటారు. పునీత రెండవ జాన్ పాల్ పాపు గారు ఈ యొక్క పండుగను ప్రపంచమంతట కొన్ని ఆడాలి అని 2000 సంవత్సరం ఏప్రిల్ 30వ తారీఖున అధికారికంగా ప్రకటించారు. ఈరోజు ప్రత్యేక విధముగా మనము ధ్యానించవలసినటువంటి అంశము ఏమిటి అంటే దేవుని యొక్క" దయ". 
పవిత్ర గ్రంథము మొత్తం కూడా దేవుని యొక్క దయ గురించి తెలియజేస్తుంది ఇంకొక విధంగా చెప్పాలి అంటే దేవుని యొక్క ప్రేమ గురించి తెలియజేస్తుంది(దయ, ప్రేమ, కనికరము, జాలి అనేవి ఒకే అర్థాన్నిచ్చే పదాలు). ప్రభు యొక్క దయలేనిదే మనము ఇప్పుడు సజీవులుగా ఉండలేము. ఆయన యొక్క కృప అపారమైనది అని పౌలు గారు తెలియజేస్తున్నారు .ఎఫేసి 2:4. దేవుని యొక్క దయ, కనికరం ఎవరూ కూడా వర్ణించలేరు ఎందుకంటే ఆయన అందరి యొక్క పాపములను క్షమించి వారి మీద దయ చూపుతూ ఉంటారు. పునీత తోమస్ అక్వేనస్ గారు దయ గురించి ఈ విధంగా అంటారు "దైవ ప్రేమ మానవుని యొక్క దీనస్థితిని కలుసుకున్నప్పుడు దేవుని యొక్క దయ జన్మిస్తూ ఉన్నది"అంటే మానవుడు పాపము చేసి ఒక దీనస్థితిలో ఉన్న సమయంలో దేవుడు ప్రేమ చూపించి మనలను ఆదుకుంటారు అది ఆయన యొక్క దయకు నిదర్శనం. ఏసుప్రభు వ్యభిచారమున పట్టుబడిన స్త్రీ యొక్క దీనస్థితిని చూసి నిరాశలో ఉన్న ఆమె చెంతకు వెళ్లి తన యొక్క ప్రేమతో ఆమెను కనికరించి తన పాపములను క్షమించారు. దేవుడు యొక్క దయ చాలా గొప్పది ఎందుకంటే మనందరం పాపము చేసిన సమయములో వెంటనే మనలను శిక్షించకుండా దేవుడు మనలని క్షమిస్తూ, మన మీద దయ చూపుతున్నారు.
పాత నిబంధన గ్రంథంలో దేవుని యొక్క దయ గురించి చాలా ఎక్కువగా చెప్పబడింది;
- ఆదాము అవ్వ పాపము చేసిన సమయంలో దేవుడు వారిని మరణ దండనకు గురి చేయక తన యొక్క దయతో క్షమించి ఏదేను తోట నుండి బయటకు పిలిపించి కష్టపడి పని చేసి జీవితం కొనసాగించమని వారికి తెలియజేశారు వారు చేసినటువంటి పాపములను దేవుడు క్షమించారు కాబట్టే వారిని మరణ దండనకు గురి చేయలేదు.
- ఇశ్రాయేలు ప్రజలు దేవుడితో చేసుకున్నటువంటి ఒడంబడికను పాటించుటలో అనేకసార్లు విఫలమయ్యారు అయినా గాని దేవుడు వారిని మరణ దండనకు గురి చేయలేదు. కేవలము వారికి తెలియచేయుట కొరకై వారిని కొన్ని సంవత్సరముల పాటు బానిసత్వములోనికి పంపించారు అయినప్పటికీ వారిని ప్రేమిస్తూనే, వారి మీద దయ చూపుతూనే ఉన్నారు.
- ప్రభువు అనేకమార్లు తన యొక్క ప్రవక్తలను పంపిస్తూ ప్రజల జీవితాలను బాగు చేస్తున్నారు ప్రజల జీవితాలను సరి చేసుకొని, యావే దేవునికి విధేయులై జీవిస్తే దేవుడు దయతో కాపాడతారని ప్రవక్తలు తెలియజేశారు కొన్ని సందర్భాలలో ప్రజలు తమ జీవితాలను మార్చుకొని దేవుడికి ఇష్టకరంగా జీవించారు. ప్రవక్తల యొక్క బోధనలలో ప్రజలకు ప్రతిసారి గుర్తు చేసే విషయం ఏమిటి అంటే దేవుని యొక్క దయ అపారమైనది. (నిర్గమ 34:6-7)
- దేవుడికి ఇష్టమైన దావీదు రాజు తప్పుచేసి దేవుని యొక్క మన్నింపు కోరిన సందర్భంలో దేవుడు అతడిని క్షమించారు 2 సమూయేలు 11:12, 24:10
ఎవరైతే దేవుని యొక్క దయ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారో వారిని దేవుడు ఎప్పుడూ కూడా కరుణిస్తూనే ఉంటారు ఆ ప్రార్ధించినటువంటి సమయములో వ్యక్తి పశ్చాతాప హృదయముతో ప్రార్థించాలి అప్పుడు మాత్రమే దేవుని యొక్క దయను పొందుతారు. వాస్తవానికి దేవుని యొక్క కనికరము మనలను అంగీకరిస్తుంది,
- ఆయన కనికరము మనలను గౌరవిస్తుంది
- ఆయన కనికరము మనకు సహాయపడుతుంది
- ఆయన కనికరము మనకు సమృద్ధిని ఒసగును
- ఆయన కనికరము మనల్ని క్షమిస్తుంది
- ఆయన కనికరము మనకు సానుభూతి చూపుతుంది.
దేవుని యొక్క దయ గురించి కొన్ని అంశాలను ధ్యానం చేసుకోవాలి.
1. దేవుని దయ మన పాపములను క్షమిస్తూ ఉంది.
ఈనాడు విన్న సువిశేష భాగములో యేసు ప్రభువు తన శిష్యులకు దర్శనమిస్తూ వారి యొక్క విశ్వాస జీవితాన్ని బలపరుస్తూ బాధలలో ఉన్నటువంటి వారికి ధైర్యం ఇస్తూ, సంతోషాన్నిస్తూ ఉన్నారు అదే విధముగా వారు ఆయన యొక్క పునరుత్థానమును సంపూర్ణముగా విశ్వసించనటువంటి ఆ యొక్క సందర్భంలో వారి యొక్క పాపములను కూడా ఏసుప్రభు క్షమిస్తూ ఉన్నారు. వారి యొక్క హృదయ కాఠిన్యమును మన్నిస్తున్నారు. ఏసుప్రభు తోమాస్ మీద కూడా కనికరము చూపిస్తున్నారు ఎందుకంటే మిగతా శిష్యులు దేవుని యొక్క దర్శనము పొందిన తర్వాత ఆ చెప్పిన విషయమును తోమాస్ గారు విశ్వసించకుండా ఇంకా అవిశ్వాసములో ఉన్నటువంటి తోమాస్ యొక్క పాపాలు క్షమిస్తూ ఆయన మీద దేవుడు కనికరము చూపిస్తున్నారు.
2. దేవుని దయ మన పాపాలను మరచిపోయేలాగా చేస్తుంది.
దేవుడు మనం చేసినటువంటి పాపములు అన్ని కూడా మరచిపోయి మనలను మరల అంగీకరించి, దీవిస్తారు. ఏసుప్రభు యొక్క మరణ సమయములో శిష్యులు చాలామంది ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు అయినా దేవుడు వారందరి యొక్క పాపములను, బలహీనతలను మరచిపోయి మరల వారికి పదే పదే దర్శనమిస్తూ వారి యొక్క విశ్వాస జీవితాన్ని బలపరిచారు. ఒకవేళ దేవుడే మన పాపములను మరిచిపోకపోతే మనము ఎంతటి శిక్షను పొందేటి వారమో? ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి.
3. దేవుని దయ మనలను శాంతితో నింపుతుంది
ఈనాడు విన్న సువిశేష భాగములో ఏసుప్రభు శిష్యుల యొక్క పాపములను క్షమించుట మాత్రమే కాదు చేసేది వారి హృదయాలలో ఉన్నటువంటి అలజడలను తీసివేసి, ఆందోళన తీసివేసి, భయాన్ని తీసివేసి వారి మీద దయ చూపుచు వారి యొక్క హృదయములను శాంతితో నింపుతున్నారు. దేవుడు మన పాపాలను క్షమించుట ద్వారా కూడా మనందరం ప్రశాంతముగా ఉండగలుగుతున్నాము. ఆయన శాంతి లేనిదే మనలో అశాంతి ఉంటుంది కాబట్టి దేవుడు మన మీద చూపించినటువంటి దయ మనము కూడా ఒకరి పట్ల ఒకరు చూపించాలి.
ఈనాడు విన్నటువంటి మొదటి పఠణంలో కూడా తొలి క్రైస్తవ సంఘం ఏ విధముగా ఒకరి పట్ల ఒకరు దయను కలిగి, ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ, ప్రేమించుకుంటూ, జీవించి ఉన్నారో తెలియజేస్తూ ఉన్నది. రెండవ పఠణంలో దేవుడిని ప్రేమిస్తూ జీవించేవారు కూడా పరస్పర సహాయము కలిగి ప్రేమించుకుని జీవించిన తెలియజేస్తున్నారు. ఈనాడు మనము యేసు దివ్య కారుణ్య పండుగను కొనియాడుతున్న సందర్భముగా మన మీద దేవుడు దయ చూపిన విధంగా మనం కూడా ఒకరి పట్ల ఒకరు దయ కనికరము చూపిస్తూ, ఒకరినొకరు క్షమించుకుంటూ జీవించాలి. దేవుడు మన యొక్క పాపాలు క్షమించిన విధంగా మనం కూడా దయతో ఇతరుల యొక్క పాపాలు క్షమించి వారిని కూడా అర్థం చేసుకొని జీవించాలి.
Fr. Bala Yesu OCD

30, మార్చి 2024, శనివారం

క్రీస్తు పునరుత్థాన సందేశం

క్రీస్తు పునరుత్థాన సందేశం

ఈనాడు తల్లి శ్రీ సభ క్రీస్తు ప్రభువు యొక్క పునరుత్థాన పండుగను కొని ఆడుచున్నది. ఒక్కసారి ఊహించండి మీ యొక్క డబ్బు మొత్తం కూడా స్టాక్ మార్కెట్లో, బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి మీరు లాభాల కోసం ఎదురు చూసినప్పుడు నీకు ఎదురు దెబ్బ తగిలి, నష్టం వచ్చిందనుకోండి మన పరిస్థితి ఏమిటి? మీరు ఎంతగానో ఊహించి ఉండవచ్చు లాభాలు వస్తాయని, అభివృద్ధి చెందుతారని,  పేరు ప్రతిష్టలు పెరిగితాయని కానీ అవి ఏమీ జరగకుండా ఆశలు అడి ఆశలైనపుడు మనం ఏవిధంగా తట్టుకోగలం. నష్టాలు వచ్చినా లాభాలు తర్వాత వస్తాయని మనం అనుకుంటామా లేక కృంగిపోతామా అది ఒక ప్రశ్నార్ధకం. ఏసుప్రభు యొక్క శిష్యులు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ ఒక్కసారిగా అవన్నీ కూలిపోయాయి.  మ్రాని కొమ్మల ఆదివారం రోజున ఆయనను మెస్సయ్యగా, స్వేచ్ఛ నిచ్చే వానిగా, ప్రజలను రక్షించే వానిగా వారు గుర్తించి, ప్రభువును యెరుషలేము వీధుల్లో గొప్పగా గౌరవిస్తూ ఆహ్వానించుకుంటూ వచ్చారు కానీ పవిత్ర శుక్రవారం రోజున ఆయన వారి యొక్క ఆశలకు భిన్నంగా సిలువ మీద నిస్సహాయం స్థితిలో మరణించుట చూసి శిష్యుల యొక్క ఆశలు అంతా కూడా ఆవిరైపోయాయి. 
వాస్తవానికి మరణంతో జీవితం అంతం అవటం లేదు అలాగే మరణంతో జీవితం నాశనంమగుట లేదు. మరణం తర్వాత జీవితం ఉందని క్రీస్తు ప్రభువు యొక్క పునరుత్థానం తెలియజేస్తుంది. అదే శాశ్వత జీవితం. ఆయన మరణంతో అంధకారంగా మారిన భూమి క్రీస్తు ప్రభువు యొక్క పునరుత్థానం ద్వారా ప్రకాశిస్తుంది. ఏసుప్రభు మరణమును జయిస్తున్నారు. ఏసుప్రభు యొక్క పునరుత్థానం మన యొక్క క్రైస్తవ విశ్వాస జీవితానికి పునాది ఎందుకంటే ఆయన పునరుత్థానం అవ్వనిదే మన యొక్క విశ్వాసం వ్యర్థం అని అపోస్తులు పలుకుతున్నారు. ప్రభువు యొక్క పునరుత్థానము ద్వారా మనము నేర్చుకోవలసినటువంటి కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు.
1. ఖాళీ సమాధి. 
ఈ భూలోకంలో చాలా మంది మరణించారు కానీ వారిలో ఎవరి సమాధి కూడా ఖాళీగా లేదు. మతాలను స్థాపించిన వారు ఉన్నారు,సమాజంలో పేరు ఉన్నవారు ఉన్నారు, అద్భుతాలు చేసిన వారున్నారు, కానీ వారి యొక్క సమాధి ఏది కూడా ఖాళీగా లేదు కేవలం క్రీస్తు ప్రభువు యొక్క సమాధి మాత్రమే ఖాళీగా ఉంది ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. 
ఈ యొక్క ఖాళీ సమాధిని చూసినప్పుడు మనము నేర్చుకోవలసిన అంశం ఏమిటి అంటే ఆ సమాధి ఖాళీగా ఉన్న విధంగా మన హృదయాలు దేవుని కొరకు ఖాళీగా ఉన్నాయా లేదా ఇంకా మన హృదయాలను పాపమును, ద్వేషమును, కోపములను, కక్షులను ఉంచుకొని మన యొక్క హృదయాలను నింపుకుంటున్నామా. ప్రభువు యొక్క పునరుత్థానం మనందరినీ తనతో నింపుకొనమని తెలియజేస్తూ ఉన్నది.
2. దేవుడిని వెదకే వారికి ప్రభువు చేరువులోనే ఉంటా రు. 
మగ్ధల మరియమ్మ ఏసుప్రభువును వెతుకుతూ సమాధి దగ్గరకు చేరుకున్నది కాబట్టే ఆమెకు దేవుడు మొదటిగా దర్శనం ఇస్తున్నారు. ఆమె ఎంతగా దేవుడు ఎడల భక్తి, విశ్వాసము, ప్రేమ కలిగి ఉంటే అంతగా తెల్లగా తెల్లవారకముందే, తొలికోడి కోయకముందే పరిగెత్తుతూ ప్రభువు సమాధి వద్దకు వెళుతుంది ఆమె యొక్క నిస్వార్ధమైనటువంటి  వెతుకుటలో ప్రభు ఆమెకు దర్శనం ఇస్తున్నారు. ఎవరైతే దేవుని వెతుకుతూ వస్తూ ఉంటారు వారికి దేవుడు ఎప్పుడు దగ్గరగానే ఉంటారు. మరి మనం దేవుని వెతుకుచున్నామా, దేవుని సమీపిస్తున్నా మా? శిష్యులు కూడా ఏసుప్రభు కొరకు వెతుకుచున్నారు కాబట్టి వారికి కూడా దర్శనము ఇవ్వబడింది.
3. నూతన జీవం
పునరుత్థానం శిష్యుల యొక్క జీవితమును మార్చినది, మరీ ముఖ్యంగా పేతురు యొక్క జీవితమును మార్చినది ఎందుకనగా అప్పటివరకు కూడా భయంగా ఉన్నటువంటి పేతురు ఒక్కసారిగా ఏసుప్రభువు పునరుత్థానమయ్యారు అని తెలుసుకున్న తర్వాత వెంటనే ఆయన్ను కలుసుకొనుటకై పరిగెత్తుతూ వెళ్ళాడు ఆయన ధైర్యం తెచ్చుకున్నాడు. క్రీస్తు ప్రభువును ఏ విధంగానైనా చూడాలనుకున్నాడు అందుకని తెల్లవారుజామున సమాధి వద్దకు పరిగెడుతూ వస్తున్నారు.
4. నీవు కోల్పోయిన వ్యక్తి దగ్గరకు వెళ్ళటం
శిష్యులు, మగ్ధల మరియమ్మ వారి కోల్పోయినటువంటి గురువు దగ్గరకు వెళుతున్నారు. ఈ యొక్క తపస్సు కాలం ముగిసిన తర్వాత పునరుత్థానంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో మనము కూడా మన యొక్క మాటల వలన చాలా మందిని కోల్పోయివుంటాం కాబట్టి వారి దగ్గరికి వెళ్లి మనము వారితో సఖ్యపడాలి, కలిసిపోవాలి వారితో ఉండాలి.
5. సాక్షిగా ఉండుట
శిష్యులు మరియు మరదలా మరియ ఏసుప్రభు చూసిన తర్వాత ఆయన గురించి సాక్ష్యం చెబుతున్నారు జరిగిన విషయంలో మిగతా వ్యక్తులతో పంచుతున్నారు వారు ఏదైతే కనులారా చూశారో, తమ యొక్క జీవితంలో అనుభవించారు దానిని ఇతరులకు తెలియజేస్తున్నారు అదేవిధంగా మనం కూడా క్రీస్తు ప్రేమను తెలియజేయాలి.
ప్రభువు పునరుత్థానం, మనలో శాంతి సమాధానము తీసుకురావాలి అలాగే కృంగిపోయిన తర్వాత నిరాశ పడకుండా ముందుకు ఒక ఆశతో నమ్మకంతో వెళ్లడం నేర్చుకోవాలి.
Fr. Bala Yesu OCD

23, మార్చి 2024, శనివారం

మ్రాని కొమ్మల ఆదివారం

మ్రాని కొమ్మల ఆదివారం
యెషయా 50:4-7, ఫిలిప్పి 2:6-11, మార్కు 14:1-15,47
ఈనాడు తల్లి శ్రీ సభ మ్రాని కొమ్మల ఆదివారమును కొనియాడుచున్నది. ఏసుప్రభు యెరుషలేము పట్టణము వచ్చుచున్నాడని కొందరు విని ఆయనకు స్వాగతం పలకడానికి ఎదురెళ్ళారు. ఈ యొక్క మ్రాని కొమ్మల రోజు ఏసుప్రభు యొక్క జీవితంలో ప్రత్యేకమైనటువంటి రోజు ఒక విధముగా చెప్పాలంటే సంతోషకరమైన రోజు ఎందుకంటే ప్రజలు ఆయనను మెస్సయ్యగా గుర్తించి ఆయనకు ఘన స్వాగతం పలికారు. తమ యొక్క హస్తాలతో తాటి ఆకులను ధరించి ఏసు ప్రభువుకి ఎదురు వెళ్లి జయ జయ నినాదాలు తెలిపారు. ప్రజలందరూ ఏసుప్రభువును రాజుగా ఊహించుకుని, ఆయన వారికి స్వేచ్ఛనిస్తారు అని భావించారు. ఏసుప్రభువుకి ప్రజలు అంత ఘన ఆహ్వానం ఎందుకు పలికారంటే ఆయన యొక్క అద్భుత కార్యములు అదేవిధంగా ఆయన చూపించిన ఒక జీవిత నిదర్శనం(పేదవారి కొరకు పోరాడటం) ప్రజల జీవితంలో కొత్త ఆశలను నమ్మకాన్ని కలుగజేసినది. ప్రభువు పేదవారి పక్షమున పోరాడుట వలన అనేకమందిలో ఒక కొత్త నమ్మకం వచ్చినది. ఇతడు నిజముగా ప్రజల కోసం వచ్చారని ప్రజల సమస్యల నుండి కాపాడతారని వారి నమ్మకం అందుకే ఆయన రాజుగా చేయాలని ఆయనకు ఆహ్వానం పలికారు.
ఈనాటి పండుగను ఉద్దేశించి కొన్ని అంశములు ధ్యానం చేసుకోవాలి
1. ప్రవక్తల యొక్క ప్రవచనం నెరవేరినది.
మెస్సయ్య గాడిద పిల్ల మీద వస్తాడు అని ప్రవచనాలు తెలియచేయబడ్డాయి. జెకార్య 9:9. ఏసుప్రభు తన శిష్యులను పంపించి తన కొరకై ఒక ఇంటి యజమాని గాడిదను ఇవ్వమని అడగమని తెలిపారు (మార్కు 14.:13) ఆ యొక్క ఇంటి యజమానుడు కూడా శిష్యులు వచ్చి గాడిదను అడిగిన వెంటనే కట్టి ఉన్నటువంటి గాడిదను శిష్యులకి ఇస్తున్నారు ఎందుకంటే బహుశా ఆయన యేసు ప్రభువు యొక్క గొప్పతనం గురించి విని ఉండవచ్చు అందుకని వేరొక ఒక్క మాట మాట్లాడకుండా ఇది దేవుని కొరకు వినియోగించబడుతున్నది అని సంతోషముగా ఈ యొక్క గాడిదను శిష్యులకి ఇచ్చి పంపించారు.
ప్రభువు గాడిదను ఎన్నుకొనుట ఆయనకు ఇష్టం ఎందుకంటే పూర్వం గుర్రం కన్నా గాడిదలనే ముందుగా ప్రయాణాలకు వినియోగించేవారు( 2 సమూ13:29, 1 రాజులు 1:38). అదేవిధంగా పూర్వం రాజులు యుద్ధం చేయటానికి వెళ్లేటప్పుడు గుర్రం మీద వెళ్లేవారు కానీ ఎవరైతే శాంతిని నెలకొల్పాలనుకున్నారో వారు మాత్రము గాడిద మీద వెళ్లేవారు. ఏసుప్రభు మనలను తండ్రితో సమాధానపరుచుట కొరకే ఈ యొక్క గాడిద పిల్లను ఎన్నుకుంటున్నారు. గాడిదను ఎన్నుకొనుటకు కారణాలు
1. గాడిద శాంతికి గుర్తు
2. గాడిద ఎంత బరువునైనా మోయుటకు గుర్తు
3. గాడిద వినమ్రతకు గుర్తు
4. గాడిద యజమాని చెప్పినది చేయుటకు గుర్తు
5. గాడిద సేవకు గుర్తు
6. గాడిద బాధలు అనుభవించుటకు గుర్తు
పూర్వం చాలా మంది గాడిద మీద ప్రయాణం చేసి ఉన్నారు.
- సొలోమోను కూడా తన తండ్రి గాడిద మీద సింహాసనం అధిష్టించే రోజున వచ్చి ఉన్నారు.
1 రాజులు 1:38-41
- సౌలు కుమారుడు కూడా గాడిద మీదే వచ్చి ఉన్నారు 2 సమూ19:26
- ఏసుప్రభు తీసుకురమ్మన్న గాడిదను ఎవ్వరు ఎన్నడను వాడలేదు మొట్టమొదటిగా యేసు ప్రభువు మాత్రమే వాడుతున్నారు.
- ఏసుప్రభు ఈ యొక్క గాడిద పిల్లను విడుదల చేస్తున్నారు అప్పటివరకు కూడా అది కట్టి వేయబడినది అటు తరువాత ప్రభువు తన యొక్క ప్రమేయంతో విడుదల చేస్తున్నారు అదియే మన యొక్క జీవితంలో కూడా నెరవేర్చబడుతుంది పాపమునకు, వ్యసనములకు కట్టి వేయబడుచున్న మనలను దేవుడు తన యొక్క కుమారుడు యొక్క మరణము ద్వారా విముక్తులను చేస్తున్నారు కాబట్టి మనము దేవుని ప్రేమను గుర్తించి మారుమనస్సు పొందాలి.
2. హోసన్న అనగా-Save us now (ఇప్పుడు మమ్ము రక్షించు ప్రభు అని అర్థం) ఎలాంటి సందర్భంలో మనము ఇతరులను రక్షించమని అడుగుతాం?. మనలని మనము రక్షించుకోలేని సందర్భంలో అలాగే ఆపదలో చిక్కుకున్న సమయంలో మన యొక్క శక్తి సామర్థ్యం వలన సాధ్యము కాని విషయం తలంచుకున్నప్పుడు ఇతరుల యొక్క సహాయం కోరుతూ రక్షించమని అడుగుతూ ఉంటాం. ఏసుప్రభువు కాలంలో కూడా ప్రజలు ప్రార్ధించినది ఇదియే. ఇప్పటివరకు కూడా స్వేచ్ఛ లేకుండా బ్రతుకుచున్నటువంటి మమ్ములను రక్షించమని ప్రార్థిస్తున్నారు. వాస్తవానికి దేవునికి రక్షించమని ప్రార్థించిన ప్రతి వ్యక్తిని రక్షిస్తున్నారు.
- ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం లో ఉన్నప్పుడు మమ్ము రక్షించమని ప్రార్థించారు దేవుడు వారిని రక్షించారు. నిర్గమ 3:7
- ఇశ్రాయేలు ప్రజలు పాము కాటుకు గురైనప్పుడు రక్షించమని ప్రార్థించారు సంఖ్యా 21:7
- ఎస్తేరు తన ప్రజలను ఆపదనుండి రక్షించమని దేవునికి ప్రార్థించింది (ఎస్తేరు 4)
- భర్తిమయి అనే గుడ్డివాడు రక్షించమని ప్రార్థించారు. లూకా 18:38
- సిలువ మీద ఏసుప్రభు పక్కన ఉన్న దొంగ కూడా రక్షించమని ప్రార్థించారు. (లూకా 23:42)
ఇంకా చాలా సందర్భాలలో ప్రజలు రక్షించమని కోరినప్పుడు ప్రభువు తన ప్రజలను రక్షిస్తున్నారు. ఆయన యొక్క మరణము ద్వారా మనందరం కూడా రక్షించబడుతున్నాం.
3. ప్రభువు ముందు ఉండుట.
కేవలము మ్రాని కొమ్మల ఆదివారం రోజున యాజకుడు అందరికన్నా ముందుగా ప్రయాణమై పోవుతుంటారు. ఇది ఎందుకంటే దేవుడే మనకు ముందుండి అన్ని విషయాలలో నడుస్తారు. ఏసుప్రభు మనము అనుభవించేటటువంటి శ్రమలకు బదులుగా ఆయనే ముందుండి మన కొరకు అన్ని బాధలు పొందటానికి సిద్ధపడ్డారు. నిర్గమకాండంలో కూడా మనం చూస్తాం యావే దేవుడే ఇశ్రాయేలు ప్రజలకు రాత్రి అగ్నిస్తంభముగా పగలు మేఘస్తంభంగా వారి ముందుండి నడిచారు. మనము అనుభవించవలసిన శ్రమలు మరణం నిందలు అవమానాలు అన్నీ కూడా ఏసుప్రభు మన కొరకై అనుభవించారు కాబట్టి ఈరోజు మనము ఆ ప్రభువు యొక్క ప్రేమను తెలుసుకొని మన జీవితంలను మార్చుకొనుటకు ప్రయత్నం చేయాలి. దేవుని ప్రేమ గొప్పది ఆ ప్రేమను అర్థం చేసుకొని మనం జీవించాలి.
Fr. Bala Yesu OCD

16, మార్చి 2024, శనివారం

తపస్సు కాలం ఐదవ ఆదివారం

తపస్సు కాలం ఐదవ ఆదివారం
యిర్మియ 31:31-34 హెబ్రీ 5:7-9, యోహాను 12:20-33

ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుడు తన ప్రజలతో ఏర్పరచుకున్న నూతన ఒడంబడికను గురించి అదేవిధంగా ప్రభువు పొందబోవు మరణము గురించి తెలియజేస్తున్నాయి. ఏసుక్రీస్తు ప్రభువు యొక్క పునరుత్థానమునకు దగ్గరవుతున్న వేళలో శ్రీ సభ మనమందరం ఆయన యొక్క మరణము, పునరుత్థానము గురించి ధ్యానించమని తెలుపుచున్నది.
ఈనాటి మొదటి పఠణంలో దేవుడు యిర్మియా ప్రవక్త ద్వారా తన ప్రజలతో ఏర్పరుచుకుంటున్న ఒక నూతన ఒడంబడిన గురించి తెలుపుచున్నారు. యిర్మియ ప్రవక్త క్రీస్తుపూర్వం 650 - 580  సంవత్సర మధ్యకాలంలో జీవించారు. ఆయన యొక్క పరిచర్య మొత్తం కూడా యెరూషలేములో జరిగినది. యిర్మియ ప్రవక్త ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో దేవుడిని విస్మరించిన సందర్భంలో యూదుల మధ్య జీవించారు. యూదయ రాజ్యాన్ని అంధకారం ఆవరించినటువంటి సమయం అది. ప్రజలు పాపమునే ప్రేమించి దేవుడికి దూరమైన సందర్భంలో దేవుడు వారిని బాబిలోనియా  బానిసత్వమునకు పంపగా అక్కడ వారు జీవమును కోల్పోయిన విధముగా ఉన్న సమయంలో వారి బాధను చూసి దేవుడు, నూతన ఒడంబడిక ఏర్పరచుకుంటాన‌ని  తెలుపుచున్నారు. వాస్తవానికి ఎందుకు ఈ నూతన వడంబడిక? అని ధ్యానించినట్లయితే మనకు అర్థమయ్యే అంశము ఏమిటి అంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క మొదటి ఒడంబడిక నెరవేర్చుటలో విఫలమయ్యారు 2రాజలు దిన 36:14-16,21. అందుకే దేవుడు వారికి ఇంకొక అవకాశంను దయచేసి ఉన్నారు. ఇది ఆయన యొక్క మంచితనమునకు నిదర్శనం. పడిపోయినటువంటి తన ప్రజలు మరలా లేచి తనను అనుసరించాలి అన్నది ప్రభువు యొక్క కోరిక. అందుకని ఇంకొక ఒడంబడిక ద్వారా వారికి కొత్త జీవితం ఇస్తున్నారు. దేవుడు ప్రతి ఒక్కరి మార్పుకై అవకాశాన్ని ఇస్తూనే ఉంటూ ఉంటారు అందుకే ఆయన తన యొక్క సేవకులను పదేపదే వారి హృదయ పరివర్తనముకై పంపిస్తూ ఉంటారు. 
ఇశ్రాయేలు ప్రజలు దేవుడి యొక్క మాట ప్రకారంగా జీవించలేదు కాబట్టే ఆయన వారికి ఇంకొక అవకాశాన్ని దయచేసి ఒక నూతన క్షమించే ఒడంబడికను వారితో ఏర్పరచుకుంటున్నారు. పాత బడంబడిక రాతి పలక మీద దేవుని చట్టం రాయబడినట్లైతే, నూతన బడంబడిక ప్రతి ఒక్కరి యొక్క హృదయము మీద వ్రాయబడుతున్నది. రాతి పలక మీద రాసిన దేవుని చట్టం పగిలిపోవచ్చు, చెరిగిపోవచ్చు కానీ మానవుని యొక్క హృదయము మీద రాసినటువంటి దేవుని యొక్క చట్టము ఎన్నడూ మారదు, ఎవరూ కూడా దానిని ఎవరూ కూడా దానిని మన నుండి తీసివేయలేరు. ఇంతకుముందు  దేవుని చట్టం మనకు బయటగా ఉన్నది కానీ ఇప్పుడు మాత్రం దేవుని చట్టం మన హృదయాంతరంగంలోనే ఉన్నది ఆ చట్టం మనందరిని కూడా ప్రతినిత్యం ఎలా జీవించాలో? ఏమి చేయాలో ? అని ప్రేరేపిస్తూ ఉన్నది కావున ఇంకా ఎన్నడు మనము తప్పు చేయకుండా జీవిస్తాం. యిర్మియా ప్రవక్త యొక్క నూతన ఒడంబడిక  దేవుడు ఒక కొత్త జీవితానికి సూచనగా ఉన్నది అలాగే ఈ నూతన ఒడంబడిక యెహెజ్కేలు( 16:26-27)గ్రంథములో ఉన్న నూతన హృదయమును సూచిస్తున్నది దేవుడు మానవులలో ఉన్నటువంటి కఠిన హృదయమును తీసివేసి మాంసపు ముద్ద కలిగిన హృదయాన్ని దయచేస్తానని అంటున్నారు అనగా ప్రతి ఒక్కరికి కొత్త జీవితాన్ని దయచేస్తానంటున్నారు.
ఈనాటి రెండవ పఠణంలో ఏసుప్రభు ఏ విధంగా తండ్రికి విధేయత చూపించి ఉన్నారో తెలియచేయబడినది. ఆయన తండ్రితో అన్నిటిలో సరిసమానమైనప్పటికీ కూడా ఆయన చిత్తమును ఈ భూలోకములో ఎంత కష్టమైనా నెరవేర్చి ఉన్నారు.
ఈనాటి సువిశేష భాగములో యేసు ప్రభువు మనము జీవించాలి(పవిత్రముగా దేవునితో) అంటే మరణించాలి అని (పాపానికి)  చెబుతున్నారు. కొందరు గ్రీకులు యేసు ప్రభువుని చూడటానికి వచ్చిన సందర్భంలో ఫిలిప్పుతో ఏసుప్రభు ని చూడాలి అని అడిగిన వేళ ఫిలిప్పు అంద్రెయ్యతో వారు ప్రభువుని చూడాలని తెలిపాడు. ప్రభువు దానికి గాను మనుష్యకుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చినది అని తెలిపారు అదేవిధంగా ఏసుప్రభు ఈ విధంగా అంటున్నారు మనిషి కుమారుడు పైకి ఎత్తబడినప్పుడు అందరూ ఆయన వద్దకు ఆకర్షితులవుతారని అన్నారు. ఆయన మరణించక ముందే జ్ఞానానికి ప్రసిద్ధిగాంచినటువంటి గ్రీకు దేశస్తులే ఆయన యొక్క గొప్పతనమును చూడాలని ఏసుప్రభు చెంతకు వస్తున్నారు బహుశా వారు యూదా మతమును అనుచరించుటకు హృదయ పరివర్తనము చెందినటువంటివారై ఉండవచ్చు లేదా ఏసుప్రభు యొక్క గొప్పతనం విని ఆయనను చూడాలని అనుకుని ఉండవచ్చు. ఇది చాలా గొప్పదైన విషయం జ్ఞానులు సైతం దేవుడిని గుర్తించి ఆయన దగ్గరకు రావడం. ఈ యొక్క సందర్భంలో ఏసుప్రభు గోధుమ గింజ భూమిలో పడి నశించనంతవరకు అది అట్లే ఉండును కానీ నశిస్తే దాని నుండి కొత్త జీవము పుట్టును అని తెలిపారు. ఇక్కడ విత్తనము నశించితేనే తప్ప కొత్త జీవితం రావటం లేదు అదే విధంగా విత్తనము తనను తాను త్యాగం చేసుకుని మొక్కకు జన్మనిస్తుంది, ఉప్పు కూడా తనను తాను కరిగిపోతూ ఇతరులకు రుచిని అందజేస్తూ ఉన్నది అలాగే కొవ్వొత్తి కూడా  తాను కరిగిపోతూ ఇతరులకు వెలుగునిస్తుంది. 
వాస్తవానికి మనందరం కూడా నశించాలి. నశించుట అంటే మన యొక్క పాత జీవితానికి, 
- పాపపు జీవితానికి,
- స్వార్థానికి
- కోపానికి
- అసూయలకు
- సుఖ భోగాలకు
- ఈ లోక సంబంధమైన వాంఛలకు
- చెడు వ్యసనాలకు మనము మరణించినట్లయితే అప్పుడే మనలో కొత్త జీవితం కలుగుతుంది.
అదేవిధంగా ఈనాటి సువిశేష భాగములో ఏసుప్రభు మన అందరిని కూడా ఆయనకు సాక్షులుగా ఉండమని తెలుపుచున్నారు. తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్యజీవమునుకై కాపాడుకొనును, నన్ను సేవింప గోరువాడు నన్ను వెంబడింపవలెను అని క్రీస్తు ప్రభువు తెలియచేశారు అనగా మన యొక్క జీవితం క్రీస్తు జీవితం వలే త్యాగ పూరితమైన జీవితంలా ఉండాలి.

Fr. Bala Yesu OCD

లూకా 5: 33-39

  లూకా 5: 33-39 "యోహాను శిష్యులు తరచుగా ఉపవాసములు, ప్రార్ధనలు చేసెదరు. అటులనే పరిసయ్యుల శిష్యులను చేయుదురు. కాని, మీ శిష్యులు మాత్రము త...